రాజమౌళికి ‘అక్కినేని జాతీయ అవార్డు’ !

మహా నటుడు అక్కినేని నాగేశ్వరరావు పేరిట నెలకొల్పిన ‘ఎ.ఎన్‌.ఆర్‌. జాతీయ అవార్డ్’ ని గత కొంతకాలంగా నటీనటులు, టెక్నీషియన్స్‌కి అందిస్తున్న విషయం తెల్సిందే. 2017 సంవత్సరానికిగాను అక్కినేని నాగేశ్వరరావు జాతీయ అవార్డ్‌ని ఆలిండియా డైరెక్టర్‌ ఎస్‌.ఎస్‌.రాజమౌళి పేరుని ఖరారు చేశారు. సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌లో ఈ అవార్డ్‌ అందజేయడం జరుగుతుంది. అలాగే ‘అన్నపూర్ణ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఫిల్మ్‌ మీడియా’ గ్రాడ్యుయేషన్‌ ఫంక్షన్‌ కూడా అదేరోజు అత్యంత వైభవంగా జరపనున్నారు. ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా సెప్టెంబర్‌ 8న హైదరాబాద్‌ ప్రసాద్‌ ల్యాబ్‌లో ప్రెస్‌మీట్‌ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎ.ఎన్‌.ఆర్‌ అవార్డ్‌ కమిటీ ఛైర్మన్‌ టి. సుబ్బరామిరెడ్డి, అక్కినేని నాగార్జున, శ్రీమతి అమల, ఎ.ఐ.ఎస్‌.ఎఫ్‌.ఎమ్‌ డీన్‌ బాలరాజు పాల్గొన్నారు.
తెలుగు జాతి గర్వించదగ్గ గొప్ప దర్శకుడు! 
ఎ.ఎన్‌.ఆర్‌. జాతీయ అవార్డ్‌ కమిటీ ఛైర్మన్‌ టి. సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ – ”దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌కి ఎంతటి ప్రాముఖ్యత వుందో అందరికీ తెల్సు. అదే రీతిలో అక్కినేని నాగేశ్వరరావుగారు ఎ.ఎన్‌.ఆర్‌. జాతీయ అవార్డ్‌ని స్థాపించి ప్రతి సంవత్సరం నటీనటులు, టెక్నీషియన్స్‌కి జాతీయ స్థాయిలో చెయ్యాలని నిర్ణయించారు. గత 9 సంవత్సరాలుగా దేవానంద్‌, షబానా ఆజ్మీ, అంజలి, వైజయంతి మాల, లతా మంగేష్కర్‌, బాలచందర్‌, హేమమాలిని, శ్యాంబెనగల్‌, అమితాబ్‌ బచ్చన్‌ వంటి లబ్ధ ప్రతిష్టులందరికీ ఎ.ఎన్‌.ఆర్‌. జాతీయ అవార్డులను అందజేయడం జరిగింది. ఒక కోటి రూపాయలను బ్యాంక్‌లో జమ చేసి దాని ద్వారా వచ్చే ఇంట్రెస్ట్‌కి కొంత జమచేసి అవార్డ్‌ గ్రహీతలకు అందించడం జరుగుతుంది. నాగేశ్వరరావుగారు చివరి రోజుల్లో కూడా అవార్డులను శాశ్వతంగా నిర్వహించాలని నాకు చెప్పడం జరిగింది. వారి కుమారుడు నాగార్జున కోహినూర్‌ డైమండ్‌లాంటి వారు. తండ్రి మాటను గౌరవించి ఆయన లక్ష్యాన్ని నెరవేరుస్తూ ఎ.ఎన్‌.ఆర్‌. జాతీయ అవార్డులను గొప్పగా నిర్వహిస్తున్నాడు. 2017 సంవత్సరానికిగాను రాజమౌళికి ఎ.ఎన్‌.ఆర్‌. జాతీయ అవార్డ్‌ని ఇవ్వడం జరుగుతుంది. మన తెలుగు జాతి గర్వించదగ్గ గొప్ప దర్శకుడు రాజమౌళి. ఒకప్పుడు తెలుగు పరిశ్రమకి అంతగా గుర్తింపు వుండేది కాదు. ఫస్ట్‌టైమ్‌ అక్కినేని నాగేశ్వరరావుగారు ‘దేవదాసు’ సినిమా చేసిన తర్వాత ఆ సినిమాను చూసి దిలీప్‌కుమార్‌ వాట్‌ ఎ గ్రేట్‌ స్టార్‌ అని అప్రిషియేట్‌ చేయడం జరిగింది. అప్పట్నుంచీ తెలుగు సినిమాకి ఒక గుర్తింపు, గౌరవం లభించింది. ఆ తర్వాత ఎన్టీఆర్‌గారు సినిమాలతోనే కాకుండా రాజకీయాల్లో కూడా జాతీయ స్థాయిలో గొప్ప పేరు సంపాదించారు. ఇప్పుడు ‘బాహుబలి’తో రాజమౌళి తెలుగు సినిమా ఖ్యాతిని జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో మన తెలుగు సినిమా సత్తాని ఎలుగెత్తి చాటారు. ప్రతి ఒక్కరూ గర్వించాల్సిన విషయం ఇది. అలాంటి గొప్ప దర్శకుడు రాజమౌళికి ఈ సంవత్సరం ఎ.ఎన్‌.ఆర్‌. జాతీయ అవార్డ్‌ని ఇవ్వాలని నిర్ణయించాం. ఈ అవార్డ్‌ని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుగారి చేతుల మీదుగా సెప్టెంబర్‌ 17న శిల్పకళా వేదికలో అందించడం జరుగుతుంర. అత్యంత వైభవంగా ఫిల్మ్‌ స్కూల్‌ని గొప్పగా రన్‌ చేస్తున్న నాగార్జునని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అక్కినేని ఫ్యామిలీతో నాకు 45 సంవత్సరాలుగా ఎంతో అనుబంధం వుంది” అన్నారు.
నాన్నగారి కల నిజమయ్యింది ! 
అక్కినేని నాగార్జున మాట్లాడుతూ – ”ఎ.ఎన్‌.ఆర్‌. అవార్డ్‌ నాన్నగారి కల. నాన్నగారి కోరిక. అలాగే అన్నపూర్ణ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఫిల్మ్‌ మీడియా నాన్నగారి కల. ఈ రెండు ఒకేసారి జరగడం చాలా సంతోషంగా వుంది. సెప్టెంబర్‌ 17న అత్యంత గ్రాండ్‌గా ఈ ఫంక్షన్స్‌ని నిర్వహించబోతున్నాం. అన్నపూర్ణ ఫిల్మ్‌ స్కూల్‌ స్టాండర్డ్స్‌ ఆఫ్‌ ఎ.ఎన్‌.ఆర్‌ వందమంది స్టూడెంట్స్‌ చదువుతున్నారు. తెలంగాణ, ఆంధ్ర నుంచే కాకుండా ఇతర రంగాల నుండి కూడా స్టూడెంట్స్‌ వస్తున్నారు ఫిల్మ్‌ స్కూల్కర. మేం పెద్దగా పబ్లిసిటీ చేయలేదు. మౌత్‌ టాక్‌తో స్ప్రెడ్‌ అయి ఇంటర్నేషనల్‌ స్థాయిలో ఆ స్టాండర్డ్స్‌ వచ్చేసింది స్కూల్‌కి. రియల్‌ కాలేజ్‌ ఎట్మాస్ఫియర్‌లా వుందని అందరూ ఫీలవుతున్నారు. అందరూ నాన్నగారి కల నిజమయ్యింది అంటున్నారు. ఈ సంవత్సరం అవార్డ్‌ ఫంక్షన్‌ని నాన్నగారి బర్త్‌డే సెప్టెంబర్‌ 20న అవార్డ్‌ ఫంక్షన్‌ చేద్దామని అనుకున్నాం. కానీ వెంకయ్యనాయుడుగారి డేట్‌ ప్రాబ్లెమ్‌ వల్ల చేయడం లేదు. నిజంగా చూస్తే నాన్నగారు చాలా హ్యాపీగా ఫీలయ్యేవారు. మా ఫ్యామిలీకి సుబ్బరామిరెడ్డిగారు ఎంతో సపోర్ట్‌ చేశారు. ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా నేను ఆయనకే ఫోన్‌ చేస్తాను. వెంటనే వచ్చి ఆ ప్రాబ్లెమ్స్‌ సాల్వ్‌ చేస్తారు. నాన్నగారితో ఎంత క్లోజ్‌గా వుండేవారో నాతో కూడా అంతే క్లోజ్‌గా వుంటారు. మా నాన్నగారితో చెప్పలేని విషయాలు అన్ని సుబ్బరామిరెడ్డిగారితో చెప్పి నాన్నగారికి చెప్పమనేవాడ్ని. అంత రిలేషన్‌ మా ఇద్దరి మధ్య వుంది. ఆయనకి నా థాంక్స్‌. రాజమౌళితో ఎప్పట్నుంచో పని చెయ్యాలని బాగా ఇష్టం. బట్‌ కుదరలేదు. ‘రాజన్న’ చిత్రానికి కొన్ని షాట్స్‌కి డైరెక్షన్‌ చేశారు. ఆయన డైరెక్షన్‌ చేసిన సీన్స్‌ నా కెరీర్‌లో ఒన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌గా నిలిచాయి. రాజమౌళి, వారి ఫ్యామిలీకి సినిమాలంటే విపరీతమైన ప్యాషన్‌. ఫెంటాస్టిక్‌గా వర్క్‌ చేస్తారు. తెలుగువారందరూ గర్వపడదగ్గ సినిమా ‘బాహుబలి’. కలలు కంటే సరిపోదు. ఆ కలల్ని నిజం చేసుకోవాలి. అది చాలా కష్టం. రాజమౌళి ఇక్కడ డ్రీమ్‌ చేయలేదు. అక్కడెక్కడో వుండి కలలు కన్నారు. ఎవరూ ఊహించనంతగా ఆ సినిమా తీశారు. ఆ టీమ్‌ని ఎలా అప్రిషియేట్‌ చేయాలో ఎవరికీ తెలియక అందరూ ‘బాహుబలి’ రాజమౌళి అంటున్నారు.

చాలా హ్యాపీగావుంది! 
ఎ.ఐ.ఎస్‌.ఎఫ్‌.ఎమ్‌ డీన్‌ బాలరాజు మాట్లాడుతూ – ”అన్నపూర్ణ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఫిల్మ్‌ మీడియాలో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుండే కాక దేశ, విదేశాల నుండి కూడా స్టూడెంట్స్‌ వచ్చి పలు కోర్స్‌లు చేస్తున్నారు. ఇప్పటివరకు ఐదు వందల మంది స్టూడెంట్స్‌ పలు శాఖల్లో శిక్షణ తీసుకోవడం జరిగింది. బి.టెక్‌, ఎం.బి.ఎ, ఇంజనీర్స్‌ ఇలా హైయ్యర్‌ ఎడ్యుకేషన్‌ చేసిన వారంతా ఫిల్మ్‌ స్కూల్‌లో తర్ఫీదు పొందారు. వారందరికీ సెప్టెంబర్‌ 17న పట్టా ఇవ్వడం జరుగుతుంది. అక్కినేని ఫ్యామిలీతో కలిసి పని చేయడం చాలా హ్యాపీగా వుంది. బాలీవుడ్‌, హాలీవుడ్‌ నుండి ఎంతో మంది ప్రముఖులు వచ్చి స్టూడెంట్స్‌కి శిక్షణ ఇప్పిస్తున్నాం. టాలెంట్‌ వున్న ఎంతో మంది ప్రతిభావంతులు తమకి ఆసక్తి వున్న కోర్స్‌లలో జాయిన్‌ కావచ్చు” అన్నారు.