వైభవంగా ‘సంతోషం’ ఫిలిం అవార్డుల ప్ర‌దానోత్స‌వం !

పదహారవ ‘సంతోషం’ సౌత్ ఇండియా సంతోషం ఫిలిం అవార్డుల ప్ర‌దానోత్స‌వం ఆదివారం సాయంత్రం హైద‌రాబాద్ జెఆర్.సీ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్లో ఆట పాట‌ల‌తో..తార‌ల మెరుపుల నడుమ అంగ‌రంగ వైభవంగా  ఘ‌నంగా జ‌రిగింది. ఈ వేడుక‌కు మెగాస్టార్ చిరంజీవి, గాన కోకిల ఎస్. జాన‌కి ముఖ్య అతిధులుగా హాజ‌ర‌య్యారు. ఇంకా ప‌లువురు టాలీవుడ్ ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు…రాజ‌కీయ ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల న‌టీన‌టుల‌కు అవార్డులు అందించడం జ‌రిగింది.
 
‘మెగాస్టార్’ చిరంజీవి మాట్లాడుతూ… `నాకు అవార్డు ఇస్తానంటే వేడుక‌కు రాను. ఇవ్వ‌నంటేనే వ‌స్తాన‌ని సురేష్ కి ముందే చెప్పాను. కానీ న‌న్ను మోసం చేసి ‘గాన గోకిల’ ఎస్. జాన‌కి గారు చేతుల మీదుగా అవార్డు బ‌హుక‌రించి న‌న్ను లాక్ చేసేసాడు. కాద‌న‌లేక ఈ అవార్డు తీసుకుంటున్నాను. చాలా సంతోషంగాను ఉంది. ఇప్ప‌టివ‌ర‌కూ ఆమె చేతుల మీదుగా ఎప్పుడూ అవార్డు తీసుకోలేదు. సింగ‌పూర్ లో ఏదో వార్డుల కార్య‌క్ర‌మంలోనే ఇద్ద‌రం క‌లిసాం. మ‌ళ్లీ సంతోషం వేడుక‌ల్లోనే క‌లిసాం. తొలిసారి ఆమె చేతుల మీద‌గా సంతోషం అవార్డు తీసుకుంటున్నందుకు చాలా గ‌ర్వంగా ఉంది. ఈ సంద‌ర్భంగా సురేష కు ధ‌న్య‌వాధాలు తెలుపుతున్నా. మ‌రొక‌రు చేతులు మీదుగా ఇచ్చుంటే తిర‌స్క‌రించేవాడిని. ఎందుకంటే ఇలాంటి అవార్డులు కొత్త వారికి ఇచ్చి ప్రోత్స‌హిస్తే బాగుంటుంది. వాళ్ల‌లో ఉత్సాహం నింపిన‌ట్లు ఉంటుంది. వాళ్ల‌ను చూసి మ‌రెంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తారు. కొత్త‌త‌రం న‌టీన‌టులు, సాంకేతికి నిపుణులు ప‌రిశ్ర‌మ‌కు ఎంతైనా అవ‌స‌రం.
 
`సంతోషం` వేడుక‌ల్లో తొలిసారి అందాల తార శ్రీదేవి పేరు మీద స్మార‌క అవార్డును నెల‌కోల్ప‌డం చాలా సంతోషంగా ఉంది. చాలా మంది హీరోయిన్ల‌తో క‌లిసి న‌టించాను..గాని ఆమెతో న‌టించిన ఆ నాలుగు సినిమాల అనుభ‌వాన్ని ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేను. అందులోనూ ` జ‌గ‌దీక వీరుడు..అతిలోక సుంద‌రి` సినిమా ఓ మ‌ధుర జ్ఞాప‌కం. శ్రీదేవి కెరీర్ ఆరంభంలో ఎలా ఉన్నారో? చివ‌రికి వ‌ర‌కూ అలాగే ఉన్నారు. స్టార్ స్టేట‌స్ వ‌చ్చిన త‌ర్వాత కొంద‌రి హీరోయిన్ల‌ల‌లో మార్పులొస్తాయి. కానీ శ్రీదేవి లో ఎలాంటి మార్పులు రాలేదు. డౌన్ టు ఎర్త్ గానే న‌డుచుకున్నారు. ఆమెను చూసి నేను కొన్ని కొన్ని విష‌యాలు తెలుసుకున్నాను. ఆమెకు ఓపిక‌..స‌హ‌నం ఎక్కువ‌. అందుకే అంత పెద్ద స్టార్ అయ్యారు. సౌత్ ఇండియాలో నెంబ‌ర్ స్టార్ హీరోయిన్లు ఉన్నారు. నార్త్ ఇండియాలోనూ నెంబ‌ర్ వ‌న్ హీరోయిన్లు ఉన్నారు. ఇలా నెంబ‌ర్ వ‌న్ హీరోయిన్లు ఎంత మంది ఉన్నా శ్రీదేవి ఒక్క‌రే ఆల్ ఇండియా లేడీ సూప‌ర్ స్టార్ గా కీర్తింప‌బ‌డ్డారు. ఆమె అవార్డును త‌మ‌న్నా అందుకోవ‌డం సంతోషంగా ఉంది.
 
సంక‌ల్ప్ ను ఓసారి  రానా ప‌రిచయం చేసాడు. త‌ర్వాత మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు స‌మ‌యంలో చూసాను. అత‌ను మాట‌ల మ‌నిషికాదు..చేత‌ల మ‌నిషి. త‌న ప‌నిత‌నాన్ని `ఘాజీ` సినిమాతో చాటి చెప్పాడు. ఆ సినిమా ఎంత పెద్ద విజ‌యం సాధించిందో అంద‌రికీ తెలిసిందే. ఇప్ప‌డు మా వ‌రుణ్ తేజ్ తో స్పేస్ బ్యాక్ డ్రాప్ లో `అంత‌రిక్షం` సినిమా చేస్తున్నాడు. కొన్ని విజువ‌ల్స్ చూసాను. చాలా బాగున్నాయి. ఘాజీ క‌న్నా ఆ సినిమా పెద్ద విజ‌యం సాధించాల‌ని కోరుకుంటున్నా.
 
రామ్ -ల‌క్ష్మ‌ణ్ ఎక్క‌డో వేట‌పాలెం నుంచి మ‌ద్రాస్ వ‌చ్చి ఫైట్ మాస్ట‌ర్లు అయ్యారు. అప్ప‌ట్లో నాకు రాజు అనే స్టంట్ మాస్ట‌ర్ ఎక్కువ‌గా ఫైట్లు కంపోజ్ చేసేవారు. ఆయన వ‌ద్ద స‌హాయ‌కులుగా చేరి..గొడుగు ప‌ట్టిన వాళ్లు ఈరోజు ఇంత మంచి స్థానానికి రావ‌డం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు హీరోలంతా రామ్ ల‌క్ష్మ‌ణ్ డేట్లు అడుగుతున్నారు. లేదంటే వాయిదా వేసుకుంటున్నారంటే వాళ్లు ఎంత గొప్ప వాళ్లు అయ్యారో అర్ధం చేసుకోవ‌చ్చు. వీళ్లు ఇప్పుడు చాలా మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నార‌ని` చిరంజీవి ముగించారు.
 
‘గాన‌కోకిల’ ఎస్. జాన‌కి మాట్లాడుతూ…` సురేష్ 5 ఏళ్ల నుంచి ఫంక్ష‌న్ కు రావాల‌ని అడుగుతున్నాడు. కానీ నాకు కుద‌ర‌క రాలేక‌పోతున్నాను. కానీ ఈసారి క‌చ్చితంగా వెళ్లాల‌ని నిర్ణ‌యించుకుని వ‌చ్చా. ఇక్క‌డ చిరంజీవిగార్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మెగాస్టార్ కు చాలా సినిమాల్లో పాట‌లు పాడాను. అప్ప‌టి హిట్ సాంగ్స్ అన్నీ దాదాపు నావే. చిరు క‌ళ్ల‌లో ఏదో మాయ ఉంది. ఒంట్లో ఎన‌ర్జీ ఉంది. న‌ట‌న‌, డాన్సు, ఫైట్లు ఇలా ప‌త్రీ విష‌యంలో ఆయ‌న ప్ర‌త్యేక‌మే. ఆయన్ని చూస్తే..ఆయ‌న వెంట ఎవ‌రైనా ప‌డాల్సిందే ( సినిమాల్లో న‌వ్వుతూ). 125 ఏళ్లు సంతోషంగా జీవించాలి. ఖైదీ నంబ‌ర్ 150వ సినిమా చూసాను. పాత చిరంజీవిని చూసిన‌ట్లే ఉంది. ఇక ఇప్పుడు న‌టిస్తోన్న సైరా న‌ర‌సింహారెడ్డి కూడా పెద్ద విజ‌యం సాధించాల‌ని కోరుకుంటున్నా` అని అన్నారు.
 
మంత్రి త‌ల‌సాని శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ… `16 ఏళ్ల‌గా సురేష్ ఒక్క‌డే అన్నీ తానై ఈ వేడుక‌ల‌ను నిర్వ‌హించ‌డం చాలా గొప్ప విష‌యం. ఇలాంటి ఫంక్ష‌న్లు చేయాలంటే చాలా మంది అవ‌సరం ఉంటుంది. కానీ సురేష్ వ‌న్ మేన్ ఆర్మీలా చేస్తాడు. అత‌ని ఓపిక‌..స‌హ‌నానికి మెచ్చుకోవాల్సిందే. సౌత్ లో ఉన్న అన్నీ భాష‌ల న‌టీన‌టుల‌ను ఏకం చేసి వేడుక చేయ‌డం చాలా గొప్ప‌గా ఉంది. ఇలాంటి అవార్డులు ప్ర‌దానం చేయ‌డం ద్వారా నూత‌న న‌టీన‌టుల్లో, సాంకేతిక నిపుణుల్లో ఉత్సాహం నింపిన‌ట్లు అవుతుంది. కొత్త‌వారు రావ‌డానికి అవ‌కాశం ఉంటుంది. సినీ ప‌రిశ్ర‌మ‌ను మ‌ద్రాసు నుంచి హైద‌రాబాద్ కు తీసుకురావ‌డంలో ఎంద‌రో పెద్ద‌ల కృషి ఉంది. ఎన్టీఆర్, ఏఎన్నార్, రామానాయుడు గారు లాంటి వ‌ల్ల సాధ్య‌మైంది. నాటి నుంచి ప‌రిశ్ర‌మ దినదిన అభివృద్ది చెందుతుంది. ఇక తెలంగాణ రాష్ర్ట ప్ర‌భుత్వం స‌హ‌కారం కూడా ఎప్పుడూ ఉంటుంది` అని అన్నారు.
 
అల్లు అర‌వింద్ మాట్లాడుతూ… ` నాన్న‌గారి (అల్లు రామ‌లింగ‌య్య‌స్మార‌క అవార్డు) పేరు మీద సంతోషం అవార్డును 10 ఏళ్లుగా ఆయ‌న గుర్తుగా సురేష్ కొండేటి ఇస్తుంన్నందుకు చాలా సంతోషంగా ఉంది. అందుకు ఆయ‌న‌కు ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్నా. ఈ ఏడాది బ్ర‌హాజీ అందుకోవ‌డం మరింత అనందాన్నిస్తుంది. ఈ అవార్డు బ్ర‌హ్మాజీకే ఎందుకివ్వాల‌ని సురేష్ ను ప్ర‌శ్నించా. అందుకు సురేష్ ఏమ‌న్నాడంటే? రామ‌లింగ‌య్య గారు క‌మెడీయ‌న్ మాత్ర‌మే కాదు..క్యారెక్ట‌ర్ ఆర్టిస్టు కూడా. అలాగే బ్ర‌హ్మ‌జీ క‌మెడీతో పాటు క్యారెక్ట‌ర్ ఆర్టిస్ గాను న‌టిస్తున్నాడు. అందుకే ఇవ్వాల‌నుకున్నాం అన్నాడు. నిజ‌మే క‌దా అనిపించింది. బ్రహ్మ‌జీ ఎలాంటి పాత్ర‌కైనా మౌల్డ్ అవుతాడు. పాత్ర‌లో వేరియేష‌న్స్ చూపిస్తాడు. అదే అత‌నిలో గొప్ప‌త‌నం. ఇదే వేదిక‌పై గీతగోవిందంతో పెద్ద విజ‌యాన్ని అందించిన ప‌రుశురాం బుజ్జిని స‌న్మానించ‌డం చాలా సంతోషంగా ఉంది` అని అన్నారు.
 
ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు మాట్లాడుతూ… ` 20 ఏళ్ల క్రితం నేను-అర‌వింద్ గారు క‌ల‌సి ‘పెళ్లి సంద‌డి’ సినిమా తీశాం. మ‌ళ్లీ ‘గీత‌గోవిందం’ ఆ సినిమాను గుర్తు చేసింది. బుజ్జీ నా సినిమాను కాపీ కొట్టాడు(న‌వ్వుతూ). ఒక ముద్దు కూడా లేకుండా సినిమా చేయ‌డం అంటే చాలా క‌ష్టం. నిర్మాత‌ల ద‌గ్గ‌ర నుంచి చాలా ఒత్తిళ్లు ఉంటాయి. అవి బుజ్జీ కూడా ఫేస్ చేసి ఉంటాడు. రాజీ ప‌డ‌కుండా మంచి సినిమా చేసినందుకు ఆనందంగా ఉంది` అని అన్నారు.
 
నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ… ` నాన్న‌గారు రామానాయుడు పేరుమీద సురేష్ సంతోషం అవార్డు ఇవ్వ‌డం చాలా ఆనందంగా ఉంది. వ‌రుస స‌క్సెస్ ల‌తో దూసుకుపోతున్న మైత్రీ మూవీ మేక‌ర్స్ అధినేత‌లు ఈ ఏడాది ఆ అవార్డు అందుకుంటున్నందుకు మ‌రింత సంతోషంగా ఉంది` అని అన్నారు.
 
రాజేంద్ర ప‌సాద్ మాట్లాడుతూ…` సురేష్ నాకు త‌మ్ముడు లాంటాడు. ఆయ‌న ఈ ఏడాది న‌న్ను అవార్డుకు ఎంపిక చేసినంద‌కు చాలా కృత‌జ్ఞ‌త‌లు. ఈ గౌర‌వ మ్యాద‌ల‌న్నీ నాకు సినిమాలు వ‌ల్లే ద‌క్కాయి. ఎంతో మంది ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు ప్రోత్స‌హించ‌డం వ‌ల్లే ఈ స్థాయిలో ఉన్నాను. అంత‌కు మించి ప్రేక్ష‌కులు ఎంత‌గానే ఆద‌రించారు. నేటి త‌రం ద‌ర్శ‌కులు కూడా న‌న్ను ఎంక‌రేజ్ చేస్తూ నా కోసం అంటూ కొన్ని పాత్ర‌లు రాస్తున్నారు. అందుకే న‌టుడిగా బిజీగా ఉండ‌గ‌ల్గుతున్నాను` అని అన్నారు.
 
ర‌చ‌యిత సాయి మాధ‌వ్ బుర్రా మాట్లాడుతూ…` నా జీవితంలో ఈ ఆగ‌స్టు గుర్తుండిపోతుంది. సాధార‌ణంగా అవార్డు వ‌స్తే సంతోషంగా ఉంటుంది. మ‌రి సంతోష‌మే సంతోషాన్నిస్తుంటే ఇంకెలా ఉంటుంది? అదీ మెగాస్టార్ చిరంజీవి గారు చేతుల మీదుగా అవార్డు అందుకుంటే ఇంకెంత‌ ఆనందంగా ఉంటుందో మాట‌ల్లో చెప్ప‌లేను. ఈ అవార్డు వ‌చ్చిందంటే కార‌ణం బాల‌కృష్ణ గారు, క్రిష్ ఇంకా గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి టీమ్ అంతా. వాళ్లు లేక‌పోతే ఈ అవార్డు లేదు. వ‌చ్చే ఏడాది `సైరా న‌ర‌సింహారెడ్డి`కి గాను ఇదే అవార్డు నాకు రావాల‌ని కోరుకుంటున్నా` అని అన్నారు.
 
త‌మ‌న్నా మాట్లాడుతూ… ` కొన్ని అవార్డులు అందుకుంటే సంతోషంగా ఉంటుంది. కానీ శ్రీదేవి పేరు మీద అవార్డు అందుకోవ‌డం కొంచెం బాధ‌గా ఉంది. కానీ ఈ ఏడాది ఆమె పేరు నేను అవార్డు అందుకోవ‌డం అనేది ఎప్ప‌టికీ గుర్తుండిపోయే ఓ జ్ఞాప‌కం. చిరంజీవి గారికి పెద్ద అభిమానిని. ఆయ‌న చేతుల మీదుగా ఈ అవార్డు వ‌స్తున్నందుకు సంతోషంగా ఉంది. సురేష్ గారికి కృత‌జ్ఞ‌త‌లు` అని అన్నారు.
 
టి. రాజేందర్ మాట్లాడుతూ… ` న‌న్ను కోలీవుడ్ మ‌రిచిపోయిందేమోగానీ టాలీవుడ్ మాత్రం మ‌ర్చిపోలేదు. ప్రేమ సాగ‌రం సినిమా ద‌గ్గ‌ర నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ ఒక‌లాగే అభిమానిస్తున్నారు. కోలీవుడ్ లో చాలా అవార్డు పంక్ష‌న్ల‌కు వెళ్తాను. కానీ అక్క‌డ దొర‌క‌ని తృప్తి తెలుగు పంక్ష‌న్ల‌లో..ఇలాంటి వేడుక‌ల్లోనూ దొరుకుతుంది. చిరంజీవిగారు చేతుల మీదుగా అవార్డు అందుకోవ‌డం ఎప్ప‌టి గుర్తుండిపోతుంది. ఆయ‌న‌కు నేను పెద్ద అభిమానిని` అన్నారు.
 
డైరెక్ట‌ర్ సంక‌ల్ప్ మాట్లాడుతూ… ` చిరంజీవి గారి చేతుల మీదుగా అవార్డు అంటే నాకు మాట‌లు రావ‌డం లేదు. నా తొలి సినిమా ఘాజీ ఇంత గౌర‌వం ద‌క్క‌డం చాలా సంతోష‌గా ఉంది. సురేష్ గారికి ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు` అని అన్నారు.
 
ఇంకా ఈ వేడుక‌ల్లో ఏపీ ఎఫ్ డీసీ చైర్మెన్ అంబికా రాధాకృష్ణ‌, `మా` జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ నరేష్, ఇంకా ప‌లువురు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు పాల్గొన్నారు. అవార్డు గ్ర‌హీత‌లు మెహ‌రీన్, ఈషా, ప్ర‌సన్న‌, స్నేహ తో పాటు, మ‌ల‌యాళ, క‌న్న‌డ న‌టీన‌టులు, సాంకేతిక హాజ‌ర‌య్యారు.
 
అవార్డులు అందుకున్న వారి వివరాలు
తెలుగు
జీవిత సాఫల్య పురస్కారం- ఎస్. జానకి
అలెగ్జాండర్ స్పెషల్ జ్యూరీ అవార్డు- జయప్రకాష్ రెడ్డి
అల్లు రామలింగయ్య స్మారక అవార్డు- బ్రహ్మాజీ
అక్కినేని నాగేశ్వరరావు స్మారక అవార్డు- రాజేంద్రప్రసాద్
శ్రీదేవి స్మారక అవార్డు- తమన్నా
రామానాయుడు స్మారక అవార్డు- మైత్రీమూవీ మేకర్స్
బెస్ట్ హీరో- మెగాస్టార్ చిరంజీవి(ఖైదీ నంబర్ 150)
బెస్ట్ హీరోయిన్- శ్రియా(గౌతమిప్రుత శాతకర్ణి)
బెస్ట్ డైరెక్టర్- సంకల్ప్ రెడ్డి(ఘాజీ)
బెస్ట్ సినిమాటోగ్రాఫర్- సెంథిల్ కుమార్(బాహుబలి)
బెస్ట్ కొరియోగ్రాఫర్- శేఖర్ మాస్టర్(ఖైదీ నంబర్ 150)
బెస్ట్ డైలాగ్ రైటర్- బుర్రా సాయిమాధవ్(గౌతమిపుత్ర శాతకర్ణి)
బెస్ట్ ఫైట్ మాస్టర్- రామ్-లక్ష్మణ్(ఖైదీ నంబర్ 150)
బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్- రేవంత్(అర్జున్ రెడ్డి)
బెస్ట్ సపోర్టింగ్ రోల్- సినియర్ నరేష్(శతమానం భవతి)
బెస్ట్ డెబ్యూ హీరో- రక్షిత్(లండన్ బాబులు)
స్పెషల్ జ్యూరీ ఫర్ బెస్ట్ హీరోయిన్- మెహరీన్(మహానుభావుడు)
స్పెషల్ జ్యూరీ ఫర్ బెస్ట్ హీరోయిన్- ఈషా రెబ్బా(అమీతుమీ)
తమిళం
జీవితసాఫల్య పురస్కారం- టీ రాజేందర్
బెస్ట్ సపోర్టింగ్(మేల్)- ప్రసన్న(హీరోయిన్ స్నేహ భర్త)
కన్నడ
బెస్ట్ మూవీ- ఉర్వి- నిర్మాత బీఎస్ ప్రదీప్ వర్మ
బెస్ట్ డైరెక్టర్- అలమేరి సంతు(కాలేజ్ కుమార్)
బెస్ట్ హీరోయిన్- నివేదిత(శుద్ధి
బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్- బీజే భరత్(బ్యూటిఫుల్ మనసుగలు)
బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్- అనురాధా భట్(చౌక)
బెస్ట్ యాక్టర్ సపోర్టింగ్ రోల్(మేల్)- దత్తాత్రేయ(కెంపిర్వే)
బెస్ట్ యాక్టర్ సపోర్టింగ్ రోల్(ఫీమేల్)- అరుణ బాల్‌రాజ్(ఆపరేషన్ అలమేలమ్మ)
బెస్ట్ హీరో క్రిటిక్స్ అవార్డు- ప్రవీణ్ తేజ్(చురికతే)
మళయాలం
బెస్ట్ మూవీ-తొండిముతులం ద్రిక్షశుయుం(నిర్మాత సందీప్ సేనన్)
బెస్ట్ డైరెక్టర్- అరుణ్ గోపీ(రామ్ లీలా)
బెస్ట్ యాక్టర్- ఇంద్రన్స్(కేరళ స్టేట్ అవార్డు విన్నర్)
బెస్ట్ హీరోయిన్- ప్రయాగరోస్ మార్టిన్( రామ్ లీలా)
యూత్ ఐకాన్-2017(ఫీమేల్)- నిమిషా సజయన్(తొండిముతులం ద్రిక్షశుయుం)
యూత్ ఐకాన్-2017(మేల్)- ధృవ్(క్వీన్)
ఉత్తమ సహాయ నటి- కృష్ణప్రభ(హనీబీ-2)
ఉత్తమ సహాయ నటుడు- ఆన్సన్ పాల్(సోలో)