అమర సైనికులకు నివాళి !… మేజర్ చిత్ర సమీక్ష

సోనీ పిక్చర్స్, సూపర్ స్టార్ మహేష్ జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ సినిమాను శశికిరణ్‌ తిక్కా దర్శకత్వంలో మహేష్‌ బాబు, అనురాగ్‌ రెడ్డి, శరత్‌ చంద్ర ఈ చిత్రాన్ని నిర్మించారు.

‘మేజర్‌’… 26/11 రియల్‌ హీరో మేజర్‌ సందీప్ ఉన్నికృష్ణన్‌ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన చిత్రమిది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్‌ సినిమాపై ఆసక్తిని పెంచాయి. దానికి తోడు మూవీ ప్రమోషన్స్‌ కూడా ఢిపరెంట్‌గా, గ్రాండ్‌గా చేయడంతో ‘మేజర్‌’పై అంచనాలు పెరిగాయి. పైగా ఈ సినిమా నిర్మాణంలో మహేశ్‌ బాబు కూడా పాలుపంచుకోవడంతో ఈ చిత్రంపై హైప్‌ క్రియేట్‌ అయింది.

కధ…  సందీప్‌ ఉన్ని కృష్ణన్‌(అడివి శేష్‌).. ఓ మధ్య తరగతి కుటుంబానికి చెందిన యువకుడు. చిన్నప్పటి నుంచి భారత సైన్యంలో పనిచేయాలనే తపనతో జీవిస్తుంటాడు. కానీ అతని తండ్రికి (ప్రకాశ్‌ రాజ్‌) కొడుకుని డాక్టర్‌ చేయాలని, తల్లికి (రేవతి) ఇంజినీరింగ్‌ చదివించాలని ఉంటుంది. చివరికి కొడుకు ఆశయాలకు, ఆలోచనకు వాళ్ల ఇష్టాన్ని చంపుకుంటారు. సందీప్‌ కష్టపడి ఇండియన్‌ ఆర్మీలో జాయిన్‌ అవుతాడు. స్కూల్‌ డేస్‌లో ఇష్టపడిన ఇషా(సయీ మంజ్రేకర్‌)ని పెళ్లి చేసుకుంటాడు. కానీ ఆమెతో ఎక్కువ సమయం గడపలేకపోతాడు. దీంతో వీరిమధ్య విభేదాలు వస్తాయి. చివరకు విడాకుల వరకు వెళతారు. మరోవైపు ‘ఇల్లు, కుటుంబం కంటే దేశమే ఎక్కువ’ అని భావించే సందీప్‌.. అంచెలంచెలుగా ఎదిగి భారత సైన్యంలో ముఖ్యమైన ఎన్‌ఎస్‌జీ (NSG) కమాండోలకు శిక్షణ ఇచ్చే స్థాయికి చేరుతాడు. ఓసారి తను ఇంటికి వెళ్లేందుకు పై అధికారి(మురళీ శర్మ) దగ్గర అనుమతి తీసుకొని బెంగళూరు బయలుదేరుతాడు సందీప్‌. అదే సమయంలో ముంబై తాజ్‌ హోటల్‌పై ఉగ్రవాదులు దాడికి పాల్పడతారు. ఆ సమయంలో తన ప్రయాణాన్ని రద్దు చేసుకొని ‘51 ఎస్‌ఎస్‌ జీ’ బృందంతో కలిసి ముంబైకి వెళతాడు. తాజ్‌ హోటల్‌లో దాగి ఉన్న ఉగ్రవాదులను సందీప్‌ ఎలా మట్టుపెట్టాడు? హోటల్‌లో బందీగా ఉన్న సామాన్య ప్రజలను ఎలా కాపాడాడు? ప్రజల ప్రాణాలను రక్షించేందుకు తన ప్రాణాలను ఎలా పణంగా పెట్టాడు? అనేది ఈ  సినిమాలో చూడాలి…

విశ్లేషణ… సందీప్‌ ఉన్ని కృష్ణన్‌ అతి చిన్న వయసు అంటే 31 ఏళ్ల వయసులోనే దేశ సేవలో భాగంగా అమరుడయ్యాడు. అశోక చక్ర బిరుదుతో ఘనంగా నివాళి అర్పించింది దేశం. ఇవన్నీ ‘మేజర్‌’ సినిమా తీయడానికి కథగా మారాయి. బయోపిక్‌ అంటే.. రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది. ఉన్నది ఉన్నట్లు చూపిస్తే.. అది డాక్యుమెంటరీ అవుతుంది. చొరవ తీసుకొని కమర్షియల్‌ హంగులను జోడిస్తే.. మొదటికే మోసం వస్తుంది. కథతో పాటు అందులోని ఆత్మనూ తీసుకుని తెరకెక్కిస్తే.. ఆ చిత్రాలను ప్రేక్షకులను ఆదరిస్తారు. ఈ విషయంలో దర్శకుడు శశి కిరణ్‌ తిక్క సఫలమయ్యాడు. దేశం కోసం ప్రాణాలు అర్పించే జవాను కథ అనగానే ఎమోషన్‌ ఉంటుంది. ఎవరయినా ఈ తరహా కథకు కనెక్ట్‌ అవుతారు. ఉగ్రదాడులకు ముందు సందీప్‌ లైఫ్‌ ఎలా ఉండేది అన్నది ఈ చిత్రంలో చెప్పే ప్రయత్నం చేశారు. బాల్యం, చదువు, టీనేజ్‌ లవ్‌స్టోరీ, పేరెంట్స్‌, సొసైటీపై తనకుంటూ గౌరవం, ఆర్మీ ఆలోచన, అతను ఎదిగిన తీరు ఇవన్నీ కళ్లకు కట్టినట్టు చూపించారు దర్శకుడు శశికిరణ్‌. ఆర్మీలో చేరిన తర్వాత ‘సోల్జర్‌’అంటే ఏంటి అని పై అధికారి అడిగినప్పుడు.. సందీప్‌ చెప్పే సమాధానం ప్రేక్షకుడిలో ఉద్వేగాన్ని కలిగిస్తాయి. అలాగే ట్రైనింగ్‌ సమయంలో సందీప్‌తో పాటు మిగిలిన జవాన్లు పడే కష్టాలను కూడా తెరపై కళ్లకు కట్టినట్లు చూపించాడు దర్శకుడు. సందీప్‌, ఈషాల మధ్య ప్రేమకథను క్యూట్‌గా చూపించారు. సెకండాఫ్‌లో మొత్తం 26\11 ఉగ్రదాడినే చూపించాడు. తాజ్‌ హోటల్‌లో ఉగ్రవాదులు చేసిన అరాచకాలు.. వారిని మట్టుపెట్టేందుకు మేజర్‌ ఉన్నికృష్ణన్‌ పన్నిన వ్యూహాలు.. ప్రాణాలకు తెగించి సామాన్య ప్రజలను కాపాడిన తీరు.. ప్రతీదీ థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది.

నటీనటులు…  మేజర్‌ సందీప్‌ ఉన్ని కృష్ణన్‌ పాత్రలో అడివి శేష్‌ నటించడం కంటే లీనమయ్యాడని  చెప్పాలి. ఆ పాత్రకు వందశాతం న్యాయం చేశాడు. ఎమోషన్స్‌ పలికిస్తూనే.. హీరోయిజాన్ని తెరపై ఆవిష్కరించాడు.  ఈ పాత్ర కోసం శేష్‌ పడిన కష్టమంతా తెరపై కనిపిస్తుంది. ఇక పేరెంట్స్‌  ప్రేమను నోచుకొని ఉన్నత కుటుంబానికి చెందిన  ఇషా పాత్రలో  సయీ మంజ్రేకర్‌ ఒదిగిపోయింది. ఇక సందీప్‌ తండ్రిగా ప్రకాశ్‌ రాజ్‌ అద్భుతంగా నటించాడు. క్లైమాక్స్‌లో ప్రకాశ్‌రాజ్‌ సంభాషణలు కంటతడిపెట్టిస్తాయి తల్లిగా రేవతి మెప్పించారు. ఆర్మీ అధికారిగా మురళీ శర్మ అద్భుతమైన నటన కనబర్చారు. హోటల్‌లో చిక్కుకున్న హైదరాబాద్‌ యువతి ప్రమోదారెడ్డిగా శోభిత ధూళిపాళ మంచి నటనను కనబరిచింది. ఈ సినిమాలో కీలకమైన పాత్రల్లో ఆమెది కూడా ఒక్కటి.

సాంకేతికం…  శ్రీచర‌ణ్ పాకాల నేప‌థ్య సంగీతం సినిమాకు పెద్ద ఎసెట్ అయ్యింది. తన నేపథ్య సంగీతంతో సినిమాను మరోస్థాయిలో నిలబెట్టాడు. ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే ఫైట్‌ సీన్స్‌కి తనదైన బీజీఎంతో గూస్‌ బంప్స్‌ తెప్పించాడు.అబ్బూరి ర‌వి రాసిన ఎమోష‌న‌ల్ డైలాగ్స్  ప్రేక్ష‌కుడికి ఎమోష‌న‌ల్‌గా క‌నెక్ట్ అవుతాయి. వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ చాలా రిచ్ గా ఉంది. పవన్‌ కల్యాణ్‌ ఎడిటింగ్‌ పర్వాలేదు. – రాజేష్