సినీ కార్మికుల సంక్షేమానికి ‘క‌రోనా క్రైసిస్ చారిటీ’

కరోనా మహమ్మారి సంక్షోభం నుంచి సినిమా రంగాన్ని బయటపడేయటానికి సినీ ప్రముఖులు కంకణం కట్టుకున్నారు. నిర్మాణాత్మక కార్యక్రమాల వైపు దృష్టి సారించారు. ‘సీసీసీ’ అనే సంస్థ ద్వారా చిత్ర ప‌రిశ్ర‌మ కార్మికుల సంక్షేమార్థం ప‌లు కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించారు.ఈ ‘సీసీసీ’ (క‌రోనా క్రైసిస్ చారిటీ మ‌న‌కోసం)కి సంబంధించిన వివరాలను తమ్మారెడ్డి భరద్వాజ, దర్శకుల సంఘం అద్యక్షుడు ఎన్. శంకర్ తెలియజేశారు…
త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ మాట్లాడుతూ.. “క‌రోనా వైర‌స్ క‌ల‌క‌లం సృష్టిస్తున్న ఈ స‌మ‌యంలో సినిమా ప‌రిశ్ర‌మలోని కార్మికులు చాలా ఇబ్బందులకు లోన‌వుతున్నారు. ఇప్పుడు కూడా సోద‌ర న‌టీన‌టులు విరాళాలు ప్ర‌క‌టించి త‌మ గొప్ప మ‌న‌సును చాటుకున్నారు. ‘మ‌న సోద‌ర కార్మికుల‌కి మ‌నం ఏం చేయ‌గ‌లం’ అని చిరంజీవిగారు త‌న ఆలోచ‌న‌తో ముందుకు వ‌చ్చారు. చిరంజీవిగారి ఆధర్యంలో సురేష్ బాబు గారు, నేను, ఎన్‌.శంక‌ర్ గారు, క‌ల్యాణ్ గారు, దాము గారు అంద‌రం క‌లిసి క‌మిటీగా ఏర్పాట‌య్యి ‘సీసీసీ’ అనే సంస్థ ద్వారా చిత్ర ప‌రిశ్ర‌మ కార్మికుల సంక్షేమార్థం ప‌లు కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించాం. దీనికి మొద‌ట చిరంజీవి గారు కోటి రూపాయ‌లను ప్ర‌క‌టించారు. నాగార్జున గారు కోటి రూపాయ‌లు, ఎన్టీఆర్,మహేష్ బాబు 25ల‌క్ష‌లు విరాళాలు ప్ర‌క‌టించారు. సినీ కార్మికుల సంక్షేమ‌మే ఈ సంస్థ ముఖ్య ఆశ‌యం. ఇందుకు ప్ర‌తి ఒక్క‌రూ స‌హ‌క‌రించాలి.. అంద‌రం క‌లిస్తేనే కరోనా తెచ్చిన ఇబ్బందుల‌ను పార‌ద్రోల‌గ‌లం”.. అన్నారు.
 
ఎన్‌.శంక‌ర్ మాట్లాడుతూ.. “తెలుగు సినిమా కార్మికుల‌కు అండ‌గా నిల‌బ‌డాల‌నే సంక‌ల్పంతో చిరంజీవి గారి ఆధ్వ‌ర్యంలో సి. సి. సి. (క‌రోనా క్రైసిస్ చారిటీ మ‌న‌కోసం) అనే సంస్థ‌ని ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది. ఈ సంస్థ‌కి ఛైర్మ‌న్‌గా ‘మెగాస్టార్’ చిరంజీవి గారు ఉంటారు. అలాగే స‌భ్యులుగా త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ‌గారు, సురేష్ బాబు గారు, సి.కల్యాణ్ గారు, దాము గారు, బెన‌ర్జీ గారు, నేను స‌భ్యులుగా ఉంటాము. ఈ క‌మిటీతో పాటు డైరెక్ట‌ర్ మెహ‌ర్ ర‌మేష్ గారు, గీతా ఆర్ట్స్ బాబు గారు, కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు గారు, ప‌రుచూరి గోపాల‌కృష్ణ గారు, కొమరం వెంక‌టేష్ గారు, ఫెడ‌రేష‌న్‌కు సంబంధించి అన్ని కార్మిక సంఘాల నాయ‌కులు కూడా భాగ‌స్వాములు అవుతున్నారు. మ‌న గౌర‌వ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో అద్భుత‌మైన పోరాటం జ‌రుగుతోంది ఈ క‌రోనా వైర‌స్ మీద‌. క‌రోనాను అంత‌మొందించే ప్ర‌య‌త్నంలో ప్ర‌జ‌లంద‌రూ కూడా భాగస్వాములు కావాలి. ఈ సేవా కార్య‌క్ర‌మానికి మ‌న గౌర‌వ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గారి ఆశీస్సులు, మ‌న పుర‌పాల‌క ఐటీ శాఖామంత్రి కేటీఆర్ గారి అండ‌దండ‌లు, అధికారుల‌, పోలీస్ శాఖ వారి స‌హాయ‌స‌హ‌కారాలు కావాల‌ని కోరుతున్నాం”.. అన్నారు.