ఏప్రిల్‌ 20న ‘భరత్‌ అనే నేను’… మే 4న ‘నా పేరు సూర్య’

ఏప్రిల్‌ 26నే ‘భరత్‌ అనే నేను’, ‘నా పేరు సూర్య’ విడుదలవుతున్నట్లు మీడియాలో వార్తలు వచ్చిన నేపథ్యంలో తెలుగు సినీ రంగానికి చెందిన కొందరు ప్రముఖులు దిల్‌ రాజు, కె.ఎల్‌.నారాయణ, నాగబాబుగార్ల సమక్షంలో ఈ రెండు చిత్రాల నిర్మాతలు ప్రత్యక్షంగా సమావేశం అయ్యారు. రెండు భారీ చిత్రాలు ఒక రోజు విడుదలవడం ఇండస్ట్రీకి శ్రేయస్కరం కాదని భావించిన వీరు ఒక అండర్‌ స్టాండింగ్‌కి వచ్చారు.
ఈ సందర్భంగా నిర్మాతలు డి.వి.వి.దానయ్య, లగడపాటి శ్రీదర్‌, బన్నీ వాసు మాట్లాడుతూ – ”ఈ రెండు భారీ చిత్రాల మధ్య కనీసం రెండు వారాలు గ్యాప్‌ ఉండాలన్న ఉద్దేశంతో ఏప్రిల్‌ 20న ‘భరత్‌ అనే నేను’, మే 4న ‘నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’ చిత్రాల్ని విడుదల చెయ్యడానికి నిర్ణయించాం. ఇండస్ట్రీలో ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలన్న అభిప్రాయంతో తీసుకున్న ఈ నిర్ణయాన్ని సపోర్ట్‌ చేసిన మా హీరోలకు, దర్శకులకు, నిర్మాతలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం” అన్నారు.
ఏప్రిల్‌ 20న ‘భరత్‌ అనే నేను’, మే 4న ‘నా పేరు సూర్య’ విడుదల తేదీలు కన్‌ఫర్మ్‌ అయిన నేపథ్యంలో పెద్దలు దిల్‌రాజు. డా.కె.ఎల్‌.నారాయణ, నాగబాబుగార్లు మాట్లాడుతూ – ”రెండు భారీ చిత్రాల విడుదల మధ్య కనీసం రెండు వారాలు గ్యాప్‌ ఇవ్వడం పరిశ్రమకు చాలా మంచిది. సంక్రాంతి సీజన్‌ని మినహాయిస్తే మిగిలిన సందర్భాల్లో రెండు భారీ చిత్రాల మధ్య ఇలా రెండు వారాలు గ్యాప్‌ ఇచ్చి రిలీజ్‌ డేట్స్‌ ప్లాన్‌ చెయ్యడం వలన పరిశ్రమకు ఎంతో మేలు జరుగుతుంది. ‘భరత్‌ అనే నేను’, ‘నా పేరు సూర్య’ నిర్మాతల మధ్య మంచి అండర్‌ స్టాండింగ్‌ కుదరడం ఓ శుభపరిణామంగా భావిస్తున్నాం” అన్నారు.