భారీ గ్రాఫిక్‌ చిత్రం ‘భద్రకాళి’ మొదటి షెడ్యూల్‌ పూర్తి

బేబి తనిష్క, బేబి జ్యోషిక సమర్పణలో ఆర్‌. పిక్చర్స్‌ పతాకంపై సీనియర్‌ నటి సీత అమ్మవారి పాత్రలో అత్యంత భారీ గ్రాఫిక్స్‌తో చిక్కవరపు రాంబాబు నిర్మిస్తున్న చిత్రం ‘భద్రకాళి’. ఈ చిత్రం మొదటి షెడ్యూల్‌ ఇటీవల పూర్తయ్యింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సి.హెచ్‌. రాంబాబు, దర్శకుడు కె.ఎం. ఆనంద్‌ చిత్రం ప్రోగ్రెస్‌ గురించి వివరించారు.

దర్శకుడు కె.ఎం. ఆనంద్‌ మాట్లాడుతూ – ”మా చిత్రం ‘భద్రకాళి’ మొదటి షెడ్యూల్‌ పూర్తయ్యింది. ఇందులో సీత అమ్మవారు (భద్రకాళి)గా అద్భుతంగా నటిస్తున్నారు. అమ్మవారికి, భక్తుడికి, దుష్ట శక్తికి మధ్య జరిగే కథ ఇది. తమిళనాడులో ఒక భక్తుడికి జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిస్తున్నాం. ఈ చిత్రంలో 25 నిమిషాల గ్రాఫిక్స్‌ విజువల్స్‌ ప్రేక్షకులను కనువిందు చేస్తాయి. ఆంధ్ర, తమిళనాడులోని సేలం, మేచేరి పరిసర ప్రాంతాల్లో మొదటి షెడ్యూల్‌ పూర్తి చేయటం జరిగింది. నిర్మాత రాంబాబుగారు ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా ఈ చిత్రాన్ని భారీ గ్రాఫిక్స్‌తో, అత్యంత క్వాలిటీతో నిర్మిస్తున్నారు. తెలుగులో నాకు మొదటి అవకాశం ఇచ్చిన నిర్మాత రాంబాబుగారికి నా ధన్యవాదాలు” అన్నారు.

నిర్మాత సి.హెచ్‌. రాంబాబు మాట్లాడుతూ – ”కె.ఎం. ఆనంద్‌ చెప్పిన కథ నాకు బాగా నచ్చడంతో, ఆయన మీద ఉన్న నమ్మకంతో ఈ చిత్రానికి దర్శకుడిగా అవకాశం ఇచ్చాను. ఈ సినిమాని చాలా అద్భుతంగా తెెరకెక్కిస్తున్నారు. ఒక భక్తుడి యదార్థ సంఘటన ఆధారంగా వస్తున్న మూవీ ఇది. అమ్మవారి పాత్రలో సీనియర్‌ నటి సీత తనదైన శైలిలో అద్భుతంగా నటించారు. కథకి అనుగుణంగా హైదరాబాద్‌ సారథీ స్టూడియోస్‌లో ప్రవీణ్‌ ఆధ్వర్యంలో మంచి క్వాలిటీతో గ్రాఫిక్‌ వర్క్‌ జరుగుతోంది. సంగీత దర్శకుడు ఆదీష్‌ ఉత్రియన్‌ ఈ చిత్రానికి ఐదు సూపర్‌హిట్‌ సాంగ్స్‌ ఇచ్చారు. విజయ్‌ తిరుమూలం కెమెరా వర్క్‌ సినిమాకి ప్లస్‌ అవుతుంది. సెకండ్‌ షెడ్యూల్‌తో ‘భద్రకాళి’ షూటింగ్‌ పూర్తవుతుంది. త్వరలో ఆడియో విడుదల చేస్తాం” అన్నారు.

సీత, సంధ్య, మనీష్‌, ఢిల్లీ గణేశన్‌, చలపతిరావు, రఘుబాబు, తాగుబోతు రమేష్‌, చిత్రం శ్రీను, జయవాణి తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: విజయ్‌ తిరుమూలం, సంగీతం: ఆదీష్‌ ఉత్రియన్‌, గ్రాఫిక్స్‌: సారథీ స్టూడియోస్‌, ఎడిటింగ్‌: వినయ్‌రామ్‌, నిర్మాత: సి.హెచ్‌. రాంబాబు, దర్శకత్వం: కె.ఎం. ఆనంద్‌.