ఆ లోపాలకు అధైర్యపడటం.. చింతించటం అనవసరం!

శ్రుతీహాసన్‌ మంచి నటి మాత్రమే కాదు మంచి మ్యూజిక్ కంపోజర్‌ కూడా. చిన్నప్పుడే తండ్రి కమల్‌ హాసన్‌ సినిమాల్లో (దేవర్‌ మగన్, హే రామ్‌) పాటలు పాడటమే కాదు ఓ సినిమాకు (ఈనాడు) సంగీతం అందించింది కూడా. యాక్టింగ్‌కి కొంచెం బ్రేక్‌ ఇచ్చి మ్యూజిక్‌ మీద దృష్టి పెట్టాలని ఆ మధ్య లండన్‌ వెళ్ళింది . అక్కడ కొన్ని షోస్‌ నిర్వహించింది. లాక్‌డౌన్‌లో కూడా చాలా సమయాన్ని మ్యూజిక్‌కే కేటాయించింది. తన మ్యూజిక‌ల్ టాలెంట్‌ని ప‌రిచ‌యం చేస్తాన‌ని చెప్పిన శ్రుతీ తాజాగా ‘ఎడ్జ్’ అనే మ్యూజిక్ ఆల్భ‌మ్ క్రియేట్ చేసి రిలీజ్ చేసింది. అందులో ‘టేక్ మి టేక్ మి టు ఎడ్జ్..’ అనే సాంగ్‌ను శృతి పాడ‌డ‌మే కాక రాయ‌డం, కంపోజ్ చేయడం, న‌టించ‌డం చేసింది.
 
శృతి హాస‌న్ ‘ఎడ్జ్’ రిలీజ్ చేస్తూ.. ‘ప్ర‌తి ఒక్క‌రిలో అసంపూర్ణ‌మైన ప్రేమ‌ను తెలియ‌జేప్పే ప్ర‌య‌త్న‌మే ఇది’ అని తెలిపింది. ఈ పాట ప్రధానాంశం ‘మనల్ని మనం అంగీకరించగలగడం’ అని అంటోంది శ్రుతి. ‘‘మనం ఎవ్వరం పర్ఫెక్ట్‌ కాదు. అందరిలోనూ ఏదో ఒక లోపం ఉంటుంది. ఆ లోపాలకు అధైర్యపడటం, చింతించటం అనవసరం. ఎలా ఉన్నా మనల్ని మనం స్వీకరించటం నేర్చుకోవాలి. మనలోని అసంపూర్ణాన్ని అర్థం చేసుకోవాలి. ప్రేమించాలి. ఎదుటివారితో పోల్చుకోవడం ఆపేయాలి. వారిలోని లోపాలను ఎత్తిచూపడం మానుకోవాలి’’ అని ఈ పాటలో చెబుతున్నాం అని చెప్పింది శృతి.
 
కొన్నాళ్ళ గ్యాప్ త‌ర్వాత తిరిగి సినిమాల‌లో న‌టిస్తున్న శృతి ప్ర‌స్తుతం తెలుగులో రవితేజ తో ‘క్రాక్’ తో పాటు పవన్ కళ్యాణ్ ‘వ‌కీల్ సాబ్’ లోను చేస్తోంది.. త‌మిళంతో పాటు హిందీలో కూడా న‌టిస్తోంది.. ‘దేవి’ అనే మహిళా ప్రధాన ఇతివృత్తంతో రూపొందిన లఘు చిత్రంలోను శృతి హాస‌న్ న‌టించింది.
 
యూ ట్యూబ్ ఛానెల్ ప్రారంభం!
శృతిహాస‌న్ మ‌రో అడుగు ముందుకేసి త‌న మ్యూజిక్ ప్రోగ్రామ్‌ల‌కు సంబంధించిన వివ‌రాల‌ను తెలియ‌జేసేలా ఓ ‘యూ ట్యూబ్ ఛానెల్‌’ను ప్రారంభించ‌బోతోంది.శృతిహాస‌న్ సోష‌ల్ మీడియాలో ఎప్ప‌టిక‌పుడు త‌నకు సంబంధించిన అప్ డేట్స్ ఇస్తుంటుంది. యూట్యూబ్ ఛాన‌ల్ లో ఒరిజిన‌ల్ ట్రాక్స్ ను అభిమానులతో పంచుకుంటుంది. యూకే లో ప‌లు ప్ర‌ద‌ర్శ‌న‌లు, షోల‌తో త‌న టాలెంట్ చూపించిన శృతి ఇటీవల ‘ఎడ్జ్’ అనే డెబ్యూ ఆల్బ‌మ్ తో ప‌లుక‌రించింది. ఈ ఆల్బ‌మ్ ఒరిజిన‌ల్ కంటెంట్ తో పాటు, నా ప్ర‌ద‌ర్శ‌న‌లు, టూర్ లోని బీటీఎస్ పుటేజీ, వీడియోలతో సాగుతుందని శృతిహాస‌న్ చెప్పుకొచ్చింది.