‘కెజియఫ్’ స్టార్ కు చిన్న దర్శకుడయితేనే సేఫ్ అంట!

‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ ఎలాంటి దారిలో అయితే వెళ్ళాడో.. ఇప్పుడు యశ్ కూడా అదే చేయబోతున్నాడు.’కెజియఫ్’ సినిమా తర్వాత యశ్ రేంజ్ మారిపోయింది. ప్రభాస్ తర్వాత ‘పాన్ ఇండియన్’ హీరో స్థాయికి వచ్చాడు. యశ్ తో  సినిమాలు చేయడానికి అన్ని చిత్ర పరిశ్రమల్లోని  నిర్మాతలు పోటీ పడుతున్నారు. దర్శకులు చాలా మంది కథలు సిద్ధం చేస్తున్నారు. ‘కెజియఫ్ 2’ సినిమా కూడా పూర్తి కావడంతో యశ్ తన తరువాతి ప్రాజెక్టులపై ఫోకస్ చేసాడు. అయితే బాహుబలి తర్వాత ప్రభాస్ ఎలాంటి దారిలో అయితే వెళ్ళాడో.. ఇప్పుడు యశ్ కూడా అదే చేయబోతున్నాడు.

‘కెజియఫ్’ ను కథలోని దమ్ము తెలిసి అన్ని భాషల్లో విడుదల చేసారు. ఇప్పుడు ఛాప్టర్ 2 కోసం అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ‘కెజియఫ్’ తర్వాత యశ్ కోసం చాలా మంది దర్శకులు కథలు సిద్ధం చేసుకున్నారు. తెలుగులో కూడా పూరీ జగన్నాథ్ సహా కొందరు అగ్ర దర్శకులు కూడా కథలు రాసుకున్నారు. య‌శ్ ఊ అంటే హిందీలో కూడా సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే, ఇప్పుడు యశ్ తీసుకున్న నిర్ణయం మాత్రం ఆశ్చర్యపరుస్తోంది. ‘కెజియఫ్’ లాంటి సంచలన సినిమా తర్వాత వెంటనే మరో అగ్ర దర్శకుడితో సినిమా చేస్తే అంచనాలు భారీగా ఉంటాయి. వాటిని రీచ్ కావడం కష్టమే. అందుకే ప్రభాస్ రూట్ నే ఇప్పుడు ఫాలో అవుతున్నాడు. ‘బాహుబలి’  తర్వాత చాలా మంది దర్శకులు వచ్చినా కూడా ‘సాహో’తో సుజీత్ కు అవకాశం ఇచ్చాడు ప్రభాస్. ఇప్పుడు యశ్ కూడా అలానే ఓ చిన్న దర్శకుడి కే  అవకాశం ఇచ్చాడు. ఎందరో అగ్ర దర్శకులు కలిసినా కూడా కన్నడలో ఒక్క సినిమా అనుభవం మాత్రమే ఉన్న దర్శకుడు నార్తాన్‌కు అవకాశం ఇచ్చాడు యశ్. నార్తాన్‌ కూడా ప్రశాంత్ నీల్ మాదిరే పక్కా మాస్ డైరెక్టర్. కెజియఫ్ కు ముందు ‘ఉగ్రం’ అనే ఒక్క సినిమా అనుభవం మాత్రమే ప్రశాంత్‌కు ఉంది. ఇప్పుడు నార్తన్ కు కూడా అంతే. నార్తాన్‌ ‘మఫ్టీ’ అనే సినిమా చేసాడు. పైగా ప్రశాంత్ నీల్ దగ్గరే అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసాడు నార్తాన్. ఆయన చెప్పిన కథ నచ్చి యశ్ అవకాశం ఇచ్చాడు. ఏదేమైనా చిన్న దర్శకుడికి అవకాశం ఇస్తే అంచనాలు కూడా కాస్త తక్కువగానే ఉంటాయి. అదే మంచిదని  అనుకుంటున్నాడు యశ్.

బయ్యర్లు షాక్ అవుతున్నారట… ‘కెజియఫ్’ ఎలాంటి అంచనాలు  లేకుండా విడుదలై.. రికార్డులు సృష్టించి, సంచలన విజయం సాధించింది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 250 కోట్ల వరకు వసూలు చేస్తే.. అందులో కన్నడలోనే 100 కోట్లకు పైగా వచ్చాయి. ఎవరూ ఊహించని రీతిలో ‘కెజియఫ్’ వసూళ్ల సంచలనం సృష్టించడంతో యశ్ పేరు దేశమంతా మార్మోగిపోయింది. ఆ ఒక్క సినిమాతోనే కన్నడ హీరో యశ్‌ పాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. ఇక ఈ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘కెజియఫ్’ చాప్టర్ 2. ఈ సినిమా విడుదలకు ముందే భారీ క్రేజ్ వచ్చింది. ఈ  సినిమా కోసం అన్ని భాషల  ఆడియన్స్ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

‘కెజియఫ్’ చాప్టర్ 2 అంచనాలకు తగ్గట్టుగానే అన్ని భాషల్లోనూ ఈ సినిమాకు భారీగా బిజినెస్‌ జరుగుతోంది. ఈ సినిమాకు నిర్మాతలు చెప్తున్న ధరలు విని బయ్యర్లు షాక్ అవుతున్నారట. ఈ చిత్రం ఓవర్సీస్ హక్కుల కోసం ఏకంగా 80 కోట్లు డిమాండ్ చేస్తున్నారట. వీటితో పాటు  దేశవ్యాప్తంగా పలు భాషల రైట్స్‌కు ​కూడా నిర్మాతలకు భారీగానే ధరలు చెబుతున్నట్లు తెలుస్తోంది.అలాగే కన్నడలో ఈ సినిమాను 100 కోట్లకు పైగా అమ్మడానికి చూస్తున్నారట. మరోవైపు హిందీలో కూడా ఈ సినిమాకు 50 కోట్లకు పైగానే రైట్స్ చెప్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే ‘కేజీఎఫ్‌ 2’ తెలుగు థియేట్రికల్‌ రైట్స్‌ సంబంధించి ఓ ఆసక్తికర వార్త టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. మొదట ‘కేజీఎప్‌’ తెలుగు హక్కుల్ని దక్కించుకున్న వారాహి సంస్థ .. ‘కేజీఎఫ్‌ 2’ హక్కులను కూడా అడిగిందట. అయితే నిర్మాతలు ఎక్కువ చెప్పడంతో వారాహి సంస్థ తప్పుకుందట. దీంతో దిల్‌ రాజు రంగంలోకి దిగి తెలుగు హక్కులను దక్కించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కోసం దిల్‌ రాజు ఏకంగా రూ.65 కోట్ల భారీ ధరను వెచ్చించినట్లు టాక్‌.