మీరిద్దరూ ఒకే రోజు పుట్టారు.. నాకు బ్లాక్‌బస్టర్స్ ఇచ్చారు !

విజయ్ దేవరకొండ… “నాకోసం ఈ ఇద్దరినీ ఇచ్చావంటూ క్రిస్మస్‌కి కృతజ్ఞతలు” తెలుపుతూ ట్వీట్ చేశాడు విజయ్ దేవరకొండ. వెండితెరపై అడుగుపెట్టిన అనతికాలంలోనే స్టార్ హీరో క్రేజ్ సంపాదించాడు విజయ్ దేవరకొండ. ‘పెళ్లి చూపులు’తో ఆకట్టుకున్న విజయ్.. ఆ తర్వాత ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో మంచి పాపులారిటీ తెచ్చుకున్నాడు. ఇక ‘‘గీత గోవిందం, టాక్సీవాలా’’ చిత్రాలు ఆయనకు భారీ క్రేజ్ తెచ్చిపెట్టాయి. దీంతో క్లాస్, మాస్ ఆడియన్స్ అంతా ఆయనకు ఫ్యాన్స్ అయిపోయారు. ముఖ్యంగా యూత్ అమ్మాయిలను తన నటనతో బాగా ఆకర్షించాడు విజయ్.
అయితే విజయ్ కి ఇంతటి క్రేజ్ రావటంలో ‘‘అర్జున్ రెడ్డి, గీత గోవిందం’’ సినిమాలే కీలకంగా చెప్పుకోవచ్చు. ‘అర్జున్ రెడ్డి’లో విజయ్ క్యారెక్టర్‌తో పోల్చితే ‘గీత గోవిందం’లో విజయ్ క్యారెక్టర్ పూర్తి విరుద్ధం. కానీ ఈ రెండు షేడ్స్‌లో విజయ్ తనదైన ముద్ర వేస్తూ సక్సెస్ అయ్యాడు. అయితే ఈ రెండు సినిమాల దర్శకుల విషయంలో మాత్రం యాదృచ్చికమే అయినా…తమాషా అయిన ఓ కామన్ పాయింట్ ఉంది. ‘అర్జున్ రెడ్డి’ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, ‘గీత గోవిందం’ డైరెక్టర్ పరశురామ్ ఒకే రోజు జన్మించారు. డిసెంబర్ 25 క్రిస్మస్ రోజే ఆ ఇద్దరి పుట్టిన రోజు కావటం విశేషం. దీంతో “తనకోసం ఈ ఇద్దరినీ ఇచ్చావంటూ క్రిస్మస్‌కి కృతజ్ఞతలు” తెలుపుతూ ట్వీట్ చేశాడు విజయ్ దేవరకొండ. ‘‘మీరిద్దరూ ఒకే రోజు పుట్టారు. నాకు బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్స్ ఇచ్చారు. ఇద్దరికీ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు’’ అని పేర్కొంటూ సందీప్, పరశురామ్‌లతో తన సరదా క్షణాల ఫోటోలు షేర్ చేశాడు విజయ్.