అందరినీ అధిగమించి అగ్ర స్థానానికి చేరువలో…

పూజా హెగ్డే తన కొత్త సినిమాకి అందుకుంటున్న రెమ్యూనరేషన్ 3 కోట్లని చెప్పుకుంటున్నారు. సినిమా ఇండస్ట్రీ పోటీలో నెగ్గి.. వరసగా అవకాశాలు అందుకొని.. సక్సెస్ తో  స్టార్ స్టేటస్ సాధించి.. అగ్ర స్థానానికి  రావాలంటే ఎంత కష్టమో చెప్పనవసరం లేదు. ప్రస్తుతం నాయిక పూజా హెగ్డే  కూడా అగ్ర స్థానానికి చేరువలో ఉంది. ‘ముకుంద’, ‘ఒక లైలా కోసం’ సినిమాలతో  టాలీవుడ్ ప్రేక్షకులను పరిచయమయిన పూజా హెగ్డే.. ఆ తర్వాత బాలీవుడ్‌లో ‘మొహంజాదారో’ సినిమాలో స్టార్ హీరో హృతిక్ రోషన్‌తో కలిసి నటించింది. ఈ సినిమా కోసం రెండేళ్ళు వెచ్చించిన పూజా హెగ్డేకి ఈ సినిమా మాత్రం హిట్ ఇవ్వలేకపోయింది.

దిల్ రాజు నిర్మాణంలో..స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘దువ్వాడ జగన్నాధం’ సినిమాలో అవకాశం ఆమెను తిరిగి లైంలైట్ లోకి  తెచ్చింది.. అక్కడినుండి పూజా వరసగా అవకాశాలు అందుకుంది. ‘అరవింద సమేత’ సినిమాతో ఫస్ట్ హిట్ అందుకున్న పూజా హెగ్డే.. ఆ తర్వాత ‘మహర్షి’ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇక ‘అల వైకుంఠపురములో’ ఇండస్ట్రీ హిట్ అయి పూజా రేంజ్ పెంచేసింది. ప్రస్తుతం పూజా హెగ్డే సౌత్  సినిమా ఇండస్ట్రీలో అగ్రస్థానంలో ఉందన్న మాట వినిపిస్తోంది. తెలుగు, హిందీతో పాటు కోలీవుడ్‌లో విజయ్ సినిమా చేస్తోంది. ఈ సినిమాకి పూజా అందుకుంటున్న రెమ్యూనరేషన్ 3 కోట్లని చెప్పుకుంటున్నారు.

మహేష్ సరసన పూజా హెగ్డే !… `మహర్షి` చిత్రంలో  సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన  పూజా హెగ్డే నటించి ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. మరో సారి ఈ జంట వెండితెరపై జతకట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. `అతడు`,`ఖలేజా` తరువాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మహేశ్ ఓ సినిమా చేయబోతున్నారు. ఇందులో మహేశ్ కి జంటగా పూజా నటి స్తోంది. ఆ సినిమా అటు మహేశ్ తోనూ, ఇటు పూజతోనూ త్రివిక్రమ్‌కి మూడో సినిమా అవుతుంది. ఇప్పటికే త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన `అరవింద సమేత`,`అల వైకుంఠపురములో`చిత్రాల్లో పూజ హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే.

విజయ్ కాంబినేషన్ లో పూజా !… విజయ్‌ హీరోగా నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో సన్‌పిక్చర్స్‌ సంస్థ ఓ సినిమా నిర్మిస్తోంది. ఈ చిత్రంలో  పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ఈ నెలలోనే ప్రారంభం కానుంది. విజయ్, పూజాలపై తొలుత ఓ పాటను చిత్రీకరించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు. ఇదిలా ఉంటే.. తెలుగులో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ‘రాధే శ్యామ్‌’, ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ సినిమాలు విడుదలకు సిద్ధం అయ్యాయి. చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ సినిమాలో పూజా హెగ్డే ఓ కీ రోల్‌ చేస్తోంది. ఈ సినిమాలు కాకుండా హిందీలో సల్మాన్‌తో ‘కబీ ఈద్‌ కబీ దీవాళి’, రణ్‌వీర్‌ సింగ్‌తో ‘సర్కస్‌’ సినిమాలు చేస్తోంది పూజా హెగ్డే.