ఎంతోమందికి స్ఫూర్తినివ్వడం నా అదృష్టం!

విజయశాంతి.. నలభై ఏళ్ల నట జీవితంలో అరవై మంది హీరోలతో కలిసి నటించారు…ఒక దశలో తానే కథానాయకుడై సినిమాలను చేసారు. పదమూడేళ్ల విరామం తర్వాత ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో మళ్లి కెమెరా ముందుకొచ్చిన అనుభూతుల గురించి విజయశాంతి ఇలా వివరించారు…
 
# చాలా ఏళ్ల నుంచి అనేక మంది సినిమా చేయమని అడిగారు. అప్పుడు రాజకీయాల్లో తీరిక లేకుండా ఉండటం వల్ల మళ్లి నటించాలనే ఆలోచన రాలేదు. సినిమా అంటే సమయం కేటాయించాలి. సినిమా చేసి ఇటు సినిమాకు.. అటు రాజకీయపరంగా ఇబ్బంది పడలేను. గతంలో ఒకసారి అనిల్‌ రావిపూడి గారు సినిమా కోసం సంప్రదించారు. చేయలేను అని చెప్పాను. ఈసారి దర్శకులు అడిగినప్పుడు కొంత విరామం ఉంది. మహేష్‌ బాబు హీరో అన్నారు. సరే చేద్దామని కథ విన్నాను. నచ్చింది. ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చి మీకూ నచ్చింది.
 
# మళ్లీ కెమెరా ముందుకు రావడం నాకేమీ కొత్తగా అనిపించలేదు. ఎందుకంటే నటిగా నలభై ఏళ్ల అనుభవం చూశాను. మనతో నటించే ఆర్టిస్టులు మారారు కానీ, సినిమా ఎప్పటికీ ఒకటే. నటనలో మాకు అదే పట్టు ఉంటుంది.
 
# నేను ఎక్కువగా తినను, వ్యాయామం చేస్తుంటాను. ఈ సినిమా కోసం కొంత జాగ్రత్తలు తీసుకుని బరువు తగ్గాను. మనసు నిర్మలంగా ఉంటుంది కాబట్టి అది మొహంలో కనిపిస్తుంటుంది అంతే.
 
# సినిమా పరిశ్రమను మిస్‌ అవుతున్నాననే భావన ఎప్పుడూ కలగలేదు. అనేక ఏళ్లు సినిమా పరిశ్రమకు సేవ చేశాను. గొప్ప చిత్రాలు చేశాను. నాకు కూడా కొంత విరామం కావాల్సి వచ్చింది. ఇన్నేళ్లు హీరోయిన్‌గా పరిశ్రమలో నిలదొక్కుకోవడం అంటే సులువు కాదు. చాలా పెద్ద విషయమది, తెలుగుమ్మాయిగా, ఏళ్లపాటు ఒక స్థాయిని కాపాడుకుంటూ.. సినిమాలు చేయడం ఒక చరిత్ర సృష్టించడమే. లేకపోతే క్యారెక్టర్‌ ఆర్టిస్టుగానో, మరో పాత్రలకో వెళ్లిపోవాల్సిన పరిస్థితి వచ్చేది. దేవుడు నాకు మేలు చేశాడు, ప్రేక్షకులు ఆదరించారు .
 
# సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాం అంటారే. అలా సరైన సమయంలో విరామం తీసుకున్నా. సరైన సమయంలో మళ్లి తెరపైకి వచ్చా. పవర్‌ఫుల్‌ పాత్ర, ఆ పాత్రకు తగినట్లు మంచి స్పందన వస్తోంది. అనేక మంది ఫోన్‌లు చేసి అభినందిస్తున్నారు. మిగతా భాషల పరిశ్రమల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. మీ సినిమా ఘన విజయం సాధించిందట కదా అని అడుగుతున్నారు.
 
# మహిళలకు నచ్చే సినిమా ఇది. వాళ్లకు బాగా కనెక్ట్‌ అయ్యింది. మొదటి రోజు నుంచీ మహిళలు ఎక్కువగా ఆదరిస్తున్నారు. మహిళలు ఫోన్‌లు చేసి రాములమ్మ మళ్లి ఏడిపించావ్‌ అంటున్నారు. మగవాళ్లూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. భారతి పాత్ర హుందాగా సాగే పాత్ర అది. ఎక్కువగా తక్కువగా చేయకూడదు. ఆరంభం నుంచి చివరిదాకా ఒకేలా కనిపించాలి. తన బాధను బయటపెట్టకుండా మనసులోనే దాచుకుంటుంది. విలన్‌తో మాట్లాడేప్పుడు తక్కువ డైలాగ్‌లైనా సూది పెట్టి గుచ్చుతున్నట్లు ఉంటుంది. ఓవర్‌గా యాక్ట్‌ చేయడానికి లేదు. లెక్చరర్‌ పాత్ర కాబట్టి, ప్రకాష్‌ రాజ్‌తో కళ్లలోకి చూస్తూ.. ఏంటి భయమేస్తుందా అని అడగటం లాంటి డైలాగ్‌లు బాగా ప్రేక్షకులకు గుర్తుండిపోయాయి.
 
# ‘కొడుకు దిద్దిన కాపురం” సినిమా చేస్తున్నప్పుడు మహేష్‌ చిన్న పిల్లవాడు. ఇప్పుడు సూపర్‌స్టార్‌ అయ్యాడు కదా ఎలా ఉంటాడో అనుకున్నా. కానీ తొలిరోజు అతను నాతో మాట్లాడిన తీరు, చూపించిన అభిమానం చూసి నా భయాలన్నీ పోయాయి. మహేష్‌ చాలా నమ్రతతో ఉంటాడు. కొన్ని రోజులు అయ్యాక నాతో సరదాగా మాట్లాడటం మొదలయ్యింది. చిత్రీకరణలో మహేష్‌ ఇచ్చిన సహకారం మర్చిపోలేను. ఆయన నా పాత్రకే కాదు, నన్నూ వెనకుండి సపోర్ట్‌ చేశారు.
 
# ఒక్కొక్క సినిమాకు ఒక్కో తరహా పాత్ర దక్కుతుంటుంది. ‘ప్రతిఘటన’ సినిమాలో నేను నేరుగా ఏదీ చేయను. చివరలో మాత్రం గొడ్డలితో నరుకుతాను. అప్పటిదాకా విలన్‌కు హెల్ప్‌ చేస్తున్నట్లు కనిపిస్తాను. ఎక్కడా సందేహం రాకుండా ఉంటాను. కోట గారి పాత్ర అంటుంది.. ‘ఈవిడ నన్ను తిడుతుందా ? పొగుడుతుందా?’ అని. కొంత గందరగోళంలో ప్రేక్షకులు పడతారు. చివరలో విలన్‌ను చంపేస్తాను. సరిలేరు..మహేష్‌ బాబు సినిమా. హీరోతో పాటు నా పాత్ర కథలో సమాంతరంగా సాగుతుంటాయి. త్యాగం చేసే అంతకంటే చేయలని పాత్ర నాది. బాబు వచ్చి నా సమస్యలు తీర్చే బాధ్యత తీసుకుంటాడు. ఓ సన్నివేశంలో భారతి పాత్రకు సెల్యూట్‌ చేస్తాడు మహేష్‌ బాబు. నటిగా నా స్థాయి ఉండటం వల్లే హీరో సెల్యూట్‌ చేస్తే ప్రేక్షకులకు నచ్చింది. వేరే వాళ్లు నటిస్తే వాళ్లు ఒప్పుకోరు.
 
# బాధ్యతగా ఉండాలన్న ఒక మంచి విషయాన్ని ఈ చిత్రంలో దర్శకులు చెప్పారు. అది విన్నప్పుడు నిజమే కదా, కొంతమంది ఎంత ఛండాలంగా ప్రవర్తిస్తున్నారు అనిపించింది. ప్రతి ఒక్కరికీ బాధ్యత ఉండాలి, సమాజాన్ని మనమే తీర్చిదిద్దాలి, ఆరోగ్యకరమైన వాతావరణం తీసుకురావాలి. ఇవాళ కొన్ని ఘటనలు చూస్తుంటే ఎంత బాధ కలుగుతుందో. మహిళలకు గౌరవం ఇవ్వాలి, మహిళల పట్ల క్రూరంగా ప్రవర్తించడం మన సంప్రదాయం కాదు కదా. దర్శకులు అనిల్‌ సరైన విషయం చెప్పారు.
 
# నేను దర్శకులు అనిల్‌ కి కృతజ్ఞతలు చెప్పాలి. నేను మొదట్లో నటించకూడదు అనుకున్నా, ఆయన పట్టుబట్టి నాతో సినిమా చేయించారు. ఆయనకేదో లెక్క ఉండి ఉంటుంది. అది సరిగ్గా రీచ్‌ అయ్యింది. దర్శకులంటే ఒక ఆలోచన ఉంటుంది. సరైన పాత్ర వస్తే, కుదిరితే సినిమాకు కలిసొస్తుంది. కొడితే బంతి బౌండరీ దాటుతుంది. ఈ సినిమాకు అన్ని పాత్రలకు సరిపోయే నటీనటులను ఎంచుకున్నారు. చిత్రీకరణ సమయంలో చాలా నవ్వుకున్నాం. ఇంత నవ్వుకుని చాలా కాలమవుతోంది. రాజకీయాల్లో ఒత్తిడితో బీపీ వస్తుంటుంది. సినిమా చేస్తున్నప్పుడు మనశ్శాంతిగా, హాయిగా ఉంది.
 
# మన దగ్గర పేరున్న దర్శకులకు అనిల్‌ తక్కువేమీ కాదు. మనస్ఫూర్తిగా చెబుతున్న, నలభై ఏళ్ల అనుభవమున్న నటిగా చెబుతున్నా. అనిల్‌ గొప్ప దర్శకుడు అవుతాడు. ఈ కథ విన్నప్పుడు ఇంత భారీ సినిమా ఎలా చేస్తాడో అనుకున్నా, కానీ ఆయన చాలా కూల్‌గా, ఒత్తిడి లేకుండా, గందరగోళం లేకుండా వేగంగా సినిమాను చిత్రీకరించారు. అనిల్‌ ‘పటాస్‌’, ‘ఎఫ్‌2’, ‘రాజా ది గ్రేట్‌’ సినిమాలు చూశాను. బాగా హ్యూమర్‌ ఉంది, సెంటిమెంట్‌ బాగా తీశారు. ఆయనకు రాములమ్మ కథ ఇచ్చినా తెరకెక్కించగలరు. నాతో ‘కర్తవ్యం’, ‘ప్రతిఘటన’ లాంటి హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమా చేయమని అనిల్‌ను కోరుతున్నా.
 
# ఇప్పటిదాకా 60 మంది హీరోలతో కలిసి పనిచేశాను. నాతో కలిపి 61 మంది అనుకోండి, 90 దశకంలోనే నేను అత్యధిక పారితోషికం తీసుకున్నా. ఇప్పుడు అడగటం ఎందుకు. ఈ సినిమాలో హీరో తర్వాత నాదే ఎక్కువ పారితోషికం.
 
# నటిగా ఎంతోమందికి స్ఫూర్తినివ్వడం నా అదృష్టం అనుకుంటా. ‘కర్తవ్యం’ సినిమా చూసి అనేక మంది మహిళలు పోలీసు వృత్తిలోకి వచ్చారు. మగవాళ్లు స్ఫూర్తిపొందారు. ‘రౌడీ ఇన్‌స్పెక్టర్‌’లో ఆటోరాణి పాత్ర, ‘భారతరత్న’ చిత్రంలో సైనిక అధికారిగా నటించాను. ఇవన్నీ ప్రభావవంతమైన పాత్రలు. కొంతమంది మినీ విజయశాంతి అని పేర్లు పెట్టుకున్నారు. చెన్నైలో ఒక పోలీస్‌ అధికారిణి నేరగాడిని పట్టుకునే క్రమంలో అతను ఆమెను కత్తితో గాయపర్చాడు. అయినా పోరాడి అతన్ని వదలకుండా పట్టుకుని, పోలీసు స్టేషన్‌ తీసుకెళ్లింది. ఆ పోలీస్‌ అధికారిణిని చూసేందుకు వెళ్లాను.అప్పుడామె మీ ‘కర్తవ్యం’ సినిమా నాకు స్ఫూర్తి, నా పేరు ఎంటో తెలుసా విజయశాంతి అని చెప్పింది. ఒక నటిగా ఇంతకంటే ఏం కావాలి. నాకు ఇంత పేరు తీసుకొచ్చిన ప్రజలకు రుణపడి ఉంటా. రాజకీయాలైనా, సినిమాలైనా ఎక్కడున్నా ప్రజలు బాగుండాలని కోరుకుంటా.
 
# సినిమాల్లో సాధారణ పాత్రలు నేను చేయను. వాటికో స్థాయి ఉండాలి. ఎందుకంటే నటిగా అలాంటి పాత్రలు చేసి ప్రేక్షకుల్లో నాకున్న గౌరవాన్ని తగ్గించుకోలేను. రొటీన్‌ అత్త పాత్రలు లాంటివి నేను అస్సలు అంగీకరించను. బలమైన, శక్తిమంతమైన పాత్రలు వస్తే ఏడాదికి ఒక్కటైనా చాలు ఒప్పుకుంటా.
 
# ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీరిలీజ్‌ కార్యక్రమంలో చిరంజీవి గారిని కలవడం గొప్ప అనుభూతి. ఆయన రాజకీయాల విషయం ప్రస్థావనకు తీసుకొస్తారని ఊహించలేదు. ఆయన మనసులో ఏవో సందేహాలు ఉండేవి. ఆ వేదికపై అపార్థాలన్నీ తీరిపోయాయి. రాజకీయ రంగ ప్రవేశం జీవితంలో అనుకోకుండా జరిగింది. ఇక్కడ అనుకోకుండా కొన్ని సందర్భాలు వస్తుంటాయి. చిరంజీవి గారు మా మధ్య కొంత దూరం పెరిగింది. ఆ రోజు కార్యక్రమంలో అది సమసిపోయింది.