వైజయంతీ మూవీ కోసం అమితాబ్‌పై క్లాప్ కొట్టిన ప్ర‌భాస్

ప్రభాస్, అమితాబ్‌ బచ్చన్, దీపికా పదుకొనె, నాగ్‌ అశ్విన్, వైజయంతీ మూవీస్‌ కలిసి  ఓ సూపర్భ్‌ సినిమా ప్రయాణాన్ని కలిసి మొదలుపెట్టారు.ఈ సినిమా షూటింగ్‌ కోసం అమితాబ్‌బచ్చన్‌ హైదరాబాద్‌ వచ్చి,  ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. రామోజీ ఫిల్మ్‌ సిటీలో అమితాబచ్చన్‌తో పాటు ఇతర ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు దర్శకులు నాగ్‌ అశ్విన్‌. అమితాబ్ బ‌చ్చ‌న్ మీద చిత్రీక‌రించిన ఈ సినిమా ఫస్ట్‌ షాట్‌కు ఈ చిత్ర హీరో ప్రభాస్‌ క్లాప్‌ ఇవ్వడం విశేషం.”గురు పౌర్ణమి రోజున‌ ఇండియన్‌ సినిమా గురు అమితాబ్ గారిమీద క్లాప్ కొట్ట‌డం గౌర‌వంగా భావిస్తున్నాను” అని ప్ర‌భాస్ తెలిపారు. “బాహుబలి’ సినిమాతో మనదేశంలోనే కాదు…ప్రపంచవ్యాప్తంగా మన పేరు  విస్తరింపజేసిన ఐకాన్‌ ప్రభాస్ ‘ప్రాజెక్ట్‌ కె’ (వ‌ర్కింగ్ టైటిల్‌) ముహూర్తపు షాట్‌కు క్లాప్‌ ఇవ్వడాన్ని గౌరవంగా ఫీల్‌ అవుతున్నాను”అని అమితాబ్‌ బచ్చన్ అన్నారు.

నటి సావిత్రి జీవితం ఆధారంగా రూపొంది, జాతీయ అవార్డులు సాధించిన ‘మహానటి’ కి  దర్శకత్వం వహించిన నాగ్‌అశ్విన్‌ ఈ భారీ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కథ, కాన్సెప్ట్, తెరకెక్కించే విధానం ప్రేక్షకులకు కొత్తగా,ఆశ్చర్యంగా ఉంటాయి. ఈ సినిమాలో దేశీయ, అంతర్జాతీయ నటీనటులు ఈ భాగమైయ్యారు. ఈ సినిమా చిత్రీకరణ కోసం రామోజీఫిల్మ్‌సిటీలో ఇండియన్‌ సినిమాల్లో అత్యంత ఖర్చుతో కూడుకున్న సినిమా సెట్‌తో ఓ సరికొత్త ప్రపంచాన్నే సృష్టించారు చిత్ర యూనిట్‌.ఈ మూవీ ప్రేక్షకుల‌కు మునుపెన్నడూ ఆస్వాదించని గొప్ప అనుభూతిని తప్పక అందిస్తుంది అని చిత్ర యూనిట్ చెబుతోంది.

వైజయంతీ మూవీస్‌ పతాకంపై అద్భుతమైన హిట్స్ అందించిన సి. అశ్వనీదత్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వైజయంతీ మూవీస్‌ నిర్మాణరంగంలో విజయవతంగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.