ఘనంగా బాలీవుడ్ హీరో పైడి జయరాజ్ జయంతి వేడుకలు

అప్పట్లో అందరు సినిమాల్లో రాణించాలని మద్రాసు వెళితే మన జైరాజ్ మాత్రం ముంబై రైలు ఎక్కి ముంబై చేరుకొని అక్కడ సినిమాల్లో ప్రయత్నాలు సాగించారు. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి హీరోగా ఎదిగి బాలీవుడ్ లో మొదటి తరం హీరోల్లో ఒకరిగా స్టార్ ఇమేజ్ అందుకుని విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసిన మహా నటుడు పైడి జయ రాజ్. దేశంలోనే ప్రతిష్టాత్మకంగా ఇచ్చే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకోవడం విశేషం. సెప్టెంబర్ 28న అయన 113వ జన్మదినం సందర్బంగా జయంతి వేడుకలు బుధవారం ఫిలిం ఛాంబర్ లో ప్రముఖ నటుడు పంజాల జైహింద్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగాయి. ఈ వేడుకలు పంజాల శ్రావణ్  గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా  జరిగాయి.
నిర్మాత శ్రావణ్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రాంతం నుండి మూకీల సమయంలోనే హీరోగా బాలీవుడ్ లో నిలదొక్కుకున్న తెలంగాణ నటుడు పైడి జయ రాజ్.ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి హీరోగా ఎదిగి ఆ తరువాత దేశంలోనే ప్రతిష్టాత్మకంగా ఇచ్చే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకోవడం తెలంగాణ వారీగా, ముక్యంగా తెలుగు వారీగా ఇది మనకు నిజంగా గర్వకారణం. అయన జీవితం నేటితరాలకు స్ఫూర్తి. రియల్ హీరోగా ఎదిగిన అయన మనందరికీ ఆదర్శం. గత 14 సంవత్సరాలుగా అయన జయంతి వేడుకలను మన నటుడు జైహింద్ గౌడ్ గారు సొంత ఖర్చులతో ఘనంగా జరుపుకుంటూ వస్తున్నారు. అయితే ఈ రోజు అయన 113 వ జన్మదిన వేడుకలను  జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఫిలిం ఛాంబర్ పరిధిలో అయన విగ్రహం ఏర్పాటు చేయాలని ఛాంబర్ అధ్యక్షులకు తెలియజేయడం జరిగింది.అలాగే రాష్ట్ర గవర్నమెంట్ పైడి జయరాజ్ విగ్రహాన్ని  ట్యాంక్ బండ్ పై ప్రతిష్టించాలి. పైడి జయరాజ్ పేరుతో అవార్డ్స్ ప్రకటించాలని డిమాండ్ చెస్తున్నాము అన్నారు.సర్దార్ పాపన్న, హీరో  వంజాల జైహింద్ గౌడ్ మాట్లాడుతూ… తెలంగాణకు చెందిన పైడి జైరాజ్ గారు గొప్ప నటుడు. అయన 1980 లోనే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న గొప్ప వ్యక్తి పైడి జైరాజ్ గారు. అప్పట్లోనే అంటే మూకీల సమయంలోనే హీరోగా ఎదిగిన వ్యక్తి. అయన జీవితం మనందరికీ ఆదర్శం. అలాంటి మహనీయుడిని మనం మరచి పోకూడదు.అలాంటి వ్యక్తి గురించి తెలుగు పరిశ్రమ మరచిపోయిందని తెలిసి నేను గత 14 సంవత్సరాల నుండి నా సొంత  ఖర్చులతో అయన అయన చరిత్రను తెలుపుతూ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నాను. రాష్ట్ర గవర్నమెంట్ పైడి జయరాజ్ జయంతిని ఇంకా గ్రాండ్ గా నిర్వహించాల్సిన అవసరం ఉంది. తొందరలో మేము  పైడి జయరాజ్ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది.ప్రస్తుతం నేను నాలుగు సినిమాలు చేస్తున్నాను. ఈ సినిమాలకు వంజాల జైహింద్ గౌడ్ హీరోగా,  మమతా గౌడ్ హీరోయిన్ గా ఉంటారు అన్నారు.
పైడి జైరాజ్ గురించి .. క్లుప్తంగా ..
పైడి జైరాజ్ సెప్టెంబరు 28, 1909 న జన్మించారు. భారత చలనచిత్ర రంగంలో తనదైన ముద్ర వేసుకున్నారు. తెలంగాణ ప్రాంతం కరీంనగర్ కు చెందిన తెలుగు నటుడు, నిర్మాత, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. పైడి జైరాజ్ 156 కు పైగా చిత్రాలలో కథానాయకుడి పాత్రలతోపాటు మొత్తం 300 పైగా మూకీ, టాకీ సినిమాలలో నటించారు. కరీంనగర్ జిల్లాకు చెందిన జైరాజ్ హైదరాబాద్ నిజాం కాలేజీలో చదివి సినిమాలపై ఆసక్తితో 1929లో ముంబాయి చేరుకున్నారు. తన ఇరవైయ్యో యేట 1930 లో తొలిసారిగా ” స్పార్క్లింగ్ యూత్ ” అనే మూకీ చిత్రంలో నటించారు. అదే సంవత్సరంలో ” ట్రయంఫ్ ఆఫ్ లవ్ ” అనే చిత్రంలో కథానాయకునిగా నటించారు. జైరాజ్ మొత్తం 11 మూకీ చిత్రాల్లో నటించారు.1931 లో ప్రారంభమైన టాకీ యుగంలో ఆయన ” షికారి ” ఉర్దూ చిత్రంతో టాకీల్లో ప్రవేశించారు. తర్వాత కాలంలో శాంతారాం, పృధ్వీరాజ్ కపూర్ లాంటి పెద్ద హీరోల సరసన మరో స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. నిరూపా రాయ్, శశికళ, దేవికారాణి, మీనాకుమారి లాంటి హీరోయిన్ లతో నటించారు. సుమారు 156 ‘టాకీ’ సినిమాలలో కథానాయకుడిగా, విలక్షణమైన నటుడిగా పలు వైవిధ్యమైన పాత్రలు పోషించారు. హిందీ, ఉర్దూ భాషలతో పాటు, కొన్ని మరాఠీ, గుజరాతీ భాషా చిత్రాలలో కూడా నటించారు. జైరాజ్ పోషించిన టిప్పు సుల్తాన్, పృథ్వీరాజ్ చౌహాన్, రాణా ప్రతాప్ మొదలైన చారిత్రక సంబంధ పాత్రలు విశిష్టమైనవి. సామ్రాట్ పృథ్వీరాజ్ సినిమా 1962, ఫిబ్రవరి 24న విడుదలైంది. సామ్రాట్ పృథ్వీరాజ్ చౌహాన్ అనే హిందీ సినిమా తెలుగులోకి అనువాదం చేయబడింది.

నటుడిగానే కాక మొహర్, మాలా, ప్రతిమ, సాగర్ లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇందులో ‘ సాగర్ ‘ చిత్రానికి నిర్మాత కూడా ఆయనే. పైడి జైరాజ్ తెలుగు వాడైనప్పటికీ కూడా ఒక్క తెలుగు చిత్రంలోనూ నటించలేకపోయారు. జైరాజ్ భారతీయ సినిమా వికాసానికి తన జీవితకాలంలో చేసిన సేవలకు గుర్తింపుగా ప్రతిష్ఠాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును 1980లో కేంద్ర ప్రభుత్వం ప్రధానం చేసి గౌరవించింది. పైడి జయరాజ్ కు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కూతుర్లు. అయన 2000 సంవత్సరం ఆగష్టు 11న పరమపదించారు.