బోయ జంగయ్య ‘అడ్డ దారులు’ నవల ఆధారంగా ‘వీకెండ్ పార్టీ’ 

వీకెండ్ పార్టీ ( A Small Journey) నవలను అమరుడు డాక్టర్ బోయ జంగయ్య రచించారు. బోయ జంగయ్య కుమారుడు బోయ చేతన్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. అమరేందర్ దర్శకత్వం వహిస్తున్నారు. నాగార్జున సాగర్ ఏరియాలో జరిగిన నిజ ఘటనల ఆధారంగా వీకెండ్ పార్టీ  రాబోతోంది.  ఈ చిత్రంలో ప్రధాన పాత్రగా బాహుబలి ప్రభాకర్, అక్షిత్ అంగీరస, రమ్య రాజ్, రమ్య నాని, సిరి, ప్రియా, గుంటూరు విజయ్, గీతా సింగ్, డిడి శ్రీనివాస్, కిట్టయ్య, హరిశ్చంద్ర, శరత్ కుమార్, నిట్టల, జయ నాయుడు, రమణి సిద్ధి, శ్రీమణి, లలితా రాజు, ప్రధాన పాత్రలో నటించారు. వెంకట్ వేముల ఎడిటర్‌గా, రాము అద్దంకి కెమెరామెన్‌గా, సదా చంద్ర సంగీత సారథ్యంలో తెరకెక్కించిన ఈ మూవీ ఆడియో ఆవిష్కరణ  కార్యక్రమానికి సుచిత్ర చంద్రబోస్, చంద్రబోస్, కాసర్లశ్యాం, ప్రముఖ జర్నలిస్ట్‌లు వినాయక రావు, ప్రభు, ‘సంతోషం’ సురేష్ కొండేటి  ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
చంద్రబోస్ మాట్లాడుతూ… ‘నా స్పూర్తితో వచ్చిన సదా చంద్ర పాటలు రాయడానికి వచ్చి సంగీతం కూడా అందించేశారు. కాసర్ల శ్యాం నాకు సోదరుడి వంటివాడు. అమర్‌, చేతన్ ఇలా అందరూ నాకు ఆప్తులే. పల్లెటూరి గురించి రాసిన పాట ప్రేక్షకులందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. నా శ్రీమతి సుచిత్ర ఈ పాటలకు కొరియోగ్రఫీ చేశారు. సినిమా అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను’ అని అన్నారు.
సుచిత్రా చంద్రబోస్ మాట్లాడుతూ.. ‘ఎస్వీ కృష్ణారెడ్డి గారి సినిమాతో 1992లో నృత్య దర్శకురాలిగా ప్రయాణం మొదలుపెట్టాను. ఇప్పుడు మళ్లీ నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. చంద్రబోస్ గారు రాసిన పాటను వదలుకోకూడదని ఈ సినిమాను ఒప్పుకున్నాను. ఎంతో గొప్ప సాహిత్యాన్ని అందించారు. ఈ చిత్రం గొప్ప విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను. మళ్లీ ఇది నా మొదటి చిత్రంగా భావిస్తున్నాను’ అని అన్నారు.
కాసర్ల శ్యాం మాట్లాడుతూ.. ‘చంద్రబోస్ గారు ఇండస్ట్రీలోకి రావడంతోనే వరంగల్ నుంచి ఎంతో మంది వచ్చారు. చంద్రబోస్‌ అన్నలా పాటలు రాయడం ఎంత కష్టమో తరువాత తెలిసింది. సిరివెన్నెల స్థానాన్ని భర్తీ చేసే సత్తా మా బోస్ అన్నకే ఉంది. మా దర్శకుడు అమర్ నా రూమ్ మేట్. ఆయన దర్శకత్వంలో పాటను రాయడం ఆనందంగా ఉంది. బోయ జంగయ్య కుమారుడు చేతన్ ఇండస్ట్రీలోకి రావడం ఆనందంగా ఉంది. సదాచంద్రకు సంగీత దర్శకుడిగా ఇంకా మంచి పేరు రావాలి. మా వదిన సుచిత్ర చంద్రబోస్ గారు నా పాటకు కొరియోగ్రఫీ చేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
సంగీత దర్శకుడు సదా చంద్ర మాట్లాడుతూ.. ‘సుచిత్రా చంద్రబోస్ గారి క్షేత్రంలో విత్తనంగా పడ్డాను. నన్ను నీడగా పెంచి పోషించిన నా గురువు సుచిత్రా చంద్రబోస్ గారికి థాంక్స్. నాకు అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. వీరి కాంబోలో నాకు చాన్స్ వస్తుందని అనుకోలేదు. నిర్మాత చేతన్ గారు బోయ జంగయ్య కుమారుడు అని అనిపించుకున్నారు. అ సినిమా పాటలు వినండి, అందరూ ఆదరించండి. సినిమాను విజయవంతం చేయండి’ అని కోరారు.
దర్శకుడు అమరేందర్ మాట్లాడుతూ.. ‘కాసర్ల శ్యాంది, నాది పదిహేనేళ్ల అనుబంధం. ఓయూ క్యాంపస్‌లో కలిసి ఉండేవాళ్లం. చంద్రబోస్ గారు ఓ అర్దరాత్రి ఫోన్ చేసి పాట రెడీ అయిందని అన్నారు. ‘పల్లెటూరి’ అనే మంచి పాటను అందించారు. కాసర్ల శ్యాం గారు మంచి పాటను రాశారు. సదా చంద్ర గారు మంచి సంగీతాన్ని అందించారు. 90వ దశకంలో నాగార్జున సాగర్‌లో ఓ ఘటన జరిగింది. అదే ఘటన ఈ మధ్య పంజాబ్‌లో జరిగింది. నలుగురు అమ్మాయిలు.. ఓ అబ్బాయిని రేప్ చేస్తారు. అదే ఘటనపై బోయ జంగయ్య గారు ‘అడ్డ దారులు’ అనే పేరుతో నవల రాశారు. అదే నవలను ఇప్పుడు వీకెండ్ పార్టీ అని నేటి పరిస్థితులకు తగ్గట్టుగా తీస్తున్నాం. సుచిత్రా చంద్రబోస్ గారు ‘పాల బుగ్గల’ సాంగ్‌ను ఎక్కడా కూడా వల్గారిటీ లేకుండా అద్భుతంగా చిత్రీకరించారు. సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.
నిర్మాత చేతన్ మట్లాడుతూ.. ‘ సినిమా కోసం పని చేసిన అందరికీ థాంక్స్. నేను ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించడం ఆనందంగా ఉంది’ అని అన్నారు.