సినిమాను థియేటర్లో చూడటం.. ఓ సామూహిక అనుభవం!

‘‘సినిమాను థియేటర్లో చూడటం అనేది మన డీఎన్‌ఏలోనే ఉంది. అదో సామూహిక అనుభవం’’ అని పేర్కొన్నారు ప్రముఖ మల్టీప్లెక్స్‌ చైన్ల (పీవీఆర్, ఐనాక్స్, సినీపోలిస్‌ వంటి సంస్థల) సీఈవోలు. “లాక్‌డౌన్‌ సమయంలో దాదాపు అన్ని వ్యాపారాలు మూతబడ్డాయి. ప్రస్తుతం అన్‌లాక్‌ ప్రక్రియ మొదలయింది. ఆగస్ట్‌ చివరి వారంలో థియేటర్స్‌లో సినిమాల ప్రదర్శన ప్రారంభం అవుతుందనుకుంటున్నాం’’ అని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే థియేటర్స్‌ ప్రారంభం అయితే ఎలా నడిపించాలనుకుంటున్నారో మొదలైన అంశాలను పొందుపరిచి వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలకు, ప్రధానమంత్రి ఆఫీస్‌కి లేఖ రాశారు…
 
# థియేటర్స్‌కి వచ్చేవాళ్లకు మాస్క్‌ తప్పనిసరి చేస్తాం. లోపలికి వచ్చే ముందు తప్పకుండా ఉష్ణోగ్రత చూసే లోపలికి అనుమతించడం జరుగుతుంది.
# ఇక నుంచి మొత్తం డిజిటల్‌ విధానంలో పనులు జరిగేలా చూస్తాం. పేపర్‌ టికెటింగ్‌ను పూర్తిగా నిషేధిస్తాం. ఎస్‌ఎంఎస్, బార్‌కోడ్‌ స్కానింగ్‌ పద్ధతిని పాటిస్తాం.
# ఒక సీట్‌కి మరో సీట్‌కి మధ్య గ్యాప్‌ ఉండేలా జాగ్రత్తపడతాం.
# మల్టీప్లెక్స్‌లో ఏ రెండు షోలు ఒకేసారి ప్రారంభం కాకుండా చూసుకుంటాం. దానివల్ల అన్ని స్క్రీన్స్‌లో ఇంటర్వెల్‌ ఒకేసారి కాకుండా వేరే వేరే టైమ్‌లో ఉంటుంది. ఇలా అయితే రద్దీ ఏర్పడే అవకాశం తక్కువ.
# ప్రతీ షోకి మధ్యలో కనీసం 15 నిమిషాల నుంచి అర్ధగంట విరామం ఉంటుంది. ఈ సమయంలో మొత్తం సీటింగ్‌ శానిటైజ్‌ చేయడానికి వీలవుతుంది.
# మల్టీప్లెక్స్‌లో వీలైనన్ని శానిటైజర్లు ఏర్పాటు చేస్తాం.
 
‘‘సినిమా చూడటానికి వచ్చే ప్రతీ ప్రేక్షకుడి భద్రత విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాం. ప్రేక్షకులకు నమ్మకం కలిగించే వాతావరణం సృష్టించాలనుకుంటున్నాం. అలాగే ‘ఒక్క పెద్ద సినిమా వస్తే.. మళ్లీ ప్రేక్షకులు థియేటర్స్‌కి వస్తారు’ అనడంలో ఎటువంటి సందేహం లేదు. కొన్ని సినిమాలు థియేటర్స్‌కి రాకుండానే ఓటీటీలకు వెళ్లిపోయాయి. అదో కొత్త పరిణామం. ప్రస్తుతం అందరం కష్ట సమయంలో ఉన్నాం. సినిమా థియేటర్ల వ్యాపారం ఏడాదికి పన్నెండు వేల కోట్లు ఉంటుంది. ప్రస్తుతం థియేటర్స్‌ మూతబడటంతో నెలకు సుమారు వెయ్యి కోట్ల నష్టం ఏర్పడుతోంది. అయితే, అంతా సాధారణ స్థితికి వస్తుంది. ఎందుకంటే.. సినిమాను థియేటర్లో చూడటం అనేది మన డీఎన్‌ఏలోనే ఉంది. అదో సామూహిక అనుభవం’’ అని ఆయా సంస్థల ప్రతినిధులు పేర్కొన్నారు.
సినిమా హాళ్లను ఆగస్టు లో పునర్ ప్రారంభించాలి !
దేశవ్యాప్తంగా సినిమా హాళ్లను ఆగస్టు నెలలో పునర్ ప్రారంభించాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ(ఐబీ మినిస్ట్రీ) తాజాగా సిఫారసు చేసింది. కేంద్ర సమాచార ప్రసార శాఖ కార్యదర్శి అమిత్ ఖరీ సినిమా పరిశ్రమ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆగస్టులో సినిమా హాళ్లను పునర్ ప్రారంభించనున్నట్లు సూత్రప్రాయంగా వెల్లడించారు. సినిమా హాళ్ల పునర్ ప్రారంభంపై కేంద్ర హోంమంత్రిత్వశాఖ కార్యదర్శి అజయ్ భల్లా తుది నిర్ణయం తీసుకుంటారని అమిత్ చెప్పారు. ఆగస్టు 1వతేదీ లేదా ఆగస్టు 31వతేదీన దేశంలోని అన్ని నగరాల్లోని సినిమా హాళ్లను పునర్ ప్రారంభించాలని తాము సిఫారసు చేశామని కేంద్ర కార్యదర్శి వెల్లడించారు. కేంద్ర కార్యదర్శితో జరిగిన సమావేశంలో సోనీ సీఈవో సం బల్సారా, మెగా టాటా (డిస్కవరి) గౌరవ్ గంధి (అమెజాన్ ప్రైమ్), మనీష్ మహేశ్వరి (ట్విట్టర్), శివకుమార్, కె. మాధవన్ (స్టార్ అండ్ డిస్నీ) లు పాల్గొన్నారు.