మహేష్‌ హీరోగా అనిల్‌ రావిపూడి చిత్రం ప్రారంభం

సూపర్‌ స్టార్‌ మహేష్‌ హీరోగా యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఎ.కె ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా రూపొందిస్తున్న భారీ చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ చిత్రం ప్రారంభోత్సవం సూపర్‌స్టార్‌ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు (మే 31) అన్నపూర్ణ స్టూడియోస్‌లో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు క్లాప్‌ కొట్టగా, మెగా మేకర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ రెడ్డి కెమెరా స్విచ్‌ ఆన్‌ చేసారు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు, దిల్‌ రాజు సంయుక్తంగా స్క్రిప్ట్‌ను దర్శకుడు అనిల్‌ రావిపూడికి అందించారు. ఫస్ట్‌షాట్‌ను అనిల్‌ రావిపూడి దేవుడి పటాలపై చిత్రీకరించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో…
ప్రముఖ నిర్మాత అనిల్‌ సుంకర మాట్లాడుతూ – ”ఈ రోజు మే 31 సూపర్‌ స్టార్‌ కృష్ణగారి పుట్టిన రోజు సందర్భంగా సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు 26వ సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం ప్రారంభం అయ్యింది. దిల్‌ రాజు, అనిల్‌ రావిపూడి సహకారంతో అభిమానులకు, రెండు రాష్ట్రాల ప్రేక్షకులకు అదిరిపోయే రేంజ్‌ లో సంక్రాంతికి విడుదల చేస్తున్నాం” అన్నారు.
హిట్‌ చిత్రాల నిర్మాత దిల్‌ రాజు మాట్లాడుతూ – ”ముందుగా సూపర్‌స్టార్‌ కృష్ణ గారికి 77వ పుట్టినరోజు శుభాకాంక్షలు. మా టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి డైరెక్షన్‌లో ‘మహర్షి’ తరువాత మళ్ళీ మూడు బేనర్‌లు నాది, అనిల్‌ సుంకరగారి ఎ.కె ఎంటర్‌టైన్‌మెంట్స్‌, మహేష్‌ బాబుగారి జిఎంబి కలిసి నిర్మిస్తున్నాం. అనిల్‌ సంక్రాంతి 2020 అని ఆల్‌రెడీ రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌ చేసారు. మనందరికీ తెలుసు 20-20 క్రికెట్‌ మ్యాచ్‌లు ఎలా ఉంటాయో. అలా సంక్రాంతికి అలాంటి ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇవ్వడానికి అనిల్‌ రెడీ అయ్యారు. టీం అందరికి అల్‌ ది బెస్ట్‌” అన్నారు.
యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ – ”నా లైఫ్‌లో మోస్ట్‌ మెమొరబుల్‌ డే. నాకు ఈ అవకాశం ఇచ్చిన సూపర్‌స్టార్‌ మహేష్‌గారిని ఎప్పటికీ మర్చిపోలేను. డెఫినెట్‌గా ఒక మంచి హిట్‌ ఫిలిం ఇచ్చి ఆయన ఋణం తీర్చుకుంటాను. ఈ సినిమా మూడు బేనర్‌లు కలిసి ప్రొడ్యూస్‌ చేయడం హ్యాపీ. ఇక ఈ సినిమాలో మంచి కాస్ట్‌ అండ్‌ క్రూ చేయబోతున్నారు. ముఖ్యంగా విజయశాంతిగారు 13 సంవత్సరాల తరువాత ఈ సినిమాతో రీ-ఎంట్రీ ఇవ్వ బోతున్నారు. ఈ సబ్జెక్ట్‌ నచ్చి ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. ఈ సినిమాలో మహేష్‌గారు ఆర్మీ మేజర్‌ క్యారెక్టర్‌ చేయబోతున్నారు. ఇంకా ఈ సినిమాలో హీరోయిన్‌ రష్మిక, జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌ ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు. ‘భరత్‌ అనే నేను’, ‘మహర్షి’ తర్వాత దేవిశ్రీప్రసాద్‌ మాతో జాయిన్‌ అవుతున్నారు. దేవిశ్రీకి థాంక్స్‌. మహేష్‌గారిలో ఫ్యాన్స్‌ కోరుకునే అన్ని ఎలిమెంట్స్‌ ఈ సినిమాలో ఉంటాయి” అన్నారు.
సీనియర్‌ హీరోయిన్‌ విజయశాంతి మాట్లాడుతూ – ”నా తొలి చిత్రం ‘కిలాడి కృష్ణుడు’ సినిమాలో సూపర్‌స్టార్‌ కృష్ణ సరసన నటించే అవకాశం లభించింది. ఇప్పుడు 13 సంవత్సరాల తర్వాత మళ్ళీ సూపర్‌స్టార్‌ కృష్ణ తనయుడు సూపర్‌స్టార్‌ మహేష్‌తో కలిసి నటించడం చాలా హ్యాపీ” అన్నారు.
హీరోయిన్‌ రష్మిక మందన్న మాట్లాడుతూ – ”ముందుగా కృష్ణగారికి హ్యాపీ బర్త్‌డే. ఈ సినిమాలో వర్క్‌ చేయడానికి చాలా ఎగ్జయిటెడ్‌గా ఉన్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన అనిల్‌కి, నిర్మాతలకి థాంక్స్‌” అన్నారు.
రాక్‌స్టార్‌ దేవిశ్రీప్రసాద్‌ మాట్లాడుతూ – ”కృష్ణగారి పుట్టినరోజునే ఈ సినిమా ఓపెనింగ్‌ జరగడం చాలా హ్యాపీగా ఉంది. ‘మహర్షి’ సక్సెస్‌ని ఎంజాయ్‌ చేస్తూనే ఈ సినిమాలో అడుగుపెడుతున్నట్లు అన్పిస్తుంది. చాలామంది మహేష్‌గారి ఫ్యాన్స్‌ అడుగుతున్నారు. మా హీరోకి ఒక మాస్‌ సాంగ్‌ కావాలని. మీ అందరికీ ఈరోజు చెబుతున్నాను. పార్టీ అంటే ఖచ్చితంగా ఆ పాటే పెట్టేవిధంగా ఒక మాస్‌ సాంగ్‌, అలాగే ఈ పాట పెట్టకుండా లవ్‌ చేయొద్దు అనే లాంటి ఒక లవ్‌ సాంగ్‌ చెయ్యాలని అనీల్‌గారు, నేను డిసైడ్‌ అయ్యాం. మహేష్‌గారి ఫ్యాన్స్‌ అందరికీ ఇదే నా ప్రామిస్‌” అన్నారు.
సూపర్‌ స్టార్‌ మహేష్‌,రష్మిక మందన్న, ప్రత్యేక పాత్రలో సీనియర్‌ హీరోయిన్‌ విజయశాంతి, జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, బండ్ల గణేష్‌ నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, నిర్మాతలు: రామబ్రహ్మం సుంకర, దిల్‌ రాజు, దర్శకత్వం: అనిల్‌ రావిపూడి