ఘనంగా ‘తెలుగు సినీ రచయితల సంఘం’ ర‌జ‌తోత్స‌వం

‘తెలుగు సినీ రచయితల సంఘం’ ర‌జ‌తోత్స‌వం ఫిలింనగర్‌ కల్చరల్‌ సెంటర్‌లో జరిగాయి. ముందుగా బలభద్రపాత్రుని రమణిగారి తొలిపలుకులతో కార్యక్రమం ప్రారంభమైంది. ఆకెళ్ళ కార్యదర్శి నివేదిక సమర్పించారు. రమణాచారి చేతులమీదుగా, ఛాంబర్‌ వారి చేతులమీదుగా వ్యవస్థాపక పురస్కారాలు, ప్రతిభా పురస్కారాలు, గౌరవపురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా హాజరైన మెగాస్టార్‌ చిరంజీవి సీనియర్‌ రచయితలైన ఆదివిష్ణు, రావికొండలరావు, సత్యానంద్‌, భువనచంద్రలకు జీవిత సాఫల్య పురస్కారాలు అందజేశారు.
 
‘మెగాస్టార్‌’ చిరంజీవి మాట్లాడుతూ… “ఇక్కడకు రావడం అత్యంత సంతోషం, సంతృప్తికరం. సినీపరిశ్రమలో దర్శ నిర్మాతల తర్వాత అత్యధికంగా గౌరవించేది …సన్నిహితంగా వుండేది రచయితలతోనే. రచయితలే లేకపోతే మేం లేం అనేది వాస్తవం. పరుచూరి బ్రదర్స్‌తో అనుబంధం చాలా వుంది. కుటుంబ సభ్యుల్లా అయిపోయాం. ‘మగమహారాజు’కు రాసిన ఆకెళ్ళ ఇక్కడే వున్నారు. ఈ సభకు నన్ను పిలకపోయివుంటే అసంతృఫ్తిగా వుండేవాడిని. గొప్ప అనుభూతి పొందే అవకాశం ఇచ్చారు. ఎంతో అనుభవం వున్న ప్రతిభ వున్నవారికి నా చేతులమీదుగా సన్మానం చేయడం జీవితంలో అద్భుతమైన అవకాశంగా భావిస్తున్నాం. తెలుగు పరిశ్రమను వృద్ది చేయడానికి వారంతా వున్నారు. జంథ్యాలగారితో అనుబంధం చాలా గొప్పది. నాటకరచయితగా అద్భుతాలు చేశారు. ఇక రావికొండలరావుగారు నాటక రచయితగా, సంపాదకుడిగా, నటుడిగా, సాహితీవేత్తగా బహుముఖ ప్రజ్ఞాశాలి. బాపు, రమణలకు అత్యంత ఆప్తుడు ఆయన. ఇక కోదండరామిరెడ్డిగారితో 25 సినిమాలు సుదీర్థ ప్రయాణం మాది. దర్శకుడిగాకంటే ఆత్మీయుడు, స్నేహతుడిగా కన్పిస్తాడు. ఇక భువన చంద్రగారు.. ఆయన మిలట్ట్రీ మనిషి. విజయబాపినీడుగారు మొదటిసారి.. ‘ఖైదీ నెం.786’ తో పరిచయం చేశారు. ఆరుద్ర, ఆత్రేయగారి టైంలో ఈయన రాస్తారా? అనిపించింది. రణరంగంలో గన్‌తో పేల్చినట్లు.. సినీకలంతో విజృంభించారు. ఆయన రాసిన మూడు పాటలు.. నేటితరం రీమిక్స్‌తో ఎంజాయ్‌ చేస్తున్నారు. ‘గువ్వాగోరింక..’ బంగారు కోడిపెట్ట, వాన వాన వెల్లువాయె..’ వంటి అందుకు నిదర్శనం. ఇంకా సింగీతం శ్రీనివాసరావు, విశ్వనాథ్‌గారుకూడా వచ్చివుంటే బాగుండేది. అది లోటుగా భావిస్తున్నా. వారిద్దరు మనకు నిధి లాంటివారు…అని అన్నారు.
 
రాఘవేంద్రరావు ‘సినీ నీరాజనం’ ఏవీ లాంఛ్‌ చేసి మాట్లాడుతూ… రాబోయే దర్శకులకు కష్టకాలం వచ్చింది. అందరు రచయితలు దర్శకులయ్యారు. అందుకని కొత్త రచయితల్ని నమ్ముకోవాల్సిందే.. నేను పరిచయం చేసిన రచయితలందరికీ.. ముఖ్యంగా సత్యానంద్‌, పరుచూరి బ్రదర్స్‌, భారవి, హరనాథ్‌బాబు, జంథ్యాల ఇతర పెద్దలందరికీ ధన్యవాదాలు. నేను సత్యానంద్‌గారు ఇప్పుడే ఓ విషయం అనుకున్నాం… డైరెక్టర్‌ ‘కెప్టెన్‌ ఆఫ్‌ ది షిప్‌’ అంటారు కదా.. మరి మీరందరు ఎవరయ్యా! అని సత్యానంద్‌తో అంటే .. “నిర్మాత షిప్‌ ఓనర్‌. రచయిత, కథ, మాటలు షిప్‌. దానికి పేరు పెట్టాలికదా.. ఎన్‌టిఆర్‌. చిరంజీవి, ఎఎన్‌.ఆర్‌.. ఇలా హీరోలు షిప్‌ పేర్లు. ఇక మిగతా నటీనటులు సాంకేతిక సిబ్బంది ప్రయాణీకులు. జనమే సముద్రం. వారు ఆదరిస్తే ఒడ్డున చేరుకుంటాం. లేదంటే మునిగిపోతాం”.. అని సత్యానంద్ చెప్పారంటూ చమత్కరించారు.
 
మోహన్‌బాబు ‘లివింజ్‌లెజెండ్స్‌’ ఏవీ లాంఛ్‌ చేసి మాట్లాడుతూ… రచయితలు సరస్వతీ పుత్రులు. మొట్టమొదట.. నేను అప్రెంటీస్‌గా పనిచేసింది ఎం.ఎం. భట్‌.. గారి దగ్గర. అక్కడే శ్రీశ్రీగారు పరిచయం. ఆ తర్వాత ఆరుద్రగారు.. ఇలా ఎంతోమంది నాకు పరిచయం. ఆరుద్ర ఎన్నో సిల్వర్‌జూబ్లీలు ఇచ్చారు. కానీ ఆయన చివరిరోజు ఏ నిర్మాత రాలేదు. నేను మొదట వేషం కావాలని వెంటపడింది సత్యానంద్‌గారి దగ్గరే. అలాంటి వ్యక్తిని నా చేతులమీదుగా సన్మానించుకోవడం దేవుడిచ్చిన అదృష్టం. నాకు తండ్రిలాంటి దాసరి, సోదరుడు రాఘవేంద్రరావు … ఇలా ఆ దర్శకుల ఆశీస్సులతో ఈ స్థాయిలో ఉన్నా. మా లక్ష్మీప్రసన్న పిక్చర్స్‌కు మొదట సత్యానంద్‌గారు మాటలు రాశారు. పరుచూరి బ్రదర్స్‌ అద్భుతంగా రాశారు. సత్యమూర్తికూడా చాలా రాశాడు. మనకంటే ఎందరో అందగాళ్ళు, మేథావులున్నారు. కళామతల్లి మనకు అవకాశం ఇచ్చింది. దాన్ని కాపాడుకుందాం. రచయితల ఆశీస్సులు మాకు కావాలి.. అంటూ పేర్కొన్నారు.
 
‘విశిష్ట రచనా పురస్కారాలు’ ఆకుల చంద్రబోసు, సుద్దాల, జెకె. భారవి, ఆకుల చిన్నికృష్ణ, వీణాపాణి, అనంత్‌ శ్రీరామ్‌, భాస్కరభట్ల, తైతలబాపు, భారతీబాబు, జొన్నవిత్తుల రామలింగేశ్వరావు, త్రివిక్రమ శ్రీనివాస్‌, వక్కంతం వంశీ, బుర్రా సాయిమాధవ్‌, రామజోగయ్య శాస్త్రి, బలభద్రపాత్రుని రమణి, మాధవ పట్నాయక్‌ (జడ్జి), ఎస్‌వి రామారావు, పరుచూరి వెంకటేశ్వరావు, తోటపల్లి సాయినాధ్‌, ఆకెళ్ళ, గద్దర్‌, సాహితీ, సిరివెన్నెల సీతారామశాస్త్రి, భూపతిరాజా, అందెశ్రీ, దివాకర్ బాబు, శివశక్తి దత్త, గోరటి వెంకన్న, మరుధూరి రాజా, తోటపల్లి మధు, సంజీవి మొదలి, జనార్దన మహర్షి, పోసాని కృష్ణమురళీ, రాజేంద్రకుమార్‌, చింతపల్లి రమణ, ఆకుల శివ, ఎం.రత్నం, లక్ష్మీభూపాల్‌కు అందజేశారు. తనికెళ్ళ భరణి, డా.పాలకోడేటి సత్యనారాయణ, విజయేంద్రప్రసాద్‌లకు ‘గౌరవ పురస్కారాలు’ అందజేశారు.