ప్రైవేట్ జెట్‌ లో షూటింగ్‌ కెళ్ళింది !

పూజా హెగ్డే… ఎన్టీఆర్, మహేష్‌బాబు, ప్రభాస్‌లతో పూజా హెగ్డే సినిమాలు సెట్స్‌పైన ఉన్నాయి. క్షణం తీరిక లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది  . ప్రస్తుతం ఆమె ఒకేసారి నాలుగు సినిమాల్లో నటిస్తోంది. అన్నీ అగ్ర హీరోల సినిమాలే. ఎన్టీఆర్, మహేష్‌బాబు, ప్రభాస్‌లతో ఆమె సినిమాలు సెట్స్‌పైన ఉన్నాయి. వీటితో పాటు బాలీవుడ్‌లో ‘హౌస్‌ఫుల్-4’ వంటి క్రేజీ మూవీలో అక్షయ్‌కుమార్ సరసన పూజ నటిస్తోంది. అయితే ఈ సినిమాలన్నీ షూటింగ్ జరుపుకుంటుండడంతో ఆమె బిజీ బిజీగా ఉంటోంది. ఒక సెట్ నుంచి మరో సెట్‌కు హడావుడిగా పరిగెడుతోందట.

ఈ నేపథ్యంలో ఆమెకు ఓ అత్యవసర పరిస్థితి వచ్చిందట. ఓవైపు టాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న పూజ ‘హౌస్‌ఫుల్-4’ సెట్స్‌కు పరిగెత్తాల్సి వచ్చింది. ఆ సినిమా షూటింగ్‌ను జైసల్మేర్ వంటి విమాన సౌకర్యం అంతగా లేని చోట చేస్తున్నారు.  అక్కడికి ఒకే ఒక్క ఫ్లైట్ అందుబాటులో ఉందట. అయితే ఆ విమానం దొరకకపోవడంతో పూజాహెగ్డే హైదరాబాద్ నుంచి ఏకంగా ఓ ప్రైవేట్ జెట్‌ను బుక్ చేసుకుందట. లక్షల్లో చెల్లించి ఆ జెట్‌లో జైసల్మేర్‌లోని లోకేషన్‌కు చేరుకుందట ఈ భామ. దీంతో పూజ తన వృత్తిని ఎంతో అంకితభావంతో చేస్తోందని అంటున్నారు. అంత కమిట్‌మెంట్ ఉన్న నటి  కాబట్టే ఒకేసారి నాలుగు భారీ సినిమాల్లో ఛాన్స్ అందుకుందంటున్నారు.

సొంతంగా తెలుగులో డబ్బింగ్‌

దాదాపు నాలుగేళ్లు పూర్తి కావొస్తోంది హీరోయిన్‌ పూజా హెగ్డే తెలుగు తెరపైకి ఎంట్రీ ఇచ్చి. ఇప్పుడీ విషయాన్ని ఎందుకు గుర్తుచేస్తున్నాం అంటే ఓ కారణం ఉంది. ఇప్పటివరకు ఆమె పాత్రలకు డబ్బింగ్‌ ఆర్టిస్టులు వాయిస్‌ ఇచ్చారు. ఇప్పుడు ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమా కోసం పూజా సొంతంగా తెలుగులో డబ్బింగ్‌ చెప్పుకుంటున్నారు. ఇటీవల సమంత, కీర్తీ సురేశ్, అనూ ఇమ్మాన్యుయేల్‌ ఇలా కొందరు సొంత గొంతు వినిపించారు. ఇప్పుడు పూజా వంతు వచ్చింది. ఎన్టీఆర్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమాకు తమన్‌ స్వరకర్త. ఈ ఏడాది దసరాకు ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.