తెలుగు సినీ పెద్దలకు కేసీఆర్ పలు కీలక సూచనలు!

కేసీఆర్‌తో ముగిసిన సినీ పెద్దల భేటీ.. ఫైనల్‌గా ఈ నిర్ణయానికి వచ్చారు..!
లాక్‌డౌన్‌తో బుల్లితెర, వెండితెర షూటింగ్స్ నుంచి ప్రొడక్షన్, ఇతర కార్యక్రమాలు అన్నీ నిలిచిపోయాయి… కరోనా దెబ్బకు సీరియళ్లు పాత ఎపిసోడ్స్ రిపీట్ చేస్తుండగా.. టీవీల్లో వేసిన సినిమాలనే మళ్లీ మళ్లీ వేస్తున్నారు.. ఇక, సినిమా థియేటర్లు అన్ని మూతపడడంతో.. కొత్త సినిమా వచ్చుడు లేదు.. చూసుడు లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు తెలుగు సినీ పెద్దలు.. ప్రగతిభవన్‌కు వెళ్లిన చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, త్రివిక్రమ్‌, ఎన్‌.శంకర్‌, అల్లు అరవింద్‌, దిల్‌ రాజు, రాధాకృష్ణ, సీ. కల్యాణ్, సురేష్‌బాబు, కొరటాల శివ తదితరలు.. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమక్షంలో చర్చలు జరిపారు.
పలు కీలక సూచనలు చేశారు సీఎం కేసీఆర్..
లాక్‌డౌన్ కారణంగా ఆగిపోయిన సినిమా షూటింగులు, రీ ప్రొడక్షన్లను దశల వారీగా పునరుద్ధరిస్తామని ప్రకటించారు.. లాక్‌డౌన్‌ నిబంధనలు, కోవిడ్ వ్యాప్తి నివారణ మార్గదర్శకాలు పాటిస్తూ.. షూటింగులు నిర్వహించేలా ఎవరికి వారు నియంత్రణ పాటించాల్సి ఉంటుందని సూచించిన సీఎం.. సినిమా షూటింగులు ఎలా నిర్వహించుకోవాలనే విషయంలో విధి విధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
తక్కువ మందితో.. ఇండోర్‌లో చేసే వీలున్న రీ ప్రొడక్షన్ పనులు మొదట ప్రారంభించుకోవాలని సూచించిన కేసీఆర్.. తర్వాత దశలో జూన్ మాసంలో సినిమా షూటింగులు ప్రారంభించాలని చెప్పారు. చివరగా పరిస్థితిని బట్టి, సినిమా థియేటర్ల పునఃప్రారంభంపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు సీఎం కేసీఆర్… ఇక, షూటింగ్స్ , థియేటర్స్ అనుమతిపై విధివిధానాలు రూపొందించామని.. మరో రెండు సార్లు సమావేశం అయ్యాక తుది నిర్ణయాన్ని ప్రకటిస్తామని వెళ్లడించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.