రెబల్ స్టార్ మాత్రమే కాదు.. మనసున్న మారాజు ప్రభాస్ !

హ్యాపీ బర్త్ డే టు ప్యాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ !

తెలుగు చిత్రాల పరిస్థితి ని పూర్తిగా మార్చేస్తూ నేటి తెలుగు దర్శకులు, ఈతరం నటులు అంతర్జాతీయ స్థాయిలో కలలు కనే ధైర్యం ఇచ్చింది ఒక చిత్రం. కేరీర్ లో సక్సెస్ తో ఉన్న అతి ముఖ్యమైన
అయిదేళ్ళని ఆ చిత్రానికి అంకితం చేసి తెలుగుపరిశ్రమ గుర్తింపుని బాక్సాఫీస్ రూపు రేఖలని మార్చేశారు ఒక హీరో. ఆ హీరో ‘ప్రభాస్’, ఆయన నటించిన ఆ సినిమా బాహుబలి.
ఆరడుగుల ఎత్తు, గంభీరమైన స్వరం, కండలు తిరిగిన దేహంతో, అమరేంద్ర బాహుబలిలా ప్రభాస్ ఠీవిగా నడిచి వస్తుంటే, రాజంటే ఇలా ఉండాలి అనిపిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా 2000 కోట్ల కలెక్షన్, కోట్లాది
హృదయాల్లో స్థానం సంపాదించుకున్న ఆ కటౌట్ కి మైనపు ప్రతిమను బ్యాంకాక్‌లో మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో ప్రతిష్టించారు.

నిర్మాతగా ఉన్న తండ్రి సూర్య నారాయణ రాజు, హీరోగా చేసిన పెద్దనాన్న
కృష్ణం రాజు తర్వాత వారసుడిగా ఈశ్వర్ తో పరిశ్రమలోకి అడుగుపెట్టి వర్షం,
ఛత్రపతి, బిల్లా, డార్లింగ్ , మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి, బాహుబలి, సాహో
లాంటి భారీ విజయాలని సాధిస్తూ ప్రభాస్ 20 ఏళ్ళలో ప్రతి చిత్రానికి చాలా
కష్టపడుతూ… తనని తాను ఎప్పటికప్పుడు కొత్తగా మలుచుకుంటూ, రెబెల్ స్టార్
నుండి పాన్ ఇండియన్ స్టార్ స్థాయిని దాటి అంతర్జాతీయ అభిమానులని
గెలుచుకున్నాడు. అసలు ‘ప్రభాస్ లేకపోతే బాహుబలి చిత్రమే లేదు’ అని
దర్శధీరుడు రాజమౌళి స్వయంగా అన్నారంటే అతని డెడికేషన్ ఏ స్థాయిలో ఉంటుందో
అర్ధం చేసుకోవచ్చు.

20 ఏళ్ళ పాటు ప్రేక్షకుల హృదయాల్లో మకుటం లేని మహారాజులా ఎదుగుతూ,
దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే స్థాయికి వచ్చినా కూడా ఏ మాత్రం
గర్వం లేకుండా తన సహ నటులతో మిగతా బృందంతో ఆప్యాయంగా ‘డార్లింగ్‌’ అని
పిలుస్తూ పిలిపించుకుంటూ ఉంటారు ప్రభాస్‌. తన కేరిర్ లో ఎలాంటి
కాంట్రవర్సీ జోలికి పోకుండా తనతో పని చేసిన దిగ్గజ నిర్మాతలు, దర్శకులు
మళ్ళీ మళ్ళీ తనతో పని చేయాలనిపిస్తుంది అని చెప్తున్నారంటే నటుడిగా తన
వ్యక్తిత్వం ఎలాంటిదో అర్ధమవుతుంది.
దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో  రామాయణం ఆధారంగా భారీ బడ్జెట్
తో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆదిపురుష్’. వాల్మీకి రామాయణంలో రాముడి వర్ణన
కి తగ్గట్టుగా ఉండే ఆహార్యం సహజంగానే ఉన్న ప్రభాస్ ఇందులో రాఘవ రాముడిగా
కనిపించనుండగా పూర్తి 3డి టెక్నాలజీ తో 250 కోట్ల విజువల్ ఎఫెక్ట్స్ తో ఈ
చిత్రం కనిపించనుంది.
అలాగే కేజీఎఫ్ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ హీరోగా డార్క్
సెంట్రిక్ థీం టెక్నాలజీ ని వాడుతూ తెరకెక్కుతున్న ఇండియాలో మొట్ట మొదటి
భారీ చిత్రం  ‘సలార్’. ఇందులోని యాక్షన్, విజువల్స్ ఇదివరకెన్నడూ చూడని
స్థాయిలో ఉంటాయని చిత్రంలో నటించిన నటులు, పనిచేసిన సాంకేతిక నిపుణులు
చెప్పడం విశేషం.

వైజయంతి మూవీస్ లాంటి ప్రఖ్యాత నిర్మాణ సంస్థలో దాదాపు 500 కోట్ల బడ్జెట్
తో భారీ సైన్స్ ఫిక్షన్ చిత్రంగా తెరకెక్కుతున్న ‘ప్రాజెక్ట్ కె’ పై
విపరీతమైన అంచనాలున్నాయి. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోన్ లాంటి పాన్
ఇండియన్ నటులు ఇందులో భాగమవుతుండగా, మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ తో
ప్రభాస్ తోడవ్వడంతో ఈ చిత్రానికి ప్రపంచ దేశాల్లో భారీ మార్కెట్
దక్కనుంది. ఇవి కాక అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తోనూ దర్శకుడు మారుతి
తో కూడా భారీ చిత్రాలు త్వరలో మొదలవ్వనున్నాయి.

గత 20 ఏళ్లు గా ప్రభాస్ ఎన్నో సేవా సహాయ కార్యక్రమాలు చేసాడు. వరదలు
వచ్చినపుడు, కోవిడ్ సమయంలోనూ ఎన్నో భారీ విరాళాలు ఇచ్చారు. అలాగే 1650
ఎకరాల ఖాజిపల్లి రిజర్వ్ ఫారెస్ట్ భూమిని దత్తత తీసుకోవడమే కాక అందులో తన
తండ్రి పేరు మీద ఎకో పార్క్ అభివృద్ధి కి కావలసిన ఎన్నో సౌకర్యాలు
సమకూర్చారు. ఇలా రెబల్ స్టార్ గా మాత్రమే కాక మంచి మనసున్న మహారాజుగా
అందరి హృదయాల్లో  సుస్థిర స్థానం సంపాదించుకున్న ప్రభాస్‌ మరెన్నో అద్భుత
విజయాలు సాధించాలని అక్టోబర్‌ 23న పుట్టినరోజు సందర్భంగా హార్దిక
శుభాకాంక్షలు!