సుమన్‌బాబు ‘ఎర్రచీర’ టైటిల్‌ లోగో ఆవిష్కరణ

శ్రీ సుమన్‌ వెంకటాద్రి ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ పై సీహెచ్‌ సుమన్‌బాబు నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఎర్రచీర’. చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రం టైటిల్‌ లోగో ఆవిష్కరణ ఫిల్మ్‌ నగర్‌ కల్చరల్‌ క్లబ్‌లో గురువారం రాత్రి జరిగింది. సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్న రాజేంద్రప్రసాద్‌ మనవరాలు ‘మహానటి’ ఫేమ్‌ సాయి తుషిత టైటిల్‌ లోగోను ఆవిష్కరించింది.
 
అనంతరం దర్శకనిర్మాత సుమన్‌బాబు మాట్లాడుతూ ‘మదర్‌ సెంటిమెంట్‌’ హారర్‌ ఎలిమెంట్స్‌ ప్రధాన అంశాలుగా యదార్ధ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కిస్తున్నాం. ‘శ్రీరామ్‌’ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. కన్నడలో రెండు చిత్రాలు చేశాను. తెలుగులో తొలిసారి నటిస్తూ దర్శకత్వం వహిస్తున్నాను. మహానటి చూసి సాయి తుషితను ఎంపిక చేసాం. హీరోయిన్‌గా నటించిన కారుణ్య డ్యూయల్‌ రోల్‌లో కనిపించనుంది. ఈ పాత్రకోసం శంభోశివశంభోలో చేసిన ఆమె పెర్‌ఫార్మెన్స్‌ నచ్చి ఎంపిక చేశాం. కమల్‌ కామరాజు, భానుశ్రీ, అజయ్‌, ఉత్తేజ్‌, మహేష్‌ తమ పాత్రలకు న్యాయం చేశారు. అంతేకాకుండా ఇందులో ఓ ప్రత్యేక పాత్రను పోషించడానికి సరైన వ్యక్తిగా సురేష్‌ కొండేటిని అనుకున్నాం. త్వరలో ఆయనపై షూట్‌ చేయనున్నాం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని పోస్ట్‌ప్రొడక్షన్‌ కార్యక్రమాలు వెళతామని చెప్పారు.
బేబి సాయి తుషిత మాట్లాడుతూ.. మా తాతగారితో మహానటి నటించాను. ఆ చిత్రం ఎంతో పేరు తెచ్చింది. ఈ సినిమాలోనూ మంచి పాత్రపోషిస్తున్నానని చెప్పారు.
కారుణ్య మాట్లాడుతూ.. ఇందులో నటించడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తూ.. ఈ పాత్రలో రెండు షేడ్స్‌ వున్నాయి. నన్ను నమ్మి ఈ పాత్ర ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ.. మంచి పేరు తెస్తుందనే నమ్మకముందని పేర్కొన్నారు.
నటుడు భద్రం మాట్లాడుతూ… ఇటువంటి మంచి కథా చిత్రాలు మరిన్ని తెలుగులో రావాలి. నేను ఈ చిత్రానికి పనిచేయడం ఆనందంగా వుందని పేర్కొన్నారు.
రచయిత గోపీవిమలపుత్ర మాట్లాడుతూ ‘సుమన్‌ బాబు ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా తెరకెక్కిస్తున్నారు. ప్రతీ పాత్రకు ప్రాధాన్యత ఉన్న చిత్రమిది. సంభాషణలకు మంచి పేరు వస్తుందనే నమ్మకముందని పేర్కొన్నారు. ఇంకా సినిమాటోగ్రాఫర్‌ చందు, ఎడిటర్‌ వెంకట్‌ ప్రభు తదితరులు పాల్గొన్నారు.