సంచలనాత్మక నిర్ణయం : అమలయ్యేనా ?

ఇప్పటి వరకూ ఏదైనా సినిమా ఫ్లాప్ అయితే ఫిలిం డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు మాత్రమే నష్టాన్ని ఎక్కువగా భరించేవాళ్లు. ఇకపై దీనిని సరిదిద్దాలని టాలీవుడ్ ఫిలిం డిస్ట్రిబ్యూటర్లు, ఫిలిం మేకర్లు నిర్ణయించారని సమాచారం. దీని కోసం ఓ ఆలోచన చేశారు. ఇకపై సినిమా ఫ్లాప్ అయితే ఆ నష్టాన్ని డైరెక్టర్, ఆ సినిమా హీరో కూడా షేర్ చేసుకోవాలనే ప్రతిపాదనను తీసుకొచ్చారని తెలుస్తోంది. దీని ప్రకారమే సురేష్ బాబు, సునీల్ నారంగ్, దిల్ రాజు తదితరులతో కమిటీ ఏర్పాటైందని టాక్. ఈ కమిటీ ఈ నెల 24న ఫిలిం చాంబర్‌లో సమావేశం కాబోతోందని తెలుస్తోంది.
కమిటీ ప్రపోజల్ ప్రకారం.. సినిమా డైరెక్టర్, హీరో రెమ్యునరేషన్‌లో 25శాతం నిర్మాత వద్దే ఉంచుతారట. ఒకవేళ బయ్యర్ 25శాతం కంటే ఎక్కువ డబ్బు లాస్ అయితే అప్పుడు ప్రొడ్యూసర్ ఆ రెమ్యూనరేషన్‌ని బయ్యర్లకు పంచుతారని సమాచారం. కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే హీరో, డైరెక్టర్ ఫైనల్ రెమ్యునరేషన్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఇది అక్కినేని అఖిల్ మూవీ హలో సినిమాతోనే ప్రారంభమవుతుందట. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ల రెమ్యూనరేషన్ రూ.15కోట్ల పైమాటేనట. స్టార్ హీరోల రెమ్యూనరేషన్ 13 నుంచి 30కోట్ల దాకా ఉందని సమాచారం.