అభిమాని కుటుంబానికి రామ్‌చరణ్‌ పదిలక్షల విరాళం

‘హైదరాబాద్‌ సిటీ చిరంజీవి యువత’ అధ్యక్షులు నూర్ మహ్మద్ నెల క్రితం గుండెపోటుతో మృతి చెందారు .ఆ వార్త తెలిసిన వెంటనే మెగాస్టార్‌ చిరంజీవి సికింద్రాబాద్‌లోని వారి ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులను ఓదార్చి వచ్చారు. అప్పట్లో విదేశాలలో ఉన్న రామ్‌చరణ్‌ తను హైదరాబాద్ రాగానే నూర్ మహ్మద్ కుటుంబాన్ని కలుస్తానని, ఆ కుటుంబాన్ని ఆదుకుంటానని మాట ఇచ్చారు. ఆదివారం ఉదయం నూర్ మహ్మద్ కుటుంబ సభ్యులను రామ్ చరణ్ గారు ఇంటికి పిలిపించుకొని 10లక్షల రూపాయల చెక్కు ను వారికి అందజేయడం జరిగింది.ఆ కుటుంబ సభ్యులు ఆనందానికి అవధుల్లేవు. ఈ సహాయం మరువలేనిదని, ఎన్నటికీ రుణపడి ఉంటామని ఆ కుటుంబ సభ్యులు రామ్‌చరణ్‌తో అన్నారు.
 
“నూర్ మహ్మద్ తమ కుటుంబం పేరుతో చేసిన సేవలు ఎనలేనివి. ముఖ్యంగా ఆయన చేసే కార్యక్రమాలు మేము చూడాలని, మాకు తెలియాలని ఎప్పుడు కోరుకోకుండా మా పుట్టినరోజులకు, సినిమా ఫంక్షన్లకు అనేక సేవా కార్యక్రమాలు చేశారు” అని రామ్ చరణ్ అన్నారు. నూర్ మహ్మద్ కుటుంబ సభ్యులతో రామ్ చరణ్ ముచ్చటించారు. నూర్ మహ్మద్ చేసిన సేవలను రామ్ చరణ్ విశేషంగా కొనియాడారు.
“నూర్ మహ్మద్ గారిని తిరిగి తీసుకొని రాలేనని, కానీ మీ ఇంటిలో పెద్ద కొడుకులా మీకు అండగా ఉంటానని, అదే విధంగా నూర్ మహ్మద్ గారి కుమారుడికి మంచి ఉద్యోగం కూడా ఇప్పిస్తానని , అంతే కాకుండా అమ్మాయిల పెళ్లిళ్లకు తను స్వయంగా వస్తాన”ని ఆ కుటుంబానికి భరోసా ఇచ్చారు.