వెంకటేష్ తో నాగచైతన్య ‘వెంకీ మామ’ ?

‘స్టార్ ప్రొడ్యూసర్’ డి.రామానాయుడు స్థాపించిన సురేష్ ప్రొడక్షన్స్ … ఆయన తదనంతరం దాని బాధ్యతలను సురేష్‌బాబు స్వీకరించి సినిమాలు నిర్మిస్తున్నారు. గత కొంతకాలంగా ఈ బ్యానర్‌లో ఒక్క పెద్ద సినిమా కూడా తీయకపోవడంతో ప్రేక్షకులు ఆలోచనలో పడ్డారు. ఈ విషయాన్ని సురేష్‌బాబును అడిగితే త్వరలో ఒక పెద్ద సినిమాకు శ్రీకారం చుడుతున్నామని చెప్పారు. తాజాగా చిన్న సినిమా ‘ఈ నగరానికి ఏమైంది’తో పెద్ద హిట్టు కొట్టిన సురేష్ ప్రొడక్షన్స్ ఇప్పుడు ఒక పెద్ద సినిమా తీయడానికి సిద్ధమవుతోంది. వెంకటేష్, నాగచైతన్యతో ఓ మల్టీస్టారర్ మూవీని నిర్మించబోతోంది.

భారీ బడ్జెట్‌తో తెరకెక్కే ఈ సినిమాకు ‘వెంకీ మామ’ అనే టైటిల్ అనుకుంటున్నట్టు తెలిసింది. సురేష్ ప్రొడక్షన్స్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తామని డి.సురేష్‌బాబు తెలిపారు. ఇటీవల సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో చిన్న సినిమాలు మాత్రమే వస్తున్నాయన్న కామెంట్‌పై ఆయన స్పందిస్తూ… “మా బ్యానర్‌లో ఇకనుంచి విభిన్న కథా చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. త్వరలో వెంకటేష్, నాగచైతన్యలతో ఓ మల్టీస్టారర్‌ను తెరకెక్కించబోతున్నాం ”అని సురేష్‌బాబు పేర్కొన్నారు

‘వెంకీ మామ’ పూర్తిగా విలేజ్‌ బ్యాక్‌ డ్రాప్‌లో  ఉండబోతుందని, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా బాబీ రూపొందించబోతున్నాడంట. అందుకే టైటిల్‌ అదే అయితే బాగుంటుందన్న ఆలోచనలో చిత్ర యూనిట్‌ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాలో వెంకీకి జోడిగా బాలీవుడ్‌బ్యూటీ హుమా ఖురేషీ, చైతూకు జోడీగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నటించనున్నారనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే నెలలో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. మరోవైపు వెంకీ-వరుణ్‌ తేజ్‌ల ‘ఎఫ్‌ 2’ ఈ నెలలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపుకోనుంది.