పైరసీకి వ్యతిరేకంగా విశాల్ పోరాటం !

సినిమాలు విడుదలైన గంటల్లోనే  వెబ్‌సైట్లలో దర్శనమిస్తున్నాయి. ‘తమిళ్‌ రాకర్స్‌’… కొన్నేళ్లుగా కోలీవుడ్‌ నిర్మాతలకి నిద్రలేకుండా చేస్తున్న ఆన్‌లైన్‌ పైరసీ వెబ్‌సైట్‌. ‘తమిళ్‌గన్‌’ వంటి మరిన్ని పైరసీ వెబ్‌సైట్లు కూడా తోడవ్వడంతో సినీ పరిశ్రమ తీవ్రంగా నష్టపోతోంది. దీంతో ఆన్‌లైన్‌ పైరసీపై కోలీవుడ్‌ యుద్ధం చేస్తోంది. ఇదివరకు ఏ సినిమా నెట్‌లో దర్శనమిస్తే ఆ సినిమా నిర్మాత మాత్రమే మీడియా ముందుకొచ్చి గళమెత్తేవారు. అయితే నడిగర్‌ సంఘం ఎన్నికల తరువాత కోలీవుడ్‌ చాలా మార్పువచ్చింది. నటుడు విశాల్‌ రియల్ హీరోగా మారి విప్లవాత్మకమైన మార్పులకు నాంది పలికారు. నడిగర్‌ సంఘం అవినీతిని ప్రశ్నిస్తూ మొదలుపెట్టిన ఆ పోరాటం ప్రస్తుతం పైరసీని అరికట్టేదిశగా సాగుతోంది.ఏ హీరో సినిమా అయినా సరే, పైరసీకి సంబంధించిన చిన్నపాటి సమాచారం అందినా, తన కళ్లలో పడినా వెంటనే యాక్షన్‌లోకి దిగిపోతున్నారు విశాల్.
గతంలో పైరసీ సీడీల విక్రయాలకు నిలయమైన చెన్నై బర్మాబజార్‌లోను, సినిమా షూటింగ్‌ కోసం వెళ్లిన కారైకుడిలోను పైరసీ సీడీల విక్రయాన్ని ఎంతో ధైర్యంగా విశాల్‌ అడ్డుకున్నారు. ప్రైవేటు బస్సుల్లో, లోకల్‌ కేబుల్‌ టీవీల్లో కొత్త సినిమాల ప్రసారానికి వ్యతిరేకంగా పోరాటం సాగించారు. అది ఇప్పుడు మరో స్థాయికి చేరుకుంది. తమిళ నిర్మాతల మండలి ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత ఆన్‌లైన్‌ పైరసీని అరికట్టడమే తన ప్రధాన ధ్యేయమని విశాల్‌ ప్రకటించారు. దాంతో తమిళ రాకర్స్‌, తమిళ్‌గన్‌ వెబ్‌సైట్ల నిర్వాహకులు మరింత రెచ్చిపోయారు. దమ్ముంటే అడ్డుకోమని సోషల్‌ మీడియా ద్వారా సవాలు విసిరారు. ఈ వెబ్‌సైట్ల అడ్మిన్లు విదేశాల్లో ఉంటూ ఇక్కడ అక్రమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని, అందువల్లే వాటిని అడ్డుకోవడం కష్టసాధ్యమవుతోందని సైబర్‌ పోలీసులు సైతం నిస్సహాయతను ప్రదర్శించారు.
ఈ పరిస్థితుల్లో గత మంగళవారం రాత్రి చెన్నై ట్రిప్లికేన్‌లో తమిళగన్‌ అడ్మిన్‌గా భావిస్తున్న గౌరి శంకర్‌ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేయడం సంచలనం రేపింది. మొదట అతను ‘తమిళ్‌ రాకర్స్‌’ అడ్మిన్‌ అంటూ ప్రచారం జరగడంతో.. సదరు వెబ్‌సైట్‌ నిర్వాహకులు సోషల్‌ మీడియాలో అవాస్తవం అని ప్రకటించారు. మరికొద్దిసేపటికే తమిళగన్‌ వెబ్‌సైట్‌ నిర్వాహకులు ‘అమాయకుల్ని అరెస్టు చేయకండి. మీకు చేతనైతే ‘తుప్పరివాలన్‌’ని కాపాడుకోండి’ అని సవాలు విసిరారు. పైరసీని అడ్డుకొనేందుకు విశాల్‌ తీవ్రంగా కృషిచేస్తున్న నేపథ్యంలో గురువారం విడుదలైన విశాల్‌ ‘తుప్పరివాలన్‌’ను పైరవీదారులు టార్గెట్‌ చేసుకున్నారు. ప్రస్తుతం గౌరీశంకర్‌ను పోలీసులు రహస్యంగా విచారిస్తున్నారు. అతను ఎవరన్న విషయంపై ఇంకా క్లారిటీ లేదు. పైరసీని అడ్డుకొనేందుకు విశాల్‌ చేస్తున్న పోరాటం ఫలించాలని కోలీవుడ్‌ నిర్మాతలు కోరుకుంటున్నారు. అయితే పైరవీదారులు విసురుతున్న సవాళ్లు వారిలో ఆందోళన కలిగిస్తున్నాయి.
విశాల్ ఫ్యాన్స్ క్లబ్ ఫ్లయింగ్ స్క్వాడ్! 
విశాల్, అను ఇమ్మాన్యుయెల్ జంటగా నటించిన తమిళ చిత్రం ‘తుప్పరివాలన్’ నేడు విడుదలైంది. ఈ సినిమా చూసిన తమిళ సినీ పెద్దలు.. విశాల్ కెరీర్‌లో అతి పెద్ద విజయం అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే పైరసీ వ్యతిరేకంగా విశాల్ చేస్తున్న పోరాటం.. అతడికి ఓ సవాల్‌ను విసిరింది.
 గత మంగళవారం రాత్రి చెన్నై ట్రిప్లికేన్‌లో ‘తమిళగన్‌’ వెబ్‌సైట్ అడ్మిన్‌గా భావిస్తున్న గౌరి శంకర్‌ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేయడం సంచలనం రేపిన విషయం తెలిసిందే. మొదట సదరు వ్యక్తి తమిళ్‌ రాకర్స్‌ అడ్మిన్‌ అంటూ ప్రచారం జరగడంతో.. సదరు వెబ్‌సైట్‌ నిర్వాహకులు సోషల్‌ మీడియాలో అవాస్తవం అని ప్రకటించారు. మరికొద్దిసేపటికే తమిళగన్‌ వెబ్‌సైట్‌ నిర్వాహకులు ‘‘అమాయకుల్ని అరెస్టు చేయకండి. మీకు చేతనైతే ‘తుప్పరివాలన్‌’ని కాపాడుకోండి’’ అని సవాలు విసిరారు. పైరసీని అడ్డుకొనేందుకు విశాల్‌ తీవ్రంగా కృషిచేస్తున్న నేపథ్యంలో ఈ రోజు విడుదలైన ‘తుప్పరివాలన్‌’ను పైరవీదారులు టార్గెట్‌ చేసుకున్నారు.
 ఈ నేపథ్యంలో విశాల్ ఫ్యాన్స్ క్లబ్ ముమ్మర తనిఖీలు నిర్వహిస్తోంది. ముగ్గురు సభ్యులు చొప్పున ఫ్లయింగ్ స్క్వాడ్‌గా ఏర్పడి థియేటర్లలో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. థియేటర్‌ లోపల పైరసీకి పాల్పడకుండా నిఘా ఉంచారు. ఈ మేరకు విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ నుంచి అన్ని థియేటర్ల మేనేజర్లకు మంగళవారం లేఖలు వెళ్లాయి. తమ ప్రొడక్షన్ హౌస్ నుంచి ముగ్గురు సభ్యులు వస్తారని, థియేటర్‌లోకి వాళ్లను అనుమతించాలని కోరుతూ విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ(వీఎఫ్ఎఫ్) లేఖలు రాసింది.