మూడు సినిమాలకి సీక్వెల్స్ చేస్తున్నా !

‘పందెంకోడి’ విశాల్‌… చిత్రంతో తమిళ్‌, తెలుగు ప్రేక్షకుల్లో మాస్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విశాల్‌ నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘పందెంకోడి-2’. ఈ చిత్రం దసరా సందర్భంగా తెలుగులో విడుదలై ఎక్స్‌ట్రార్డినరీ ఓపెనింగ్స్‌ సాధించి సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోంది. ఈ సందర్భంగా మాస్‌ హీరో విశాల్‌తో  ఇంటర్వ్యూ…
‘పందెంకోడి 2’తో మరో సక్సెస్‌.. ఎలా ఉంది?
-పందెంకోడి 2 ఫలితం చాలా సంతోషాన్నిచ్చింది. బి, సి సెంటర్స్‌లో ఇంత మంచి కలెక్షన్స్‌ వస్తాయని అనుకోలేదు. మార్కెట్‌లో ఇప్పటికీ కలెక్షన్స్‌ బాగానే ఉన్నాయి. ‘పందెంకోడి 2’ సినిమా మంచి కలెక్షన్స్‌ సాధించడం నా తర్వాత సినిమాకి ప్లస్‌ అవుతుంది.
మరి ‘పందెంకోడి 3’ ఎప్పుడు చేస్తున్నారు?
– లింగుస్వామి మంచి ఐడియాతో ‘పందెంకోడి-3’ స్క్రిప్ట్‌ను రాస్తున్నారు. ఇది వరకులా 13 సంవత్సరాలు కాకుండా వీలైనంత త్వరగానే సినిమా చేయాలనుకుంటున్నాను.
‘డిటెక్టివ్‌ 2’ ఎప్పుడు స్టార్ట్‌ అవుతుంది?
– ‘డిటెక్టివ్‌ 2’ సినిమా విదేశాల్లో చిత్రీకరణ చేయబోతున్నాం. అక్కడ ఓ కేసును సాల్వ్‌ చేయడానికి హీరో వెళతాడు. సాధారణంగా మనం చిన్నప్పటి నుండి హాలీవుడ్‌ సినిమాలు చూస్తూ పెరిగాం. ఆ తరహా కథలతో సినిమా చేయాలని అందరికీ ఉంటుంది. డిటెక్టివ్‌ ఆ స్టయిల్‌ ఆఫ్‌ మూవీ. డిటెక్టివ్‌ ఆరు భాగాలుగా చేయాలని డైరెక్టర్‌ మిస్కిన్‌గారు అనుకుంటున్నారు. ఆయనతో సినిమా చేయడానికి నేను ఎప్పుడూ ఇష్టపడతాను.
క్యారెక్టర్స్‌ మిమ్మల్ని ఎంగేజ్‌ చేస్తుంటాయా?
– దాదాపు అలాంటి సందర్భాలు తక్కువే అని చెప్పాలి. అలా నన్ను ఎంగేజ్‌ చేసిన క్యారెక్టర్స్‌లో ‘వాడు వీడు’ సినిమాలో నేను చేసిన పాత్ర అనే చెప్పాలి. సాధారణంగా నేను పెద్దగా హోం వర్క్‌ చేయను. సెట్స్‌లోకి వెళ్లి డైరెక్టర్‌ ఏం చెబితే అది చేస్తాను. ఎందుకంటే నా డైరెక్టర్స్‌ అందరూ బ్రిలియంట్‌ యాక్టర్స్‌. ప్రతి ఒక్కరూ నన్ను డిఫరెంట్‌గా చూపించడానికి ప్రయత్నిస్తారు.
 మీరు ఏ సీక్వెల్‌ను ముందుగా చేయబోతున్నారు?
– మూడు సినిమాలు వేర్వేరు జోనర్స్‌కు చెందినవి. ‘పందెంకోడి 3’ కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ముందుగా ‘అభిమన్యుడు 2’ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం జరుగుతున్న విషయాలను తెరపై చూపించడానికి చాలా బావుంటాయి. మన ఫోన్‌ ద్వారా వచ్చే ఇబ్బందులు మనకు తెలియకుండానే, మన సమాచారాన్ని మరొకరికి ఇచ్చేస్తాయి. వాటి వల్ల దుర్వినియోగం జరుగుతుంది. అలాంటి మరో కొత్త కాన్సెప్ట్‌తో ‘అభిమన్యుడు 2’ చేస్తున్నాను.
‘టెంపర్‌’ రీమేక్‌ చేయడానికి కారణమేంటి?
– ప్రస్తుతం సమాజంలో జరిగే మీటూ వంటి ఘటనలకు కనెక్ట్‌ అయ్యేలా ఉండే సినిమా ఇది. తెలుగుకి.. తమిళ్‌కి మార్పులు చేసి ‘అయోగ్య’ పేరుతో రీమేక్‌ చేయబోతున్నాం. ఎన్టీఆర్‌ చేసిన పాత్రలు, సినిమాలు పది, పదిహేను సంవత్సరాలు ఇంపాక్ట్‌ ఉంటుంది. కాబట్టి ఎన్టీఆర్ పెర్ఫామెన్స్‌ను ఈక్వల్‌ చేసి నటిస్తానని అనుకోవడం లేదు. సెక్సువల్‌ హరాస్మెంట్‌, రేప్‌లకు జరిగినప్పుడు ఎలాంటి న్యాయం కావాలనే దాన్ని సినిమాగా చూపించిన తీరు ఎంతో బావుంటుంది. నేను కూడా సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.
‘టెంపర్‌’ కంటే ముందు మరేదైనా రీమేక్‌ల కోసం అప్రోచ్‌ అయ్యారా?
– అయ్యారండీ.. బోలెడు సినిమాలకు అయ్యారు. ‘మిర్చి’, ‘అత్తారింటికి దారేది’ ఇలా సినిమాలున్నాయి. అయితే అప్పటికే ఉన్న కమిట్‌మెంట్స్‌ కారణంగా చేయలేకపోయాను. మంచి సామాజిక కారణం ఉండటంతో ‘టెంపర్‌’ రీమేక్‌లో నటిస్తున్నాను.
‘మీ టూ’ ఉద్యమం పై ‘నడిగర్‌ సంఘం’ నుండి ఎలాంటి చర్యలు తీసుకున్నారు?
– నిర్మాతల వైపు నుండి ముగ్గురు సభ్యులున్న కమిటీని… బాధితుల తరపు నుండి ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశాం. ఇప్పుడున్న సమస్యలే కాకుండా భవిష్యత్‌లో రాబోయే నటీనటులకు భరోసా ఇచ్చేలా పారదర్శక నిర్ణయాలను తీసుకుంటాం. ఇందులో కౌన్సిలింగ్‌ కూడా ఇస్తాం. ఏదైనా నేరం జరిగినప్పుడు.. ఏమీ మాట్లాడకపోవడం కూడా సెక్షన్‌ 201 ప్రకారం నేరమే. ఏదైనా జరిగినప్పుడు వెంటనే స్పందించాలి. ఉదాహరణకు అమలాపాల్‌ ఓ లైంగిక వేధింపుల సమస్యను ఫేస్‌ చేసినప్పుడు నాకు వెంటనే ఫోన్‌ చేసింది. నేను కూడా వెంటనే కార్తికి ఫోన్‌ చేసి .. సత్వరచర్యలు తీసుకున్నాం కాబట్టే ఆ వ్యక్తిని అరెస్ట్‌ చేయగలిగాం. బాధిత అమ్మాయి ధైర్యంగా ముందుకు రావాలి. అలా ముందుకు వస్తే మన పేరు పోతుంది.. ఏదో అయిపోతుందని భయపడకూడదు. ఎదుటి వ్యక్తుల నుండి రెస్పాన్స్‌ వచ్చినప్పుడే ఏదైనా సపోర్ట్‌ చేయగలం. మీటూ ఉద్యమాన్ని తప్పుగా ఉపయోగించే అవకాశం కూడా ఉంది. ఉదాహరణకు రేపు ఎవరైనా నా మీద కూడా ఆరోపణలు చేస్తే.. నేను సంపాదించుకున్న పేరు మొత్తం పోతుంది. కాబట్టి ఏదైనా లైంగిక వేధింపులకు సంబంధించిన ఆరోపణలు చేసినప్పుడు ఆధారాలు కూడా ఉంటేనే మంచిది. ఎందుకంటే మీ టూని దుర్వినియోగం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి.
తెలుగు, తమిళ్‌లో ఒకేసారి సినిమాలు చేయడం ఎలా అన్పిస్తుంది?
– తెలుగు, తమిళ్‌ నేటివిటీ రెండూ దగ్గరగానే వుంటాయి. పంచెకట్టు, బొట్టు విషయంలోనే విభిన్నంగా ఉంటారు. తమిళ్‌ విషయానికి వస్తే సినిమాలో పాటలు లేకున్నా ప్రేక్షకులు ఆదరిస్తారు. కానీ తెలుగులో అలా కాదు. ‘అభిమన్యుడు’ తమిళ వెర్షన్‌లో పాటలు ఉండవు. కానీ తెలుగులో ఆ పాట సినిమాకి మంచి ప్లస్‌ అయ్యింది.
పైరసీ గురించి వెంటనే రెస్పాండ్‌ అవుతుంటారు కదా! ఏదైనా ప్రాబ్లెమ్స్‌ ఫేస్‌ చేశారా?
– కొన్ని విషయాలు ప్రభుత్వాలు తలుచుకుని ముందుకు వస్తే పరిష్కారం అవుతాయి. దుబాయ్‌లో లాగ కఠిన నిబంధనలు తీసుకొస్తే ప్రయోజనం ఉంటుంది. ప్రస్తుతం తమిళ్‌లో యాంటీ పైరసీ స్క్వాడ్‌ పనితీరు బాగుంది. పైరసీ చేసేవాళ్ళు నా శత్రువులు కాదు.. పైరసీ చూసేవాళ్లే నా శత్రువులు. అలాంటివాళ్ళ వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఇప్పుడు నాకు, నా కుటుంబ సభ్యులకు ప్రాబ్లెమ్స్‌ ఎదుర్కోవడం అలవాటైంది.
రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తారా?
– ఓటు వేయడానికి రెడీ అవుతున్నా. ఓటర్లు డబ్బులు తీసుకోకుండా ఓటు వేసేలా ప్రజల్ని చైతన్యం చేయడానికి క్యాంపైన్‌ చేస్తున్నాను. నా స్వంత ఊర్లో ఇప్పటివరకూ రోడ్డు సౌకర్యం సరిగ్గా లేదు. రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమస్యల పరిష్కారానికి నావంతు ప్రయత్నం చేస్తున్నాను. అలాగే యువకులు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే తప్పకుండా మార్పు వస్తుందని నేను బలంగా నమ్ముతాను.
మ్యారేజ్‌ గురించి?
– నావైపు నుండి అభ్యర్ధనను పంపడం జరిగింది. ఇంకా జవాబు రాలేదు. తొందర్లోనే వస్తుందన్న నమ్మకం ఉంది.
నడిగర్‌ సంఘం బిల్డింగ్‌ ఎంతవరకు వచ్చింది?
– ఆ బిల్డింగ్‌ పూర్తి చేయడం అనేది నా లైఫ్‌లాంగ్‌ డ్రీమ్‌. అది తమిళనాడుకే ప్రెస్టీజియస్‌, ఐకానిక్‌ బిల్డింగ్‌గా ఉండబోతోంది.
‘మేము సైతం’ (తమిళ్‌)కు ఎలాంటి రెస్పాన్స్‌ వస్తుంది ?
– చాలా బాగుంది. తమిళనాడులో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ షో చూసి డొనేషన్స్‌ ఇస్తున్నారు. వాళ్ల రెస్పాన్స్‌ చూసి చాలా ఆనందం వేసింది. ఫిబ్రవరి 2,3 తేదీల్లో ఒక ఈవెంట్‌ను ఆర్గనైజ్‌ చెయ్యబోతున్నాం. ఆ డబ్బుతో ఇబ్బందుల్లో ఉన్న నిర్మాతలకి సహాయంగా నిలబడతాం.. అంటూ ఇంటర్య్వూ ముగించారు మాస్‌ హీరో విశాల్‌.