కొవ్వూరి సురేష్‌రెడ్డి నిర్మిస్తున్న మూడు చిత్రాలు !

యానిమేషన్‌ గేమింగ్ రంగంలో కొవ్వూరి సురేష్‌రెడ్డి పేరు సుపరిచితమే. అంతే కాదు…  ‘ఫోర్బ్స్‌’ ఇటీవల 30 ఏళ్ళ లోపు అత్యంత ప్రభావశీలురైన వ్యక్తుల జాబితాలో చోటు దక్కించుకున్న యువ వ్యాపారవేత్త, ఏకైక తెలుగు వ్యక్తి సురేష్‌రెడ్డి. గత 13 ఏళ్ళుగా ‘క్రియేటివ్‌ మెంటార్స్‌ యానిమేషన్‌ అండ్‌ గేమింగ్‌ కాలేజీ’ ఎండీగా ఉన్నారు. ఆ కాలేజీ వ్యవస్థాపకులు ఆయనే. అలాగే, ప్రసాద్ ల్యాబ్స్ సహకారంతో ఫిలిం స్కూల్ నిర్వహిస్తున్నారు. సురేష్‌రెడ్డి ఇప్పుడు ‘పి19 ఎంటర్‌టైన్‌మెంట్‌’ సంస్థను స్థాపించి మూడు చిత్రాలను ప్రకటించారు.
పి19 ఎంటర్‌టైన్‌మెంట్‌లో ప్రొడక్షన్‌ నెం1కి ‘సూపర్‌స్టార్‌ కిడ్నాప్‌’, ‘పేపర్‌ బోయ్‌’ చిత్రాలకు దర్శకత్వ శాఖలో పని చేసిన ఆకాష్‌రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. ‘ఛోరి’, ‘మరోజన్మ’, ‘ప్యూర్‌ సోల్‌’ వంటి అవార్డ్‌ విన్నింగ్‌ షార్ట్‌ ఫిల్మ్స్‌ రూపొందించిన ఆకాష్‌రెడ్డి, ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
పి19 ఎంటర్‌టైన్‌మెంట్‌లో ప్రొడక్షన్‌ నెం2కి ఉత్తమ కథారచయితగా ‘ఋషి’కి గాను నంది పురస్కారంతో పాటు దర్శకుడిగా దాదా సాహెబ్‌ ఫాల్కె ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో పురస్కారం అందుకున్న రాజ్‌ మాదిరాజు దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రాన్ని ఎన్నారై రవికాంత్‌ జామితో కలిసి సురేష్‌రెడ్డి కొవ్వూరి నిర్మించనున్నారు.
పి19 ఎంటర్‌టైన్‌మెంట్‌లో ప్రొడక్షన్‌ నెం3కి దర్శకుడు పూరి జగన్నాథ్‌  దగ్గర ఆరు చిత్రాలకు పని చేసిన ప్రదీప్‌ మద్దాలి దర్శకత్వం వహించనున్నారు. ఇంతకు ముందు ‘పెళ్ళి గోల’ వెబ్‌ సిరీస్‌, జీ5 ఓటీటీలో ఎక్స్‌క్లూజివ్‌గా విడుదలైన ‘47 డేస్‌’ సినిమాకు ఆయన దర్శకత్వం వహించారు. దీనికి రమేష్‌ ప్రసాద్‌గారు సమర్పకులు.
హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్స్‌లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఈ మూడు చిత్రాలను ప్రకటించారు. మూడు చిత్రాల ప్రీలుక్స్‌, లోగోలను కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ప్రసాద్స్ గ్రూప్ చైర్మన్ అక్కినేని రమేష్ ప్రసాద్, ప్రముఖ నిర్మాత ‘దిల్‌’ రాజు ఆవిష్కరించారు. ప్రముఖ ఆర్థోపెడిక్స్‌ డాక్టర్‌ దశరథరామిరెడ్డి, తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ సెక్రటరీ కె.ఎల్‌. దామోదర ప్రసాద్‌, నిర్మాత రాజ్‌ కందుకూరి, జీ5లో హెడ్ క్రియేటివ్ & కంటెంట్‌ యాక్వేషన్ నిమ్మకాయల ‌ప్రసాద్, దర్శకులు రాజ్‌ మాదిరాజు, ప్రదీప్‌ మద్దాలి, ఆకాష్‌రెడ్డి, ‘పీ19 ఎంటర్‌టైన్‌మెంట్‌’ అధినేత కొవ్వూరి సురేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సురేష్‌రెడ్డి కొవ్వూరి మాట్లాడుతూ.. ‘‘వరల్డ్‌ సినిమాకి తెలుగు సినిమా ఎంతో కాంట్రిబ్యూట్‌ చేస్తోంది. ఎంతోమంది యంగ్‌ ట్యాలెంటెడ్‌ పీపుల్‌ వస్తున్నారు. నేను ‘కంటెంట్‌ ఈజ్‌ ది ఫిల్మ్‌ (కింగ్‌)’ అనేది నమ్ముతాను. వచ్చే నాలుగేళ్ళల్లో 20 చిత్రాలను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. ఈ మూడు సినిమాల విషయానికి వస్తే… మా దర్శకులు ముగ్గురూ ఆల్రెడీ తమ కథలతో ఇంతకు ముందే ప్రూవ్‌ చేసుకున్నారు. వాళ్ళ కథలపై నమ్మకంతో సినిమాలు ప్రారంభించాం ’’ అని అన్నారు.