వరుసగా స్టార్ డైరెక్టర్స్‌ను దించుతున్నాడు!

తారక్ కెరీర్ పీక్స్‌లో ఉంది.కెరీర్ గ్రాఫ్ పడిపోకుండా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు ఎన్టీఆర్. ఎందుకంటే, గతంలో రాజమౌళితో ‘సింహాద్రి’, ‘యమదొంగ’ లాంటి సినిమాలు చేసిన తర్వాత ఒక్కసారిగా అతని కెరీర్ డైలమాలో పడిపోయింది. వరస ఫ్లాపులు బాగా ఇబ్బంది పెట్టాయి. అందుకే ఇప్పుడు RRR త‌ర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్‌, అట్లీ, ప్ర‌శాంత్ నీల్ లాంటి సంచ‌ల‌న ద‌ర్శ‌కుల‌తో ప‌ని చేయ‌డానికి ఎన్టీఆర్ సిద్ధ‌మ‌వుతున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి RRR సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాతోనే మ‌రో ఆర్నెళ్ల పాటు బిజీగా ఉంటాడు . 2021, జనవరి 8న ఈ చిత్రం విడుదల కానుందని చెప్పినా లాక్‌డౌన్ వల్ల మళ్ళీ వాయిదా పడింది. ఇదిలా ఉంటే రాజమౌళి తర్వాత వరసగా స్టార్ డైరెక్టర్స్‌ను రంగంలోకి దించుతున్నాడు ఎన్టీఆర్.
 
ఎన్టీఆర్ రాబోయే మూడు సినిమాలు అగ్ర ద‌ర్శ‌కుల‌తోనే ఉండ‌బోతున్నాయి. RRR త‌ర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా చేయ‌బోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై ప్రకటన కూడా వచ్చింది. ఇదే ఏడాది సినిమా పట్టాలెక్కనుంది. హారిక హాసిని, నందమూరి తారకరామారావు ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. దాంతో పాటు కెజియఫ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా ఉండబోతుంది. మరోవైపు తమిళ దర్శకుడు అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌బోతున్నాడు ఎన్టీఆర్. ఈ విషయాన్ని అట్లీ కుమార్ కూడా కన్ఫర్మ్ చేసాడు. త్వరలోనే తెలుగు సినిమా చేయబోతున్నానని.. అది కూడా తనకిష్టమైన ఎన్టీఆర్‌తో అని ఈ మధ్యే చెప్పాడు అట్లీ. ఇప్ప‌టికే త‌మిళ‌నాట వ‌ర‌స విజ‌యాల‌తో సంచ‌ల‌నాలు సృష్టిస్తున్నాడు ఈ యువ ద‌ర్శ‌కుడు. మొన్న ‘బిగిల్’ సినిమాతో ఏకంగా 300 కోట్లు వసూలు చేసాడు .అన్నీ కుదిర్తే అశ్వినీ దత్ బ్యానర్‌లోనే ఈ చిత్రం ఉండబోతుంది. ఇప్పటికే దీనిపై నిర్మాత అశ్వినీ దత్ కూడా క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమాలు కానీ వర్కవుట్ అయితే ఎన్టీఆర్ రేంజ్ మరింత పెరిగిపోవడం ఖాయం.
 
ఏడాది పాటు బ‌ల్క్‌గా కాల్షీట్స్
కేజీఎఫ్ ద‌ర్శకుడితో ఎన్టీఆర్ సినిమా ఉంటుంద‌ని కొద్ది రోజులుగా జోరుగా ప్ర‌చారం జ‌రుగుతుండ‌గా, తాజాగా దీనిపై క్లారిటీ వ‌చ్చింది.ఎన్టీఆర్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా కేజీఎఫ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ట్విట్ట‌ర్ ద్వారా శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ… “అణు కర్మాగారం పక్కన కూర్చుంటే ఆ ఫీల్‌ ఎలా ఉంటుందో ఫైనల్‌గా నాకు తెలిసింది. నీ చుట్టూ ఉండే క్రేజీ ఎనర్జీకి నెక్ట్స్‌ టైమ్‌ నా రేడియేషన్‌ సూట్‌ని‌ తీసుకువస్తాను. ‘హ్యాపీ బర్త్‌డే బ్రదర్‌’. త్వ‌ర‌లోనే మిమ్మ‌ల్ని క‌లుస్తాం“అంటూ ట్వీట్ చేశారు. దీంతో ఎన్టీఆర్ సినిమా ప్ర‌శాంత్ నీల్‌తో క‌న్‌ఫాం అని ఫిక్స్ అయిన‌ట్టే అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ఎన్టీఆర్- ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్క‌నున్న చిత్రం పాన్ ఇండియా సినిమాగా రూపొంద‌నుంది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఏడాది పాటు బ‌ల్క్‌గా కాల్షీట్స్ కేటాయించాడ‌ని అంటున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రశాంత్ ఏకంగా 17కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట.. ఇప్పటికే రెండు కోట్లు నిర్మాతలు అడ్వాన్స్ గా ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ చిత్రం ‘పాన్ ఇండియా’ మూవీగా భారీ ఎత్తున తెరకెక్కనుందని సమాచారం. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.