‘తెలుగు ఫిల్మ్‌ఛాంబర్‌’ ఎన్నికల్లో ‘మన ప్యానెల్‌’ విజయం

‘తెలుగు ఫిల్మ్‌ చాంబర్‌’కు శనివారం జరిగిన ఎన్నికల్లో నిర్మాత సి.కల్యాణ్‌ సారథ్యంలోని ‘మన ప్యానెల్‌’ విజయం సాధించింది. ప్రొడ్యూసర్స్‌ సెక్టార్‌కు సంబంధించి ప్యానెల్‌కు జరిగిన ఎన్నికల్లో సి.కల్యాణ్‌, దిల్‌ రాజు ప్యానెల్స్‌ పోటీ పడ్డాయి. పోలింగ్‌ ముగిసిన తర్వాత ఓట్లను లెక్కించారు. మొత్తం పన్నెండు మంది ఈసీ సభ్యుల్లో సి.కల్యాణ్‌ ‘మన ప్యానెల్‌’కు చెందిన తొమ్మిది మంది, దిల్‌ రాజు ‘యాక్టివ్‌ ప్యానెల్‌’కు చెందిన ఇద్దరు గెలుపొందారు. ఇరవై మంది సెక్టార్‌ సభ్యుల్లో మొత్తం పదహారు మంది కల్యాణ్‌ ప్యానెల్‌ నుంచి గెలిచారు. నలుగురు దిల్‌ రాజు ప్యానెల్‌ నుంచి విజయం సాధించారు. స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసిన మోహన్‌ గౌడ్‌ కూడా గెలిచారు. అనంతరం గెలిచిన సభ్యులు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకొన్నారు.
ఫిల్మ్‌ చాంబర్‌ నూతన అధ్యక్షుడిగా నారాయణదాస్‌ కృష్ణదాస్‌ నారంగ్‌, ఉపాధ్యక్షులుగా దిల్‌ రాజు (ప్రొడ్యూసర్స్‌ సెక్టార్‌), ముత్యాల రామదాసు (డిస్ట్రిబ్యూటర్స్‌ సెక్టార్‌), కొల్లి రామకృష్ణ ( స్టూడియో సెక్టార్‌), కార్యదర్శులుగా కె. ఎల్‌. .దామోదరప్రసాద్‌, ముత్యాల రమేశ్‌, సంయుక్త కార్యదర్శులుగా నట్టి కుమార్‌, భరత్‌ చౌదరి, జి. వీరనారాయణబాబు, ఎన్‌. నాగార్జున, జె. మోహన్‌రెడ్డి, ిపి.భరత్‌భూషణ్‌, కోశాధికారిగా విజయేంద్రరెడ్డి ఎన్నికయ్యారు. అలాగే ప్రొడ్యూసర్స్‌ సెక్టార్‌ ఛెర్మన్‌గా ఏలూరు సురేందర్‌రెడ్డి, డిస్ట్రిబూటర్స్‌ సెక్టార్‌ ఛెర్మన్‌గా ఎన్‌.వెంకట్‌ అభిషేక్‌, స్టూడియో సెక్టార్‌ ఛెర్మన్‌గా వై. సుప్రియ, ఎగ్జిబిటర్స్‌ సెక్టార్‌ ఛెర్మన్‌గా టి.ఎస్‌. రామ్‌ప్రసాద్‌ ఎంపికయ్యారు. ప్రొడ్యూసర్స్‌ సెక్టార్‌ నుంచి కార్యవర్గ సభ్యులుగా వైవీఎస్‌ చౌదరి, తుమ్మల ప్రసన్నకుమార్‌, మోహన్‌ వడ్లపట్ల, టి.రామసత్యనారాయణ, పల్లి కేశవరావు, రాధారాజేశ్వరి లక్కరాజు, సాయి వెంకట్‌, మద్దినేని రమేశ్‌బాబు, ఏవీవీ ప్రసాదరావు (అళహరి), చిట్టి నాగేశ్వరరావు (సి.ఎన్‌.రావు), వి.రామకృష్ణ, తోట కృష్ణ, వి. రమేశ్‌బాబు, బెక్కెం వేణుగోపాల్‌, కె.సురేశ్‌బాబు, శివలెంక కృష్ణప్రసాద్‌, మురళి బోడపాటి ఎన్నికయ్యారు.