సినీ ప్రముఖులు అడ్డంగా దొరికిపోయారు !

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసేందుకు గానూ కొందరు సినీ ప్రముఖుల డబ్బు తీసుకున్న వైనం తాజాగా వెలుగులోకి వచ్చింది. పార్టీలకు అనుకూలంగా పోస్టులు పెట్టేందుకు ఒప్పుకుని 36 మంది బాలీవుడ్ ప్రముఖులు కెమెరాకు అడ్డంగా బుక్ అయ్యారు. వీరిలో జాకీ ష్రాఫ్, సోనూసూద్, వివేక్ ఒబెరాయ్, కైలాశ్ ఖేర్ ఉన్నారు. ‘కోబ్రాపోస్ట్’ అనే ఆన్‌లైన్ పోర్టల్ నిర్వహించిన స్ట్రింగ్ ఆపరేషన్‌లో వీరు దొరికిపోయారు. కోబ్రాపోస్ట్ విలేఖరులు ప్రజాసంబంధాల ప్రతినిధులమని చెప్పుకుంటూ.. సినీ, టీవీ నటులు, గాయకులు తదితరులను వారి మేనేజర్ల ద్వారా సంప్రదించారు.
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తాము సూచించిన రాజకీయ పార్టీకి అనుకూలంగా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ పెడితే చాలని ప్రతిపాదించారు. దీనికి 36 మంది ప్రముఖులు అంగీకరించారు. ‘‘అత్యాచారం, వంతెనలు కూలడం వంటి వివాదాస్పద అంశాల్లో వీరు ప్రభుత్వాన్ని సమర్థించడానికి అంగీకరించారు. ఈ ప్రచారాన్ని కప్పి పుచ్చడానికి ఏదో ఉత్పత్తులకు అనుకూలంగా ప్రచారం చేస్తున్నట్లు ఒక డమ్మీ కాంట్రాక్టుపై సంతకం చేయడానికి కూడా వారు సిద్ధపడ్డారు’’ అని కోబ్రాపోస్ట్‌ ముఖ్య సంపాదకుడు అనిరుద్ధ బహల్‌ చెప్పారు. ఒక్కో పోస్ట్‌కు రూ.2 లక్షల నుంచి 50 లక్షల వరకూ డిమాండ్ చేశారని తెలిపారు. 8 నెలల కాంట్రాక్ట్ కోసం రూ.20 కోట్లు అడిగిన వారు కూడా ఉన్నారట. అయితే విద్యాబాలన్, సౌమ్య టాండన్, అర్షద్ వార్సి, రజా మురాద్ మాత్రం ఈ ఒప్పందానికి ససేమిరా ఒప్పుకోలేదని బహల్ తెలిపారు.
అయితే ఒప్పుకున్న ప్రముఖులు వరుసగా పెట్టిన ట్వీట్స్, స్ట్రింగ్ ఆపరేషన్‌లో దొరికిన వీడియోలను ఈ మీడియా పోర్టల్ విడుదల చేసింది. అయితే ఈ విషయమై స్పందించిన సోనూసూద్.. వీడియోలోని తన మాటల్లో మార్పులు చేశారని, కొన్ని అంశాలనే ఉపయోగించుకుంటూ చెడుగా తనను చూపించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. డబ్బు తీసుకొని ట్వీట్లు చేయడానికి అంగీకరించినవారిలో అమీషా పటేల్‌, సన్నీ లియోన్‌, శ్రేయస్‌ తల్పడే, రాఖీ సావంత్‌, శక్తి కపూర్‌, పంకజ్‌ ధీర్‌, ఆయన కుమారుడు నికితిన్‌ ధీర్‌, కోయినా మిత్రా, పునీత్‌ ఇస్సార్‌, రాజ్‌పాల్‌ యాదవ్‌, మిన్నిసా లాంబ, టిస్కా చోప్రా, మహిమా చౌధురి, రాహుల్‌ భట్‌, రోహిత్‌ రాయ్‌, అమన్‌ వర్మ, గాయకులు దలేర్‌ మెహందీ, మికా, అభిజిత్‌ భట్టాచార్య, బాబా సెహ్‌గల్‌, నృత్య దర్శకుడు గణేశ్‌ ఆచార్య, హాస్య నటులు రాజ్‌పాల్‌ యాదవ్‌, రాజు శ్రీవాస్తవ, కృష్ణ అభిషేక్‌, విజయ్‌ ఈశ్వర్‌లాల్‌ పవార్‌ తదితరులు ఉన్నారు