స్ఫూర్తిదాయకమైన దెబోరా బయోపిక్‌లో జాక్వెలిన్‌

జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌… స్ఫూర్తిదాయకమైన దెబోరా బయోపిక్‌లో నటించడం చాలా ఆనందంగా ఉందని అంటోంది జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌. ప్రముఖ మహిళా క్రీడా కారిణుల జీవితాల ఆధారంగా రూపొందే బయోపిక్‌లకు బాలీవుడ్‌లో మంచి క్రేజ్‌ ఉంది. బాక్సింగ్‌ ఛాంపియన్‌ మేరీ కోమ్‌ లైఫ్‌ ఆధారంగా రూపొందిన బయోపిక్‌ విశేష ప్రేక్షకాదరణతో మంచి విజయాన్ని సాధించింది. ఇందులో మేరీకోమ్‌గా ప్రియాంక చోప్రా నటన ప్రేక్షకుల్ని మంత్రముగ్దుల్ని చేస్తుంది. ప్రస్తుతం బ్యాట్మెంటన్‌ ఛాంపియన్‌ సైనా నెహ్వాల్‌ జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరిస్తున్నారు. ఇందులో సైనాగా శ్రద్ధాకపూర్‌ నటిస్తోంది. ప్రియాంక, శ్రద్ధాల మాదిరిగానే జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ సైతం ఓ ప్రముఖ మహిళా క్రీడాకారిణి బయోపిక్‌లో నటించేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడం విశేషం.

ఇండియన్‌ సైక్లిస్ట్‌ దెబోరా హెరాల్డ్‌ జీవితం ఆధారంగా ఓ బయోపిక్‌ని నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 2014లో ఆసియా కప్‌లో రెండు గోల్డ్‌ మెడల్స్‌, 2015 తైవాన్‌ కప్‌లో ఐదు గోల్డ్‌ మెడల్స్‌, ఇండియా కప్‌లో మూడు గోల్డ్‌ మెడల్స్‌ సాధించడంతోపాటు ఇంటర్నేషనల్‌ యూనియన్‌ సైక్లిస్ట్‌ సంస్థ ప్రకటించిన ర్యాంక్‌లో వరల్డ్‌ వైడ్‌గా 4వ స్థానంలో దెబోరా నిలిచారు. ఇందులో స్థానం పొందిన తొలి ఇండియన్‌ సైక్లిస్ట్‌గానూ ఆమె రికార్డు సృష్టించారు. 2020లో జరగబోయే ఒలంపిక్‌లో పాల్గొనబోతున్నారు. ఇదిలా ఉంటే 2004లో సంభవించిన సునామి టైమ్‌లో వారం రోజులపాటు చెట్టుమీదే దెబోరా ఇరుక్కుపోయారు. వారం రోజుల సాహసవంతమైన పోరాటం తర్వాత దెబోరా ప్రాణాలతో బయటపడ్డారు. స్ఫూర్తిదాయకమైన దెబోరా బయోపిక్‌లో నటించడం చాలా ఆనందంగా ఉందని తెలిపిన జాక్వెలిన్‌ ప్రస్తుతం ‘డ్రైవ్‌’ చిత్రంలో , ఆ తర్వాత ‘కిరాక్‌పార్టీ’రీమేక్‌లోనూ నటిస్తున్నారు..