ప్రభాకర్ జైనీ ‘ప్రజాకవి కాళోజీ’ బయోపిక్ ట్రైలర్ విడుదల

“ప్రజాకవి అయిన కాళోజీ నారాయణ అనే వ్యక్తి ఒక మామూలు వ్యక్తి కాదు. ఒక శక్తి.తను తెలంగాణ కొరకు ఉద్యమాలే ఊపిరిగా బతికాడు. పేద ప్రజలకొరకు అహర్నిశలు కష్టపడుతూ.. వారికి అండగా నిలబడిన గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తి గురించి సినిమా తియ్యాలి అంటే గట్స్ కావాలి.అలాంటి వ్యక్తి పై కాళోజీ బయోపిక్ పేరుతో సినిమా తీసిన ప్రభాకర్ జైనీ దంపతులు కూడా వారి జన్మ ధన్యం  అయిందనుకుంటున్నాను .ప్రపంచంలో ఎం జరిగినా ఆది తన బాధ గా భావించే శ్రీ శ్రీ గారు కాళోజీ గారు రచించిన నా గొడవ నవల చూసి ఇది ‘కాళోజీ గొడవ కాదు ‘విశ్వ జగత్ గొడవ’  అన్నారంటే కాళోజీ గారు ఎంత గొప్ప వ్యక్తో మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటి మహానుభావుడి జీవిత చరిత్రను ప్రేక్షకులకు పరిచయం చేయడం చాలా సంతోషంగా ఉంది. కాళోజీ నారాయణరావు పాత్రధారి మూల విరాట్  జన్మ కూడా ధన్యమైంది అని చెప్పవచ్చు. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాను అందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు… ఆర్ నారాయణ మూర్తి  ‘ప్రజాకవి కాళోజీ’ బయోపిక్! చిత్ర టీజర్, ట్రైలర్ ను విడుదల కార్యక్రమంలో మాట్లాడుతూ-

జైనీ క్రియేషన్స్ పతాకంపై మూలవిరాట్, పద్మ,రాజ్ కుమార్, స్వప్న నటీ నటులుగా అమ్మ నీకు వందనం,  క్యాంపస్ అంపశయ్య’,  ప్రణయ వీధుల్లో’, వంటి  ప్రయోజనాత్మక ‘ సినిమాలు తీసిన ప్రభాకర్ జైనీ దర్శకత్వంలో శ్రీమతి విజయలక్ష్మీ జైనీ నిర్మించిన చిత్రం ‘ప్రజాకవి కాళోజీ’ బయోపిక్!. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమైన సందర్బంగా  చిత్ర టీజర్, ట్రైలర్ ను విడుదల చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణ మూర్తి, రంగారెడ్డి ఇన్కంటాక్స్ చీఫ్ కమీషనర్ నరసింహప్ప, తెలంగాణ సాంసృతిక సంచాలకులు  మామిడి హరికృష్ణ, నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, సీనియర్ జర్నలిస్ట్ ప్రభు, దర్శకులు వి.యన్ ఆదిత్య, దర్శకులు వేణు ఉడుగుల, రిజిస్ట్రేషన్స్ ఐ.జీ వేముల శ్రీనివాస్, రచయిత్రి అమృత లత లతో పాటు రెండు తెలుగు రాస్ట్రాల నుండి వచ్చిన రచయితలు  ముఖ్య అతిధులుగా పాల్గొని ప్రజాకవి కాళోజీకి జ్యోతి ప్రజ్వాలన చేసి నివాళులు అర్పించారు.

ప్రభాకర్ జైనీ  మాట్లాడుతూ.. ప్రజాకవి కాళోజీ’ సినిమా ఒక అసాధ్యమైన టాస్క్. అటువంటి సినిమా తీయలేరని అందరూ నాతోనే అన్నారు. 2020 జనవరి, 29 న మొదలు పెట్టి వరంగల్లులో కాళోజీ గారి ఇంట్లో మొదటి షెడ్యూలు షూటింగు చేస్తున్నప్పుడే, ఈ సినిమాను నేను పూర్తి చేయలేమోనని నాకే అనిపించింది. ఈ సినిమాకోసం ఎన్నో  కష్టాలను , బాధలను నాతో పాటు నా భార్య, నిర్మాత శ్రీమతి విజయలక్ష్మీ జైని అనుభవించింది. ఆమె నా కన్నా మానసికంగా దృఢసంకల్పం కలది. నన్ను తానే ప్రోత్సహించేది.
కాళోజీకి పలుకుబడుల భాష అంటే ఇష్టమని నాకు తెలుసు. అందుకే, వేరే ఒక పాటల రచయితకు ప్రామీస్ చేసినా ఆయనకు సర్ది చెప్పి, బిక్కి కృష్ణ గారికే నాలుగు పాటలు రాయడానికి అనుమతించాను. పాటలు బాగా వచ్చినా, యాస సమస్యలు వచ్చాయి. వాటిని నేను సరిదిద్దిన తర్వాత,
సినిమా అత్యద్భుతంగా వచ్చింది. పాటలు కూడా కాళోజీ ఔన్నత్యాన్ని పెంచే విధంగా, ప్రతీ తెలుగు వాడు గర్వించే విధంగా, ‘ఇది రా మా భాష గొప్పతనం’ అని చెప్పుకుంటూ తల ఎగరవేసేంత గొప్పగా వచ్చాయి.
ఈ సినిమాలో సమాజం కోసం ప్రాణాలర్పించే, ఒక యువ జంటను చూపించాము. ఒక రిక్షా వాడు కూడా కవిత్వం చెప్పగలడని చూపించాము. ఒక పునరుజ్జీవనం చెందుతున్న, ఒక సజీవ చైతన్యంతో తొణికిసలాడుతున్న సమాజాన్ని చూపించాము. అహంకారాన్ని చీల్చి చెండాడే సన్నివేశాలను చూపించాము.మేము తీసిన ఈ సినిమాను మీరందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని అన్నారు.

మామిడి హరికృష్ణ మాట్లాడుతూ… ఇప్పటి వరకు ఎన్నో  బయోపిక్స్ వచ్చాయి. అయితే వాటిలో కొన్ని మాత్రమే విజయం సాధించాయి. అయితే తెలుగు వారికి సంబందించి కవి అయిన ప్రజాకవి కాళోజీ’ జీవిత చరిత్ర గురించి సినిమాగా తియ్యడం ఇదే మొదటి సినిమా అని చెప్పవచ్చు. అయితే ఇలాంటి బయోపిక్ లు తియ్యడమంటే దుస్సాహసమే అనీ చెప్పవచ్చు.కానీ ఒకడుగు ముందుకు వేసి కాళోజీ గారి కథను తెలుగు ప్రేక్షకుల ముందుకు దృశ్య నివాళిని అర్పించిన ప్రభాకర్ జైనీ దంపతులకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రేక్షకులందరూ ఇలాంటి మంచి సినిమాను ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.