‘టెన్నెస్సీ తెలుగు సమితి’ ఉగాది సంబరాలు

అమెరికాలోని టెన్నెస్సీలో తెలుగు సమితి ఉగాది సంబరాలు జరిగాయి. నాష్విల్‌లోని ఫాదర్ ర్యాన్ ఆడిటోరియంలో ఏప్రిల్ 7న ఈ కార్యక్రమం జరిగింది. ‘టెన్నెస్సీ తెలుగు సమితి’ అధ్యక్షులు దీప్తి రెడ్డి దొడ్ల నాయకత్వంలో నిర్వహించిన ఈ సంబరాలకు డాక్టర్ దీపక్ రెడ్డి, జితేందర్ కట్కూరి, శారద కట్కూరి సమర్పకులుగా వ్యవహరించారు. స్థానిక తెలుగు వారు సుమారు 600 మందికి పైగా ఈ సంబరాలలో పాల్గొనడం విశేషం.

టెన్నెస్సీలోని నాష్విల్ సంగీత నగరంగా పేరొందడం అందరికీ తెలిసిందే. సంగీత నగరంలో ప్రముఖ తెలుగు సినీ కోయిల సునీత రాగం అందుకోవడం అందరినీ ఆకట్టుకుంది. సునీతతోపాటు మాటీవీ సూపర్ సింగర్ ఫేమ్ గాయకులు దినకర్ కూడా ఈ సంగీత విభావరిలో పాల్గొన్నారు. ముందుగా టెన్నెస్సీ తెలుగు సమితి అధ్యక్షులు దీప్తి రెడ్డి దొడ్ల స్వాగతోపన్యాసం చేస్తూ అందరికీ శ్రీ విళంబి నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. పంచాంగ శ్రవణంతో కార్యక్రమం మొదలవగా, స్థానిక సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా చేసిన భరతనాట్యం, సినీ నృత్యాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి.

తదనంతరం గాయనీ గాయకులు సునీత, దినకర్‌లను వేదిక మీదకు ఆహ్వానించగా ప్రేక్షకులు “బహుపరాక్ బహుపరాక్..” అంటూ స్వాగతం పలికారు. మైకు అందుకున్న వెంటనే తమను ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన టెన్నెస్సీ తెలుగు సమితి కార్యవర్గానికి కృతజ్ఞతలు తెలియజేసి, క్లాసిక్ పాటలతో మొదలుపెట్టి జానపద, సాంఘిక, ఫాస్ట్ బీట్ పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ప్రేక్షకుల అరుపులు, చప్పట్లతో వేదిక ప్రాంగణం మార్మోగిపోయింది. అనంతరం స్పాన్సర్స్‌తోపాటు, సునీత, దినకర్‌లను పుష్ప గుచ్ఛం, శాలువా మరియు జ్ఞాపికలతో టెన్నెస్సీ తెలుగు సమితి కార్యవర్గం ఘనంగా సన్మానించింది. మధ్య మధ్యలో రాఫుల్ డ్రాల్లో విజేతలకు ఉప్పాడ పట్టుచీరలు, ముత్యాల నగలు వంటి విలువైన బహుమతులను గాయని సునీత చేతులమీదుగా అందజేశారు.
టెన్నెస్సీ తెలుగు సమితి అధ్యక్షులు దీప్తి రెడ్డి దొడ్ల మాట్లాడుతూ.. ఈ ఉగాది సంబరాలకు వెన్నంటి ఉండి తమ పూర్తి సహకారం అందించిన కార్యదర్శి కిరణ్ కామతం, సాంస్కృతిక కార్యదర్శి ప్రశాంతి చిగురుపాటి, ఫుడ్ కమిటీ లీడ్ నిషిత కాకాని, రిజిస్ట్రేషన్ కమిటీ లీడ్ రజని కాకి తదితర అడ్వైజరీ కమిటీ, యూత్ కమిటి సభ్యులు, అలాగే విజయవంతంచేసిన ప్రేక్షకులు, స్పాన్సర్స్, తమ పాటలతో అందరిని ఆహ్లాదపరచిన సునీత, దినకర్, ఆడియో & లైటింగ్ అందించిన డి.జె. శ్రీనివాస్ దుర్గం, ఫోటోగ్రఫీ సేవలందించిన సందీప్ జానర్, వేదికనందించిన ఫాదర్ ర్యాన్ ఆడిటోరియం యాజమాన్యం, వేదికను చక్కగా అలంకరించిన డాజిల్ ఈవెంట్స్, రుచికరమైన విందు భోజనాలను అందించిన పారడైజ్ బిర్యానీ… ఇలా ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసి ఉగాది సంబరాలను ముగించారు.