దేన్నైనా ఎదుర్కొనే బలాన్ని నాలో నింపుతున్నారు!

“ఇంట్లోనే ఉండి నేనింత హ్యాపీగా, కామ్‌గా, ప్రశాంతంగా ఉంటానని ఎప్పుడూ అనుకోలేదు. మా వాళ్ళు  భవిష్యత్తులో దేన్నైనా ఎదుర్కొనే బలాన్ని నాలో నింపుతున్నారు”…అని తన లాక్‌డౌన్ అనుభవాలను చెబుతోంది రష్మిక మందన్న. కరోనా వైరస్‌ కారణంగా ఉరుకుల పరుగుల జీవితానికి బ్రేక్‌ పడింది. అందరూ ఇంట్లోనే ఉండి కుటుంబంతో సమయం గడుపుతున్నారు. లాక్‌డౌన్‌లో ఇంట్లోనే ఉండటం గురించి రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్‌ లో ఈ విధంగా రాసుకుంది….

‘‘నా 18 ఏళ్ల వయసు నుంచి నా జీవితం రేస్‌లా పరిగెడుతూనే ఉంది. విరామం అనేది లేకుండా. కానీ ఇలాంటి లాక్‌డౌన్‌ ఎప్పుడూ దొరకలేదు. ఏదైనా పనిలో గమ్యానికి చేరుకున్నాం అని అనుకునేలోగా మరో కొత్త రేస్‌ మొదలయ్యేది.ఇలా ఒకటి పూర్తవ్వగానే మరోటి. అది పూర్తవ్వగానే మరో రేస్‌లో పరిగెడుతున్నాను. బాధతో ఇలా చెప్పడంలేదు. ఎందుకంటే నా లైఫ్‌ ఇలానే ఉండాలని కోరుకున్నాను కూడా. ఇన్ని రోజులు ఇంట్లో ఉండటం నాకిదే మొదటిసారి. స్కూల్‌ నుంచి కాలేజీ వరకూ ఇంటికి దూరంగా హాస్టల్‌లోనే ఉన్నాను.
మా అమ్మానాన్నలు ఎందుకు నాతో అంత స్ట్రిక్ట్‌గా ఉంటున్నారనుకునేదాన్ని. అసలే టీనేజ్‌.. అందులో నేను కొంచెం రెబల్‌గా ఉండేదాన్ని. దాంతో అలా అనుకున్నానేమో? కానీ ఇప్పుడు వాళ్ల మీద నాకలాంటి ఫీలింగ్‌ లేదు.సినిమా షూటింగ్స్‌ కోసం రాత్రంతా మా అమ్మగారు నాతోనే ఉంటున్నారు. ఫ్యామిలీతో మంచి సమయాన్ని గడపడానికి నాన్న తపన పడుతుంటారు .ఈ లాక్‌డౌన్‌ వల్ల నా కుటుంబంతో కొన్ని నెలలు గడిపే అవకాశం వచ్చింది. ఈ సమయంలో ఎవ్వరం మా పనుల గురించి మాట్లాడుకోలేదు. నన్ను చాలా గారాభంగా చూసుకుంటున్నారు. భవిష్యత్తులో దేన్నైనా ఎదుర్కొనే బలాన్ని నాలో నింపుతున్నారు. ఇంట్లోనే ఉండి నేనింత హ్యాపీగా, కామ్‌గా, ప్రశాంతంగా ఉంటానని ఎప్పుడూ అనుకోలేదు. కష్టపడి పని చేసి అలసిపోయి ఇంట్లో అడుగుపెట్టిన వెంటనే ప్రశాంతంగా అనిపించిందంటే.. మీరు అదృష్టవంతులే ! నన్ను నమ్మండి’’ అన్నారు రష్మికా మందన్నా.
రామ్‌చరణ్‌కు జోడీగా రష్మిక !

రష్మిక మందన్న పట్టిందల్లా బంగారం అవుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్నఈమె గొప్ప అవకాశాల్ని అందుకుంటోంది. అగ్ర హీరోలతో జోడీకడుతూ చలాకీ నటనతో ఆకట్టుకుంటోంది. తాజాగా రష్మిక రామ్‌చరణ్‌ సరసన నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఆచార్య’. సందేశాత్మక కథాంశానికి వాణిజ్య హంగులను జోడిస్తూ తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ అతిథి పాత్రలో కనిపించబోతున్నారు. ఎక్కువ నిడివితో కూడిన ఈ అతిథి పాత్రలో రామ్‌చరణ్‌కు జోడీగా రష్మిక నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దర్శకుడు తన పాత్ర తీర్చిదిద్దిన తీరు నచ్చడంతో ఆమె ఈసినిమాలో నటించడానికి ఓకే చేసినట్లు చెబుతున్నారు. వచ్చే నెలలో ఈసినిమా చిత్రీకరణ పునఃప్రారంభంకాబోతోంది. ప్రస్తుతం అల్లు అర్జున్‌-సుకుమార్‌ ‘పుష్ప’ సినిమాలో రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది.