నా సాహస యాత్ర కచ్చితంగా థ్రిల్‌ చేస్తుంది !

‘సాహస యాత్రికుడు బేర్‌గ్రిల్స్‌తో ట్రావెల్‌ అవ్వడం ఓ పెద్ద ఛాలెంజ్. ఆయనతో నేను చేసే సాహస యాత్ర ప్రేక్షకుల్ని కచ్చితంగా థ్రిల్‌ చేస్తుంది. నా జీవితంలో ఇటువంటి సాహస యాత్రలు చేయలేదు. ఇలాంటివి ఇంత వరకు ఎందుకు చేయలేదని బాధపడుతున్నా ‘ అని అంటున్నారు బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్ కుమార్‌. అతను సాహసభరిత విన్యాసాలు, డూప్‌ లేకుండా యాక్షన్‌ సీన్స్ చేేసిన సందర్భాలు చాలా ఉన్నాయి.యాక్షన్‌ చిత్రాలతో అక్షయ్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ ‘యాక్షన్‌ స్టార్’‌ ఇప్పుడు సాహస యాత్రికుడు బేర్‌ గ్రిల్స్‌తో కలిసి సాహసాలు చేయబోతున్నాడు. సాహసయాత్ర ఎపిసోడ్‌ టీజర్‌ విపరీతంగా ఆకట్టుకుంది. తాజాగా అక్షయ్ మరో టీజర్‌ని ఇన్‌స్టా ద్వారా షేర్‌ చేసుకున్నారు. ఈ టీజర్‌లో, యాక్షన్‌ ఫిల్మ్స్‌ కథానాయకుడిగా అక్షయ్ ని బేర్‌ గ్రిల్స్‌ పరిచయం చేసారు.. దీనికి అక్షయ్ స్పందిస్తూ..’నేను రీల్‌ హీరో.. ఆయన రియల్‌ హీరో’ అని అన్నారు. బేర్‌గ్రిల్స్‌తో సాహస యాత్ర నాకొక ఛాలెంజింగ్‌గా ఉంది. ‘ఏనుగు టీ’ తో నన్ను సర్‌ప్రైజ్‌ చేశారని అక్షయ్ చెప్పారు.
 
ఈ సాహస యాత్ర ఎపిసోడ్‌ సెప్టెంబర్‌ 11న ‘డిస్కవరీ ప్లస్’‌ యాప్‌లో విడుదల కానుంది. సెప్టెంబర్‌ 14న ‘డిస్కవరీ ఛానెల్’‌లో ప్రసారం అవ్వనుంది. గతంలో ప్రధాని నరేంద్రమోడీ, అగ్ర కథానాయకుడు రజనీకాంత్‌ సైతం బేర్‌ గ్రిల్స్‌తో కలిసి సాహస యాత్ర చేశారు. కోట్లలో వీరిద్దరి సాహస యాత్రను ప్రేక్షకులు వీక్షించారు. విపరీతమైన రేటింగ్‌ వచ్చింది. వారి తర్వాత ఈ యాత్ర చేసిన మూడో భారతీయుడు అక్షయ్ కావడం విశేషం.
 
అక్షయ్ ప్రస్తుతం ‘లక్ష్మీబాంబ్‌’, ‘సూర్యవంశీ’, ‘పృథ్వీరాజ్‌’, ‘అట్రంగి రే’, ‘బెల్‌ బాటమ్‌’ వంటి తదితర చిత్రాల్లో నటిస్తున్నారు. వీటిల్లో ‘లక్ష్మీబాంబ్‌’ చిత్రీకరణ పూర్తి చేసుకుని త్వరలోనే ఓటీటీలో విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే రిలయన్స్‌ సంస్థ నిర్మించిన ‘సూర్యవంశీ’ చిత్రం కూడా ఓటీటీ ద్వారానే ప్రేక్షకుల ముందుకొచ్చే ఛాన్స్‌ ఉంది.