శ్రీరంగం సతీశ్‌ కుమార్‌ దర్శక నిర్మాణంలో ‘4 ఇడియట్స్‌’

కార్తి, సందీప్‌, చలం, సన్ని హీరోలుగా ప్రియ అగస్టిల్‌, చైత్ర, రుచిర, శశి హీరోయిన్లుగా నాగార్జున సినీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై శ్రీరంగం సతీశ్‌ కుమార్‌ స్వీయ దర్శక నిర్మాణంలో కొత్త చిత్రం ‘4 ఇడియట్స్‌’ మంగళవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి తెలంగాణ ఫిలిం ఛాంబర్‌ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణా గౌడ్‌ క్లాప్‌ ఇవ్వగా.. నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. సాయి వెంకట్‌ గౌరవ దర్శకత్వం వహించారు.

ప్రతాని రామకృష్ణా గౌడ్‌ మాట్లాడుతూ – ”ఇరవై యేళ్లకు పైగా సినీ పరిశ్రమలో ఉన్న శ్రీరంగం సతీశ్‌కుమార్‌ 14 సినిమాలు చేశారు. చిన్న సినిమాలను ఎలా తీయ్యాలో.. ఎలా విడుదల చేయాలో అవగాహన ఉన్న దర్శక నిర్మాత ఆయన. మంచి కథతో ‘4 ఇడియట్స్‌’ సినిమా చేస్తున్నారు. ఆయనకు మా వంతు సహకారాన్ని అందిస్తాం” అన్నారు.

దర్శక నిర్మాత శ్రీరంగం సతీశ్‌ కుమార్‌ మాట్లాడుతూ – ”లవ్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌, యాక్షన్‌ డ్రామాతో పాటు చిన్న సందేశాన్ని అందిస్తూ ఈ సినిమాను రూపొందిస్తున్నాం. హీరో హీరోయిన్లుగా కొత్తవాళ్లకు అవకాశం కల్పించాం. అలాగే జబర్‌దస్త్‌ గ్యాంగ్‌లోని ప్రముఖ నటులు ఇందులో నటిస్తున్నారు. నేటి నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ను స్టార్ట్‌ చేసి జూన్‌ వరకు జరిపే షెడ్యూల్స్‌తో సినిమా చిత్రీకరణను పూర్తి చేస్తాం. డబ్బుకు ప్రాధాన్యతనిచ్చిన నలుగురు కుర్రాళ్ల కథే ఇది. వారికి ఎలా జ్ఞానోదయం కలిగింది? వారి ప్రేయసిలను ఎలా కలుసుకున్నారనేదే కథ” అన్నారు.

కార్యక్రమంలో పాల్గొన్న నటీనటులు దర్శక నిర్మాత శ్రీరంగం సతీశ్‌కుమార్‌కు థాంక్స్‌ చెప్పారు.

రైజింగ్‌ రాజు, గణపతి, బుల్లెట్‌ భాస్కర్‌, రాము, దుర్గారావు, రాఘవ, కీర్తన, పరిమళ, మాస్టర్‌ శ్రీకాంత్‌, ఎం.బాబు తదితరులు ఇతర తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: నగేశ్‌ యర్రవరపు, సంగీతం: జయసూర్య, పాటలు: శ్రీనివాస్‌, ఆర్ట్‌: విజయ్‌కృష్ణ, ఫైట్స్‌:మహి, కొరియోగ్రఫీ: వినోద్‌కుమార్‌, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, నిర్మాణం, దర్శకత్వం: శ్రీరంగం సతీశ్‌కుమార్‌.