బాలీవుడ్ లో కుర్ర హీరోకు కూడా 32 కోట్ల పారితోషికం

చిత్ర పరిశ్రమలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న వరుణ్‌ ధావన్‌ రెమో డిసౌజ దర్శకత్వంలో నటించబోతున్న  చిత్రం కోసం ఏకంగా 32 కోట్ల రూపాయల పారితోషికాన్ని తీసుకుంటున్నట్లు వస్తున్న వార్తలు ప్రస్తుతం బీ టౌన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ కుర్ర హీరో ప్రస్తుతం నటిస్తున్న ‘సుయీ ధాగ’ చిత్రానికి, గతంలో కరణ్‌ జోహర్‌ దర్శకత్వంలో నటించిన రెండు సినిమాలకు కూడా కేవలం 8కోట్ల రూపాయల పారితోషికాన్ని తీసుకున్నాడు. ఇప్పుడు ఏకంగా 32 కోట్ల రూపాయల పారితోషికాన్ని తీసుకుంటున్నాడని సమాచారం. పరిశ్రమకు వచ్చిన అనతి కాలంలోనే  వరుణ్‌ ఇంత పెద్ద పారితోషికాన్ని తీసుకునే విషయం ఇప్పుడు బాలీవుడ్‌లో ఆసక్తికరంగా మారింది….

అక్షయ్‌ కుమార్‌ …ఈ  హీరో ప్రస్తుతం గుల్షన్‌ కుమార్‌ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ‘మొగల్‌’ చిత్రానికి అక్షరాల 54 కోట్ల రూపాయల పారితోషికాన్ని తీసుకుని​ ఈ వరుసలో అందరికంటే ముందున్నాడు. మేథోపరమైన హక్కులను కూడా కలుపుకుని ప్రస్తుతం ఈ హీరో మార్కెట్‌ విలువ 54 కోట్లు. ఇది ఈ హీరో లక్కినంబర్‌ని కూడా సూచిస్తుంది. 9 ఈ హీరో లక్కి నంబర్‌.

అజయ్‌ దేవగన్‌…‘రైడ్‌’ సినిమా తరువాత నుంచి ఈ హీరో కూడా తన పారితోషికాన్ని పెంచి  అక్షయ్‌కు సమానంగా వరుసలో రెండో స్ధానంలో ఉన్నాడు. ప్రస్తుతం ఈ హీరో బయట సంస్థల్లో నటించబోయే మూడు చిత్రాలకు సంబంధించిన శాటిలైట్‌ హక్కులు, మేథోపర హక్కుల్లో వాటాను కలుపుకుని ఇంత భారీ పారితోషికాన్ని పొందుతున్నట్లు సమాచారం.

సల్మాన్‌ ఖాన్‌, ఆమిర్‌ ఖాన్‌…ఈ ఇద్దరూ ఖాన్‌ హీరోలు సమాన పారితోషికాన్ని అందుకుంటున్నారు. ఈ ఇద్దరు బడా హీరోలతో సినిమాలు తీసే ఓ ప్రముఖ దర్శకుడు ఓ సందర్భంలో మీరిద్దరు నాకు సమానమే కాబట్టి ఇద్దరికి పారితోషికం కూడా సమానంగానే చెల్లిస్తానని చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోలు 50కోట్ల పారితోషికంతో పాటు మేథోపరమైన హక్కుల్లో 50శాతం వాటా తీసుకుంటున్నారు.

హృతిక్‌ రోషన్‌…ప్రస్తుతం ఈ హీరో ‘ఆనంద్‌ కుమార్‌’ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం కోసం 45 కోట్ల రూపాయల పారితోషికాన్ని తీసుకుంటున్నట్లు సమాచారం. రాబోయే తన తదుపరి చిత్రానికి కూడా ఇంతే పారితోషికం తీసుకోనున్నాడని సమాచారం.

షారుక్‌ ఖాన్‌…కింగ్‌ ఖాన్‌ షారుక్‌ మాత్రం పారితోషికం విషయంలో చివరి స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం ఈ హీరోగారి పారితోషికం ‘సున్నా’. అవును అక్షరాల సున్నానే. ఎందుకంటే ఈ హీరో తన సొంత బ్యానర్‌లోనే చిత్రాలను నిర్మిస్తున్నాడు. ‘రాయిస్‌’ సినిమా నుంచి ఇప్పుడు నటిస్తున్న ‘జీరో’ వరకూ ఈ హీరో నటించిన సినిమాలన్ని తన సొంత బానర్‌లో తానే స్వయంగా నిర్మిస్తూ నటించాడు, కాబట్టి ఈ హీరో పారితోషికం ‘సున్నా’.

రణ్ వీర్ సింగ్‌…‘పద్మావత్‌’ సినిమా విడుదల తర్వాత ఈ హీరో కూడా పారితోషికాన్ని పెంచాడు. ప్రస్తుతం ఈ హీరో నటిస్తున్న ‘సింబా’, ’83′(కపిల్‌ దేవ్‌ జీవిత చరిత్ర ఆధారంగా నిర్మిస్తున్న చిత్రం) కోసం  15 కోట్ల రూపాయల పారితోషికాన్ని తీసుకుంటున్నాడని సమాచారం.