వ్యాపారవేత్తతో అమీ జాక్సన్‌ నిశ్చితార్థం

రజినీకాంత్ సరసన 2 .0 సినిమాలో మెరిసి యువత మనసు దోచుకున్న అందాల తార అమీ జాక్సన్ త్వరలో ఓ ఇంటివారు కాబోతున్నారు. అమీ జాక్సన్‌ నిశ్చితార్థం బ్రిటన్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త జార్జ్‌ పనాయొటోతో మంగళవారం జరిగింది. అమీ కొంతకాలంగా జార్జ్ తో డేటింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. కొత్త ఏడాది సందర్భంగా జాంబియాలో వీరు మంగళవారం నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ విషయాన్ని అమీ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తన అభిమానులకు తెలిపారు. ‘1 జనవరి 2019.. మన జీవితాల్లో కొత్త ప్రయాణం. ఐ లవ్యూ. నన్ను ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచుతున్నందుకు ధన్యవాదాలు’ అని పేర్కొంటూ అతనితో గడిపిన సరదా క్షణాల పిక్ పోస్ట్‌ చేసింది అమీ.. పెళ్లెప్పుడన్న విషయాన్ని మాత్రం అమీ వెల్లడించలేదు. తెలుగులో ‘ఎవడు’, ‘అభినేత్రి’ చిత్రాల్లో అమీ నటించారు. ఇటీవల విడుదలైన ‘2.ఓ’ చిత్రం ఆమెకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టిన విషయం విదితమే. ఈ సినిమాలో ఆమె రజనీకాంత్‌కు జోడీగా రోబో పాత్రలో నటించి మెప్పించారు. అమీ నిశ్చితార్థం చేసుకోవడంతో పలువురు ప్రముఖ నటులు ఆమెకు శుభాభివందనలు తెలిపారు