బాలకృష్ణ.. బోయపాటి శ్రీను హ్యాట్రిక్ చిత్రం ప్రారంభం

నువ్వొక మాటంటే అది ‘శబ్దం’.. అదే మాట నేనంటే అది ‘శాసనం‘’ఈ పవర్‌ఫుల్‌ డైలాగ్‌ తనదైన స్టైల్‌లో చెప్పారు నటసింహ నందమూరి బాలకృష్ణ. ‘సింహా’. ‘లెజెండ్‌’ బ్లాక్‌బస్టర్‌ చిత్రాల బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో హ్యాట్రిక్‌ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ద్వారక క్రియేషన్స్‌ బ్యానర్‌పై మిర్యాల రవీందర్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు బి. గోపాల్‌ క్లాప్‌ నివ్వగా.. ప్రముఖ నిర్మాత అంబికా కృష్ణ కెమెరా స్విచ్‌ ఆన్‌ చేశారు. ప్రముఖ నిర్మాతలు సి.కల్యాణ్‌, శివలెంక కృష్ణప్రసాద్‌ పాల్గొన్నారు.
 
నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ… “అందరూ ఎదురుచూస్తున్న బోయపాటి శ్రీను కలయికలో ద్వారక క్రియేషన్‌ మిర్యాల రవీందర్‌ రెడ్డి గారి చిత్రం ప్రారంభం జరిగింది. బోయపాటి శ్రీను తో ’సింహా’, ’లెజెండ్‌’ చేయడం..అద్భుతమైన విజయాలు అందుకోవడం జరిగింది. మా కాంబినేషన్‌ అనగానే ప్రేక్షకుల్లో, అభిమానుల్లో చాలా ఎక్కువ అంచనాలు ఉంటాయి. అయితే నాది, బోయపాటిది సిద్ధాంతం ఏంటంటే …’గతం గతః’ .మేము చేసిన సినిమాల గురించి మాట్లాడుకోకుండా… మా రాబోయే మూవీ మీదనే పూర్తిగా ద్రుష్టి పెడతాం. ఏదైతే జనం కోరుకుంటున్నారో అవి ఇవ్వాల్సిన భాద్యత మా మీద ఉంది. ఈ సినిమా కథలో కొత్తదనం .. ఆధ్యాత్మికం కూడా ఉంది. కొన్ని కథలు ఒక పాత్రలో నుండి పుట్టుకొస్తాయి. కొన్ని ఒక మనిషి వ్యక్తిత్వం నుండి పుట్టుకొస్తాయి. అయితే మా కలయికలో కథలు ఎక్కువగా మా ఆవేశం నుండి పుట్టుకొస్తాయి. మిర్యాల రవీందర్‌లాంటి మంచి మంచి యంగ్‌ ప్రొడ్యూసర్స్‌ రావాల్సిన అవసరం ఎంతో ఉంది. అటువంటి తరుణంలో మా కాంబినేషన్‌లో చాలా మంచి సినిమా ఇవ్వబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను…అన్నారు.
 
బోయపాటి శ్రీను మాట్లాడుతూ… “ద్వారక క్రియేషన్స్‌లో నా రెండవ సినిమా ఇది. బాలయ్యబాబు, నాది హ్యాట్రిక్‌ ఫిలిం. ఇండస్ట్రీలో నా మొదటి సినిమా ’భద్ర’. ఒకమంచి సినిమాతో నా లైఫ్‌ స్టార్ట్‌ అయింది. ‘సింహా వంటి భారీ విజయంతో నా జీవితానికి మంచి మలుపు వచ్చింది. ‘సింహా’, ‘లెజెండ్‌’ చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. ఇప్పుడు రాబోతున్న మూడవ సినిమాతో నా బాధ్యత మరింత పెరిగింది. ఆ రెండు సినిమాలను మించిన మంచి సినిమాను మీ ముందుకు తీసుకొచ్చి నా బాధ్యతను నెరవేర్చుకుంటాను” అన్నారు.
 
నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ…“భవిష్యత్తులో నేను చాలా సినిమాలు తీస్తుండొచ్చు. కానీ, బాలకృష్ణగారితో సినిమా అంటే గౌరవంగా భావిస్తా. బాలకృష్ణగారి అభిమానులు, సినిమా ఇష్టపడే ప్రతి ఒక్కరి నుండి అటువంటి గౌరవాన్ని పొందే విధంగా ఈ సినిమాను నిర్మిస్తానని ప్రామిస్‌ చేస్తున్నాను” అన్నారు.
 
ఈ చిత్రానికి మాటలు: ఎం.రత్నం, సంగీతం: థమన్‌ ఎస్‌.ఎస్‌, సినిమాటోగ్రఫీ: రాంప్రసాద్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌: ఎ.ఎస్‌.ప్రకాష్‌, ఎడిటింగ్‌: కోటగిరి వేంకటేశ్వరరావు, తమ్మిరాజు