ఆమె సిబ్బందితో కూడా నిర్మాతకు ఇబ్బంది !

పూజా హెగ్డే రెమ్యునరేషన్‌ విషయంలో చుక్కలు చూపిస్తోంది. ఆమె సినిమాకు రెండుకోట్లకు పైగా డిమాండ్ చేస్తోంది. ఇప్పుడు తన సిబ్బందితో కూడా నిర్మాతలను ఇబ్బంది పెడుతోందట. షూటింగ్‌ సమయంలో పూజా వెంట నలుగురైదుగురు అసిస్టెంట్ లు ఉండేవారు. ఇప్పుడు ‘అల వైకుంఠపురములో’ సినిమా బ్లాక్‌బస్టర్‌ కావడంతో తన వ్యక్తిగత సిబ్బందిని ఆరుకి పెంచిందట. వీరి ఖర్చులన్నీ నిర్మాతే భరించాలి. పూజాను మెయిన్‌టెనెన్స్‌ చేసేందుకే నిర్మాతలు కిందా మీదా పడుతున్నారు. అలాంటిది ఏకంగా ఆరుగురిని భరించడం ద్వారా మరీ భారం పడుతోంది అంటున్నారు సినీ జనాలు.
ఇంతకీ ఆరుగురు సిబ్బంది అవసరమా ? అంటే.. ఆ విషయం పూజ కే తెలియాలి .ఎంతైనా స్టార్‌ హీరోయిన్‌ కదా…ఆ మాత్రం మెయిన్‌టెయిన్‌ చేయకపోతే బాగుండదని అనుకుంటుందేమో.. కానీ.. ఆమె పెట్టే కండీషన్స్‌ తో నిర్మాతలకు తిప్పలు తప్పడం లేదు .
నాగ చైతన్య ‘ఒక లైలా కోసం’ ద్వారా టాలీవుడ్‌లో అడుగు పెట్టిన పూజా తర్వాత బాలీవుడ్‌ స్టార్‌ హృతీక్‌ రోషన్ తో చారిత్రాత్మక చిత్రం ‘మొహంజదారో’లో నటించారు. ఆ సినిమా కోసం దాదాపు రెండేళ్లపాటు బాలీవుడ్‌కే అంకితమైపోయారు. అయితే బాలీవుడ్‌లో పూజాకు అంతగా గుర్తింపు రాకపోవడంతో మళ్లీ టాలీవుడ్‌కు వచ్చేశారు. ఆ తర్వాత తెలుగులో అల్లు అర్జున్ సరసన ‘డీజే’, ఎన్టీఆర్‌తో ‘అరవింద సమేత’, మహేష్‌ బాబుతో ‘మహర్షి’లో నటించి మంచి స్థానాన్ని సంపాందించుకున్నారు. ఇటీవల ఆమె బన్నీతో ‘అల వైకుంఠపురములో’ చేసి మరో బ్లాక్ బస్టర్ హిట్‌ అందుకుంది . వరుస హిట్లతో జోరుమీదున్న ఈ బ్యూటీ తాజాగా బాలీవుడ్‌ టాప్ హీరో సల్మాన్‌ ఖాన్‌ సరసన నటించే బంపర్‌ ఆఫర్‌ను కొట్టేసింది .
సాహసాలు చేయడం చాలా అవసరం!
“మనిషి సుఖంగా జీవించడంలోనే ఆనందం ఉందనుకుంటాడు. అందుకోసం.. ఒకే రకమైన లైఫ్‌కు అలవాటు పడిపోతుంటాడు. అలా బతకడంలో తప్పు లేదు.. కానీ మనకంటూ ఓ గుర్తింపు రావాలంటే.. పదిమంది కంటే భిన్నంగా ఆలోచించాలి’ అని అంటోంది వరుస హిట్‌లతో టాప్ హీరోయిన్‌ మారిన పూజా హెగ్డే. పూజా తాజాగా ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ..”సవాలుతో కూడుకునే నిర్ణయాలు తీసుకునేందుకు నేను ఎప్పుడూ ముందుంటాను. జీవితంలో సాహసాలు చేయడం చాలా అవసరం. అవే మనల్ని అందరిలో ప్రత్యేకంగా నిలబెడతాయి.. అని చెప్పుకొచ్చింది. కొత్తగా ప్రయత్నాలు చేసేటప్పుడు ఆ ప్రయాణంలో మనకు ఎన్నో ఎదురుదెబ్బలు తగలొచ్చు. వాటిని తట్టుకుని నిలబడినప్పుడే ఇతరులు మనల్ని గుర్తించే స్థాయికి ఎదుగుతామని పూజా చెప్పింది .
‘సినిమాలు నాకేందుకులే’ అని అనుకుని ఉంటే మిగతా అమ్మాయిల్లానే తాను చదువు, ఉద్యోగం అంటూ మిగిలిపోయేదాన్నని… కాని ”ఓసారి ట్రై చేసి చూద్దాం’ అని గట్టిగా అనుకున్నానని చెప్పింది . అయితే.. ఈ ప్రయాణంలో మొదట కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. కానీ చివరికి మాత్రం నా గమ్యాన్ని చేరుకున్నానంది. ప్రస్తుతం ఈ బ్యూటీ అఖిల్‌తో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’లో నటిస్తుంది. ప్రభాస్‌ సరసన ఓ సినిమా చేస్తోంది.