పూజా కార్యక్రమాలతో పద్మజ ఫిలిం ఫ్యాక్టరీ చిత్రం ప్రారంభం

వి వి రుషిక దర్శకత్వంలో నిర్మాత హనుమంత్ రావు నాయుడు నిర్మిస్తున్న ప్రొడక్షన్ 2 చిత్రం అన్నపూర్ణ స్టూడియోలో పూజ కార్యక్రమాలతో ప్రారంభం అయింది. ముహూర్తపు సన్నివేశానికి  ‘ఎంఎల్ఏ’ ఫేమ్ దర్శకుడు ఉపేంద్ర క్లాప్ ఇవ్వగా, నిర్మాత డి ఎస్ రావు కెమెరా స్విచ్ ఆన్ చేయగా తొలి షాట్ కు చిత్ర దర్శకురాలు రుషిక గౌరవ దర్శకత్వం వహించారు. పద్మజ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ పై తొలి ప్రయత్నంగా తీసిన ‘ఇక్షు’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉండగానే ఈ బ్యానర్ లో ఈ రెండో సినిమాను మొదలెట్టారు. ‘ఇక్షు’ చిత్రానికి దర్శకత్వం వహించిన వి వి రుషిక దర్శకత్వంలోనే ఈ చిత్రం కూడా చెయ్యడం విశేషం.
రుషిక మాట్లాడుతూ .. “నేను తీసిన మొదటి సినిమా ఇంకా విడుదల కాకముందే రెండో సినిమాకు ఛాన్స్ రావడం. ఈ సందర్బంగా నిర్మాత హనుమంత్ రావు గారికి థాంక్స్ చెబుతున్నాను. అలాగే సాయి కార్తీక్ కు కూడా. లీడ్ రోల్ చేస్తున్న రామాగ్నివేశ్ చాలా టాలెంట్ ఉన్న అబ్బాయి. సీనియర్ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ ను చాలా అద్భుతంగా చెప్పాడు. కథ గురించి చెప్పాలంటే.. పేరెంట్స్, పిల్లల మధ్య జరిగే సన్నివేశాలతో ఉంటుంది. ఎమోషన్, కామెడీ, ఫ్యామిలీ, అన్ని అంశాలు ఉన్న సినిమా ఇది”  అని అన్నారు.
నిర్మాత హనుమంత్ రావు నాయుడు మాట్లాడుతూ .. “మా బ్యానర్ లో ఇది రెండో సినిమా. మేము నిర్మించిన మొదటి సినిమా ఇక్షు సినిమాను తెరకెక్కించిన విధానం బాగా నచ్చడంతో అదే దర్శకురాలితో రెండో సినిమా చేస్తున్నందుకు ఆనందంగా ఉంది” అన్నారు.
హీరో రామ్ అగ్నివేశ్ మాట్లాడుతూ .. ఈ బ్యానర్ లో నా రెండో చిత్రమిది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్ అన్నారు.
కో ప్రొడ్యూసర్ సాయి కార్తీక్ మాట్లాడుతూ .. ” మొదటి ప్రయత్నంగా ఇక్షు అనే చిత్రాన్ని నిర్మించాం. అది విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇది ఓ మిడిల్ క్లాస్ జీవితాలలో జరిగే కథ. ముఖ్యంగా తండ్రి, కొడుకు నేపథ్యంలో సాగుతుంది. ఇక్షు చిత్రానికి అద్భుతంగా దర్శకత్వం వహించిన రుషిక గారే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ దసరా తరువాత ప్రారంభిస్తాం” అన్నారు.