వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకుంటే ఢిల్లీ లెవెల్ లో ఉద్యమం !

పద్మావతి సినిమాకు ఉన్న కాంట్రవర్సీలు ఏ సినిమాకు లేవు అనే చెప్పాలి.. మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని  ఉజ్జయిని కాన్స్టిట్యూషన్ నుంచి బిజెపి అభ్యర్థిగా ఎన్నికైన చింతయని మాలియా ఎంపీ గా  బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాంటి ఉన్నత పదవిలో ఉండి కూడా ఇటీవల దీపికా నటించిన ‘పద్మావతి’ సినిమా పై ఏమాత్రం అవగాహన లేకుండా ‘సినిమా వాళ్ళ భార్యలు రోజుకొకరితో వెళ్తారంటూ’  అసభ్య వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కారు.. ఈ విషయం పై ‘తెలంగాణ ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్’ స్పందించి చింతయిని వ్యాఖ్యలను ఖండించారు..

ఈ సందర్బంగా బుధవారం టి ఎఫ్ సి సి  లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో టిఎఫ్ సిసి చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ….  బిజెపి ఎంపీ చింతయిని పద్మావతి సినిమా నచ్చకుంటే ఆ సినిమా పై మాత్రమే వ్యాఖ్యలు చేయాలి, కానీ, సినిమా పరిశ్రమ మొత్తాన్ని తప్పు పట్టి సినిమా వాళ్ళ భార్యలు రోజుకొకరితో వెళ్తుంటారు అని అసభ్య వ్యాఖ్యలు చేయడం బాధాకరం.. మా సినిమా పరిశ్రమలోని ఆడవాళ్లను, ఆడ బిడ్డలను ఇలాంటి వ్యాఖ్యలతో అవమానించడం నేను సహించలేను. పూర్తిగా వ్యతిరేకిస్తున్నా… ఖండిస్తున్నా.. అసలు పద్మావతి సినిమా కథ అతనికి తెలుసా? సినిమా చూసి వ్యతిరేకించాలి కానీ ఇలా ఆఫ్ నాలెడ్జి తో చిన్న విషయాన్ని బూతద్దంలో చూసి ఇతరులను  తప్పు పట్టడం అనేది సరైనది కాదు.. 1540 సం. లో రాసిన ఒక నవలే ‘పద్మావతి’. మంచి కథను విమర్శించేటప్పుడు ఆయా విశేషాలను తెలుసుకొని విమర్శించాలనే ఆలోచన ఒక ఎంపీ గా అతనికి లేకపోవడాన్ని చూసి చింతిస్తున్నాము.. ఈ నెల 28 న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారిని కలసి అతన్ని సస్పెండ్ చేయమని డిమాండ్ చేయనున్నాము. అంతే కాదు, నవంబర్ 23న  తెలుగు ఫిలిం ఛాంబర్ ఆవరణలో సినిమా వాళ్లమంతా కలసి   చింతయిని దిష్టిబొమ్మను తగల బెట్టనున్నాము. అతని వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోతే ఢిల్లీ లెవెల్ లో ఉద్యమం చేస్తామని హెచ్చరిస్తున్నాము అన్నారు.

‘టి మా’ అధ్యక్షురాలు కవిత మాట్లాడుతూ… సినిమా అంటే ప్రతి వారికి చులకన భావం ఉంది… వారికి ఎంటర్టైన్మెంట్ కావాలంటే మళ్ళీ అదే సినిమా కావాలి. ఇదెక్కడి అన్యాయం.. గొప్ప పేరున్న ఇండస్ట్రీ ని తప్పు పట్టి ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేసిన చింతయిని ని ఏమనాలి? మహోన్నత పదవిలో ఉంటూ కూడా మహిళల గురించి ఇలా అసభ్యంగా మాట్లాడి దిగజారిపోవడం చూసి బాధపడుతున్నాము. ఆయన మాటలను పూర్తిగా ఖండిస్తున్నాము… కేవలం లోకల్ మీడియా లోనే కాకుండా నేషనల్  మీడియాలో ఈ విషయం పై ఉధృతం చేస్తామని తెలుపుతున్నాం.. ఇక నంది అవార్డ్స్ గురించి నారా లోకేష్ గారు చేసిన అవగాహన లేని మాటలకు కూడా బాధ పడుతున్నాము.. సినిమా వాళ్లకు ప్రాంతీయ బేధం ఉండదు. ఎక్కడైనా సినిమాలు చేసుకునే అవకాశం, హక్కు మాకుంటాయి.. తెలియని చిన్న తనంతో లోకేష్ గారు ‘సినిమా వాళ్లకు ఆధార్ కార్డు లేవు, టాక్స్ లు ఇక్కడ కట్టడం లేదు’ అంటూ మాట్లాడటాన్ని కూడా నేను ఖండిస్తున్నాను.. నంది అవార్డ్స్ అన్నది ఎన్నేళ్ల నుంచో ఉన్నా…ఇప్పుడు వాటి స్థితి గతులు మారిపోయాయి. ‘బాగా నటిస్తారని మంచి ఆర్టిస్ట్’ అని ప్రేక్షకులు చెపితే చాలు . అవార్డు వస్తేనే నటులు కాదు అని నా ఉద్దేశ్యం అని చెప్పుకొచ్చారు.

టి.మా. సెక్రటరీ లయన్ సాయి వెంకట్ మాట్లాడుతూ…. బిజెపి ఎం పి చింతయిని చేసిన అసభ్యకర వ్యాఖ్యలను తెలుగు నటీనటులు మొత్తం వ్యతిరేకిస్తున్నాము.. అతని మాటలు వెనక్కి తీసుకోకపోతే ఎంతటి ఉధృతానికైనా మేము సిద్ధంగా ఉన్నాము. అవసరమైతే ఢిల్లీ లో కూడా నిరసనలు చేయడానికి వెనుకాడమని మీడియా ద్వారా తెలుపుతున్నామని చెప్పారు.

అనంతరం మోహన్ గౌడ్ మాట్లాడుతూ… బిజెపి ఎంపీ చింతయిని  మాలియా నువ్వు ఏ సినిమా వాళ్లపై అయితే చులకన చేసావో… అదే సినిమా వాళ్లమంతా ఒక్కటైతే ప్రభుత్వాలను తలకిందులు  చేసే సత్తా మాలో ఉంది.. ప్రధాని మోడీ గారిని కోరుతున్నది ఒక్కటే. వెంటనే చింతయిని పై యాక్షన్ తీసుకొని అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనీ కోరుతున్నాము.. లేని యెడల ఢిల్లీ కైనా వచ్చి ఆందోళనలు చేపడతామని ఈ సందర్బంగా తెలియచేస్తున్నామని చెప్పారు.