దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ ‘జనతా హోటల్’ 14 న

నిర్మాతగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సురేష్ కొండేటి తాజాగా ఓ ఫీల్ గుడ్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ జంటగా అన్వర్ రషీద్ దర్శకత్వంలో సురేష్ కొండేటి నిర్మిస్తున్న ‘జనతా హోటల్ విడుదలకు సిద్ధమైంది. ఈ నెల 14న వినాయక చవితి కానుకగా ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు నిర్మాత సురేష్ కొండేటి తెలిపారు.
 
సురేష్ కొండేటి మాట్లాడుతూ… ‘‘ఉస్మాద్ హోటల్ అనే సినిమా మలయాళంలో మంచి మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. దాన్ని జనతా హోటల్ పేరుతో తెలుగులో తీసుకొస్తున్నాం. కథ-కథనంతో పాటు దుల్కర్, నిత్యామీనన్ల జంట ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. లవ్, సెంటిమెంట్, పేద, ధనిక వర్గాల మధ్య ఉండే భేదం.. తదితర అంశాల సమాహారంతో రూపొందిన చక్కని ఫీల్‌గుడ్ కమర్షియల్ ఎంటర్ టైనర్ ఇది. సాహితి రాసిన సంభాషణలు హైలైట్‌గా నిలుస్తాయి. మా సంస్థలో వచ్చిన ‘జర్నీ’, ‘పిజ్జా’, ‘డా. సలీమ్’ చిత్రాలకు ఆయన మంచి సంభాషణలు అందించారు. ఇప్పుడు ‘జనతా హోటల్’కి కూడా అద్భుతమైన మాటలు రాశారు. ఈ చిత్రానికి గోపీ సుందర్ స్వరపరచిన పాటలు ప్రత్యేక ఆకర్షణ అవుతాయి. మహానటి తర్వాత దుల్కర్ సల్మాన్‌కు మంచి పేరు తెచ్చిపెట్టే గొప్ప చిత్రమిది” అని చెప్పారు.