వేగేశ్న సతీష్ ‘కోతి కొమ్మచ్చి’ షూటింగ్ పూర్తి !

అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు ‘కోతి కొమ్మచి’ టీం. కరోన సమయంలో ఒక సినిమా షూటింగ్ మొదలు పెట్టి.. కేవలం నెల రోజుల్లోనే అవుట్ డోర్ లో షూటింగ్ పూర్తి చేయడం చాలా కష్టం. నవంబర్ 3న మొదలైన కోతికొమ్మచ్చి షూటింగ్ డిసెంబర్ మొదటి వారంతో ఒక్క పాట మినహా టోటల్ షూట్ పూర్తయింది. వేగేశ్న సతీష్ దర్శకత్వంలో మేఘాంశ్ శ్రీహరి, సమీర్ వేగేశ్న లు హీరోలుగా తెరకెక్కుతున్న యూత్ ఫుల్ ఎంటర్టైనర్  ‘కోతి కొమ్మచ్చి. లక్ష్య ప్రొడక్షన్స్ సంస్థపై ఎం.ఎల్.వి.సత్యనారాయణ నిర్మిస్తున్నారు.
“లాక్ డౌన్ ముగిసి షూటింగ్స్ కి పర్మిషన్ ఇచ్చిన వెంటనే ‘కోతి కొమ్మచ్చి’ షూటింగ్ మొదలుపెట్టాము. సినిమా మొత్తం అవుట్ డోర్ కావడంతో కరోనా ఎఫెక్ట్ వల్ల కొంత భయం ఉన్నప్పటికీ ధైర్యం చేసి అన్ని జాగ్రత్తలు తీసుకొని ఎట్టకేలకు ఒక పాట మినహా టోటల్ షూటింగ్ పూర్తి చేశాం… అన్నారు చిత్ర దర్శకుడు వేగేశ్న సతీష్. అమలాపురం , విశాఖపట్నం , రాజమండ్రి లో ఎలాంటి బ్రేక్ లేకుండా నిర్విరామంగా షూటింగ్ జరిపాము. ఈ సందర్భంగా షూటింగ్ దిగ్విజయంగా పూర్తవ్వడానికి కారణమైన యూనిట్ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను” అన్నారు.
“మా సినిమా షూటింగ్ ను ఎలాంటి ఆటంకం లేకుండా మా దర్శకుడు సతీష్ గారు పర్ఫెక్ట్ ప్లానింగ్ తో పూర్తి చేసారు. మాకు సహకరించి సినిమా కోసం కష్టపడిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతుంది”… అన్నారు నిర్మాత ఎం.ఎల్.వి.సత్యనారాయణ.