మూడు భాషల్లోనూ బిజీగా …

‘బాహుబలి’తో దేశ వ్యాప్తంగా మంచి పాపులారిటీని సంపాదించుకుంది తమన్నా. ఆ పాపులారిటీని ఇప్పుడు బాగా ఉపయోగించుకుంటోంది. ఏకంగా తెలుగు, తమిళం, హిందీ చిత్రాల్లో వరుసగా సినిమా అవకాశాలను దక్కించుకుంటూ దూసుకుపోతుంది. తమిళంలో విక్రమ్‌తో ‘స్కెచ్‌’, శింబుతో ‘ఏ ఏ ఏ’, విష్ణు విశాల్‌తో ‘పోన్‌ ఒండ్రు కాండియిన్‌’ వంటి చిత్రాలతో స్టార్‌ హీరోల నుంచి యంగ్‌ హీరోల వరకు అందరితోనూ ఆడిపాడుతోంది. హిందీలోనూ మంచి అవకాశాలను అందిపుచ్చుకుంటోంది.

‘ఎంటర్‌టైన్‌మెంట్స్‌’ చిత్రం తర్వాత పూర్తి స్థాయిలో హిందీలో ఏ చిత్రంలోనూ నటించలేదు తమన్నా. గతంలో బాలీవుడ్‌లో నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాలను నమోదు చేయకపోవడంతో అవకాశాలు కూడా తగ్గాయి. బాలీవుడ్‌లో కొంత గ్యాప్‌ వచ్చినా ఇప్పుడు మాత్రం ఛాన్స్‌లు పుంజుకుంటున్నాయి. ఇప్పటికే ‘ఖామోషి’ చిత్రంలో నటిస్తోంది. ఇటీవల సందీప్‌కిషన్‌ సరసన బాలీవుడ్‌ దర్శకుడు కూనల్‌ కోహ్లీ దర్శకత్వంలో నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ చిత్రం హిందీతోపాటు తెలుగులో కూడా తెరకెక్కుతుంది. ఇలా హిందీ, తమిళ, తెలుగు భాషా చిత్రాల్లో నటిస్తూ మూడు ఇండిస్టీలకు చక్కర్లు కొడుతూ బిజీగా మారిపోయింది తమన్నా.