మహేష్‌ హీరోగా వంశీ పైడిపల్లి చిత్రం ప్రారంభం !

సూపర్‌స్టార్‌ మహేష్‌ కథానాయకుడుగా సూపర్‌హిట్‌ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ మరియు వైజయంతీ మూవీస్‌ పతాకాలపై ప్రముఖ నిర్మాతలు సి.అశ్వనీదత్‌, దిల్‌రాజు నిర్మిస్తున్న భారీ చిత్రం షూటింగ్‌ ముహూర్తం ఆగస్ట్‌ 14న అన్నపూర్ణ స్టూడియోలో వైభవంగా ప్రారంభం అయింది. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు, సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌.. దర్శకుడు వంశీ పైడిపల్లికి స్క్రిప్ట్‌ అందించారు. సూపర్‌స్టార్‌ మహేష్‌ తనయుడు ఘట్టమనేని గౌతమ్‌ క్లాప్‌ నివ్వగా, కుమార్తె ఘట్టమనేని సితార కెమెరా స్విచ్‌ ఆన్‌ చెయ్యగా దర్శకుడు వంశీ పైడిపల్లి కుమార్తె పైడిపల్లి ఆద్య దేవుని పటాలపై చిత్రీకరించిన తొలిషాట్‌కి దర్శకత్వం వహించారు.
శిరీష్‌, లక్ష్మణ్‌, అశ్వనీదత్‌ కుమార్తె స్వప్నదత్‌, దిల్‌ రాజు కుమార్తె శ్రీహన్షితరెడ్డి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. తెలుగు చలన చిత్ర రంగానికి చెందిన అనేకమంది ప్రముఖులు ఈ ప్రారంభోత్సవానికి విచ్చేశారు. నమ్రతా మహేష్‌, ప్రముఖ నిర్మాతలు జెమిని కిరణ్‌, నవీన్‌ ఎర్నేని, రవిశంకర్‌ యలమంచిలి,సునీల్‌ నారంగ్‌, ప్రముఖ దర్శకులు సురేందర్‌రెడ్డి, సతీష్‌ వేగేశ్న, హరీష్‌ శంకర్‌, చిత్ర సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే తెలియజేస్తారు.
ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, కథ: వంశీ పైడిపల్లి, హరి, సాల్మన్‌, సినిమాటోగ్రఫీ: పి.ఎస్‌.వినోద్‌, నిర్మాతలు: సి.అశ్వనీదత్‌, దిల్‌రాజు, దర్శకత్వం: వంశీ పైడిపల్లి.