ప్రయత్నిస్తున్నా ఫలితం దక్కడం లేదు !

“ప్రయత్నిస్తూనే ఉన్నా. కానీ సరైన ఫలితం దక్కడం లేదు” అని అంటోంది రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. ఆమె నటిస్తున్న హిందీ చిత్రాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వడం లేదు. ఆమె బాలీవుడ్‌ లో నటించిన ‘యారియన్‌’ తోపాటు ‘అయ్యారి’ రెండూ బాక్సాఫీసు వద్ద నిరాశపరిచాయి. ఇటీవల విడుదలైన ‘దే దే ప్యార్‌ దే’ కమర్షియల్‌గా కాస్త ఫర్వాలేదు. ప్రస్తుతం సిద్ధార్థ్‌ మల్హోత్రా, తారా సుటారియా, రితేష్‌ దేశ్‌ముఖ్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ‘మర్జావాన్‌’ చిత్రంలో నటిస్తోంది. మిలాప్‌ ఝవేరి దర్శకులు.ఈ యాక్షన్‌ సినిమాని అక్టోబర్‌ 2న విడుదల చేయాలనుకున్నారు. అయితే అదే రోజు హృతిక్‌ రోషన్‌, టైగర్‌ షరాఫ్‌ నటించిన భారీ యాక్షన్‌ చిత్రం ‘వార్‌’ విడుదల కానుంది. దీంతో రకుల్‌ చాలా టెన్షన్‌ పడిందట.
 
ఆ విషయం రకుల్‌ చెబుతూ… ‘ ‘మర్జావాన్‌’ అవుట్‌పుట్‌ విషయంలో చాలా హ్యాపీగా, నమ్మకంతో ఉన్నాం. కానీ ‘వార్‌’తో పోటీపడాల్సి వస్తుందని టెన్షన్‌ కలిగింది.అయితే నిర్మాత భూషణ్‌ కుమార్‌ వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ కారణంగా ‘మర్జావాన్‌’ నవంబర్‌ 22న విడుదల చేయడానికి నిర్ణయించారు. ఆయన నిర్ణయం మాకు రిలీఫ్‌నిచ్చింది. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. బాలీవుడ్‌లో మంచి విజయం కోసం నా శక్తి మేరకు ప్రయత్నిస్తూనే ఉన్నా. కానీ, సరైన ఫలితం దక్కడం లేదు’ అని చెప్పింది. తమిళంలో శివకార్తికేయన్‌ సినిమాతోపాటు ‘భారతీయుడు 2’లోనూ నటిస్తున్నరకుల్‌ తాజాగా తెలుగులో ఓ సినిమాకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రకుల్‌ ఇటీవల తెలుగు తమిళ్ లో చేసిన సినిమాలన్నీ ఫెయిలయ్యాయి.
 
నచ్చిన ఆహారాన్ని తినేస్తా !
పంజాబీ అందగత్తె రకుల్‌ప్రీత్‌సింగ్ ఫిట్‌నెస్ విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటుంది . షూటింగ్‌లతో ఎంత బిజీగా ఉన్నా వ్యాయామాన్ని మాత్రం మరచిపోనని చెబుతుంది. అయితే కొందరు డైటింగ్ పేరుతో అనవసరంగా కఠిన ఆహారనియమాల్ని పాటిస్తుంటారు.దానికి నేను వ్యతిరేకమని చెప్పింది. ” నచ్చిన ఆహారాన్ని తినేస్తా. స్వతహాగా నేను భోజనప్రియురాలిని. కానీ రుచి, శుచి విషయంలో జాగ్రత్తలు మాత్రం తీసుకుంటాను. మనం తినే ఆహారాన్ని ఎలా తయారుచేస్తున్నారు? ఏ పదార్థాల్ని వాడుతున్నారు? వాటిలో పోషకవిలువలు ఏమిటి? అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అంతేకాని.. డైటింగ్ పేరుతో ఆహారం పట్ల కోరికలను చంపుకోవడం మంచిపద్ధతి కాదు. ఎంత మోతాదులో తింటున్నామన్నది కూడా చాలా ముఖ్యం అని చెప్పింది.