అల్లూరి సీతారామరాజు ‘సూపర్ స్టార్’ కృష్ణకు సన్మానం ! 

ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జూలై 4, 2022 న ఘనంగా జరపబోయే అల్లూరి సీతారామరాజు 125వ జయంతి జాతీయ వేడుకల ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ  సందర్భంగా… “అల్లూరి సీతారామరాజు” సినిమా తీసిన సూపర్‌ స్టార్‌ కృష్ణకు సన్మానం జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, తెలంగాణ, ఏపీ మంత్రులు, శ్రీనివాస్‌ గౌడ్, అవంతి శ్రీనివాస్, నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు, కృష్ణ సోదరుడు,నిర్మాత ఆదిశేషగిరి రావు, మోహన్‌ బాబు పాల్గొన్నారు.
చిన్నతనంలో ‘అగ్గి రాముడు’ సినిమా చూసినప్పుడు అల్లూరి సీతారామరాజు గురించి తెలిసిందని సూపర్‌ స్టార్‌ కృష్ణ తెలిపారు. తాను నటుడు కాక ముందు నుంచి అల్లూరి గురించి బుర్రకథల రూపంలో అనేక విషయాలు వింటూ వచ్చానని… ఒకరోజు ఎన్టీఆర్ తదుపరి చిత్రం అల్లూరి సీతారామరాజు అని చదివా.. ఎన్టీఆర్ ఎప్పుడు ఈ చిత్రం తీస్తారా? అని ఎదురు చూశా. ‘ఎవరూ సీతారామరాజు చరిత్రని  తెరకెక్కించడం లేదు’ అని బాధపడేవాడిని. హీరో అయ్యాక ఎన్నో చిత్రాలు చేశా కానీ, ఒక గొప్ప చిత్రం తీయాలనే కోరిక ఉండేది. నా 100వ చిత్రం అల్లూరి సీతారామరాజు ను ఎంచుకుని నేనే నిర్మించానని అన్నారు. ఆ చిత్రం ఎంతటి విజయం సాధించిందో మీ అందరికీ తెలిసిందే! . నేను 365 సినిమాల్లో నటించినప్పటికీ నా ఉత్తమ చిత్రం ఎప్పటికి అల్లూరి సీతారామరాజే. ఏడాది పాటు ఆ చిత్రం ప్రేక్షకులను అలరించింది” అని కృష్ణ చెప్పారు.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ… “ఆజాదీ కా అమృత్ మహోత్సవ్” లో భాగంగా  స్వాతంత్ర సమరయోధులను గుర్తించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.  బ్రిటిష్ వారికి వణుకు పుట్టించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు.హైదరాబాద్ లో నిర్మిస్తున్న రాంజీ గోండ్ మ్యూజియాన్ని త్వరగా పూర్తి చేయాలన్న ఆయన విశాఖ లంబసింగిలో కడుతున్న మ్యూజియాన్ని సంవత్సరంలో పూర్తి చేస్తామన్నారు. ఈ నెల 13న అల్లూరి సీతారామరాజు సొంత గ్రామం మొగల్లు వెళుతున్నామన్నారు. హైదరాబాద్ లో అల్లూరి మ్యూజియానికి రూ.18 కోట్లు కేటాయించామన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం కోటి రూపాయలు విడుదల చేసిందన్నారు. ఢిల్లీ లో తెలుగువాడి చరిత్ర తెలియడానికి విజ్ఞాన భవన్‌లో అద్భుత కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తామన్నారు.
మోహ‌న్ బాబు మాట్లాడుతూ… “తాను రూ.300 జీతానికి అల్లూరి సీతారామరాజు సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశానని మోహన్ బాబు గుర్తుచేసుకున్నారు. అందరికి  సహాయం చేసే వ్యక్తి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అని కొనియాడారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ…అల్లూరి తెలంగాణలో పుట్టి ఉంటే 24 ఎకరాలు కేటాయించే వాళ్లమని, దానిలో మ్యూజియం ఏర్పాటు చేసేవార‌మ‌ని చెప్పారు. దక్షిణాది వాడు, తెలుగు వాడైనందునే సీతారామరాజుపై కేంద్రం వివక్ష‌ చూపుతోందని విమర్శించారు. పార్లమెంట్ లో ఆయన విగ్రహం కూడా లేదన్నారు. దానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహకరించాలని కోరారు. మంత్రి కేటీఆర్‌తో మాట్లాడి కొంపల్లిలో అల్లూరి విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పారు.