కనగాల రమేష్‌ చౌదరి ‘చెడ్డీ గ్యాంగ్‌’ టీజర్‌ విడుదల

కనగాల రమేష్‌ చౌదరి దర్శకత్వంలో రాజ్‌ ప్రొడక్షన్స్‌ ఇంటర్నేషనల్‌ పతాకంపై విక్కీరాజ్‌ నిర్మిస్తున్న చిత్రం ‘చెడ్డీ గ్యాంగ్‌’. శ్రీనివాసరెడ్డి ముఖ్యపాత్రలో నటించగా అమర్‌, ప్రదీప్‌వర్మ, ఉదయ్‌, అభి, సి.టి, ఖాదర్‌, లక్ష్మి, శృతి, కావ్య, దేవి, వీణ, జాస్మిన్‌ ఇతర పాత్రలు పోషించారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా టీజర్‌ విడుదల కార్యక్రమం ప్రసాద్‌ ల్యాబ్స్‌లో జరిగింది.
 
ముఖ్య అతిథిగా హాజరైన శివాజీరాజా మాట్లాడుతూ… ‘టైటిల్‌ చాలా బాగుంది. ఈ సినిమా విజయం సాధించాలి. తెలుగు సినిమాలో తమిళ నటీనటులు ఉండొచ్చా, లేదా అనేది ప్రస్తుతానికి అప్రస్తుతం. కానీ ఉంటే అనువాద చిత్రం అనే భావన వచ్చేది కాదు. మన తెలుగు మనం తీసుకుంటే ఇంకా బాగుంటుంది. హీరోయిన్స్ ఎలాగూ తప్పదు, చిన్న చిన్న నటీనటులను కూడానా. మన వాళ్లకు ఇంపార్టెన్స్ ఇవ్వండి వాళ్లు కుదరకపోతేనే ఇతర భాషల వారికి తీసుకురండి. అలాగే నటీనటులు కూడా ప్రచారానికి వస్తే దర్శకనిర్మాతలకు, సినిమాకు హెల్ప్ అవుతుంది. ఈ సినిమా విషయానికొస్తే మలేషియా, ముంబైలో చిత్రీకరించారు. ఆ రిచ్‌నెస్‌ కనిపిస్తోంది. ప్రతీ సినిమా హిట్ అవ్వాలని కోరుకోవడంలోనే మన పాజిటివ్‌ థింకింగ్‌ ఉంటుంది. దర్శకుడు రమేష్ చాలా సీనియర్‌. ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అన్నారు.
 
దర్శకుడు రమేష్ చౌదరి మాట్లాడుతూ… ‘మూడు దశాబ్ధాలుగా అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా, కో- డైరెక్టర్‌గా వర్క్ చేస్తున్నాను. ఈ సినిమాతో దర్శకుడిగా మారాను. పదిమంది సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగులు కేరళ అడవులకు టూర్‌కు వెళ్లి అక్కడి కోయవారి నిబంధనలను అతిక్రమించి ఇరుక్కుపోతారు. అక్కడి నుంచి వాళ్లు ఎలా బయటపడ్డారనేదే ఈ చిత్రం కథాంశం. సింగిల్‌ లైన్‌లో విక్కీరాజ్‌ గారికి స్టోరీ చెప్పాను. కేరళ రండి.. సినిమా తీద్దాం అన్నారు. అలా ఈ సినిమా మొదలైంది. 125 రోజులు షూటింగ్‌ తీశాం. మలేషియాలోనూ 25 రోజులు షూటింగ్ చేశాం. ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకముంది. ఇలాంటి చిన్న చిత్రాలు విజయం సాధిస్తే మరిన్ని మంచి చిత్రాలు రూపొందించడానికి అవకాశముంటుంది’ అన్నారు.
 
నిర్మాత మాట్లాడుతూ…  ‘ఇక్కడకు వచ్చిన అందరికీ థ్యాంక్స్‌. కేరళలోని ఎర్నాకుళం, ఇరిట్టి అడవులు, హైదరాబాద్‌లోని సారధి స్టూడియో, రామోజీ ఫిల్మ్‌సిటీ, మలేషియాలో ఈ సినిమాను తెరకెక్కించాం. మలేషియాలో తెరకెక్కించిన క్లైమాక్స్ సినిమాకు హైలైట్‌అవుతుంది. చిత్రంలో ఐదు పాటలున్నాయి. బాలీవుడ్ బ్యూటీ స్నేహా కపూర్ చేసిన ఐటమ్ సాంగ్ యువతను ఆకట్టుకుంటుంది.
 
‘పద్మాలయ’ మల్లయ్య మాట్లాడుతూ… ‘రమేష్ చౌదరి ఈ సినిమాతో దర్శకుడుగి పరిచయం అవడం సంతోషంగా ఉంది. ఎంతో వ్యయప్రయాసలకోర్చి నిర్మాత ఈ చిత్రం రూపొందించారు. ప్రేక్షకులు ఈ సినిమాను ఆదిరించాలని కోరుకుంటున్నాను’ అన్నారు.
 
సెన్సార్‌ సభ్యులు ఎంఎస్‌ రెడ్డి మాట్లాడుతూ… ‘ట్రైలర్‌ చూశాను, బాగుంది. నటీనటులు బిజీగా ఉండటం వల్ల రాలేదు కాబోలు. ప్రేక్షకులు చిన్న చిత్రాలను ఆదరిస్తేనే వారి నుంచి మరిన్ని మంచి చిత్రాలు వస్తాయి. తద్వారా ఇంకొంతమంది నటీనటులు, టెక్నీషియన్స్ లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. ఈ సినిమాకు ప్రేక్షకులు మంచి విజయాన్ని అందించాలని కోరుతున్నాను’ అన్నారు.
 
గీత రచయిత లక్ష్మణ్‌ మాట్లాడుతూ… ‘అన్ని పాటలు రాశాను. ఖర్చుకు వెనకాడకుండా ఈ సినిమాను నిర్మించి, దర్శకులు రమేష్ గారికి సపోర్ట్‌ను ఇచ్చిన నిర్మాత విక్కీరాజ్‌ గారు ఈ టీమ్‌కు దొరకడం అదృష్టం. ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరిస్తారని ఆశిస్తున్నాను’ అన్నారు.