పారితోషికంలో అగ్రనాయిక ‘మణికర్ణిక’

కంగనా రనౌత్‌… బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న కథానాయికలు దీపికా పదుకొనె, ప్రియాంక చోప్రా వంటి వారి జాబితాలోకి తాజాగా కంగనా రనౌత్‌ కూడా చేరబోతుంది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న ‘మణికర్ణిక: ది క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సీ’ చిత్రానికి భారీగానే పారితోషికం పొందుతున్నట్టు తెలుస్తుంది. క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు కంగనా ఏకంగా రూ.14 కోట్లు పారితోషికంగా తీసుకుంటున్నట్టు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ‘కథ, పాత్ర, సినిమా వెయిటేజ్‌ను బట్టి పారితోషికం ఆధారపడి ఉంటుంది. అన్ని సినిమాలను ఒకేలా చూడలేం. ప్రతి సినిమా జర్నీ దేనికదే భిన్నమైనది’ అని కంగనా తెలిపారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 25న విడుదల చేయనున్నారు.
క్రిష్‌ ‘మణికర్ణిక: ది క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సీ’ నుంచి తప్పుకోవడంతో దర్శకత్వ బాధ్యతలు కంగనానే చూసుకున్నారు. పలు సన్నివేశాలను ఆమెనే చిత్రీకరించారు. వీరనారి ఝాన్సీ లక్ష్మిభాయి జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం విదితమే. ఇందులో కంగనా ఝాన్సీ రాణి లక్ష్మిభాయి పాత్రలో నటిస్తోంది. ఇటీవల విడుదలైన ఫస్ట్‌లుక్‌, ట్రైలర్‌ ఆడియెన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటుంది. దీంతోపాటు కంగనా ప్రస్తుతం ‘మెంటల్‌ హై క్యా’ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉంది.
పాత్ర కోసం  పది కిలోల బరువు 
మూడు సంవత్సరాల క్రితం హిందీ చిత్రం ‘తను వెడ్స్‌ మను: రిటర్న్స్‌’లో హాకీ ప్లేయర్‌గా కనిపించారు బాలీవుడ్‌ బ్యూటీ కంగనా రనౌత్‌. ఇప్పుడు తన తర్వాతి చిత్రం ‘పంగా’ కోసం ఆమె కబడ్డీ ప్లేయర్‌గా మారనున్నారు. ‘బరెలీ కీ బర్ఫీ’ ఫేమ్‌ అశ్విని అయ్యర్‌ తివారీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. మారుమూల గ్రామానికి చెందిన ఓ యువతి జాతీయస్థాయి కబడ్డీ క్రీడాకారిణి స్థాయికి ఎలా చేరుకుంది? అనేదే చిత్ర కథాంశం.
 
ఈ సినిమాలోని పాత్ర కోసం కంగనా పది కిలోల బరువు పెరగనున్నారు. కానీ ఒకేసారి పది కిలోలు కాకుండా ముందు ఆరు కేజీలు పెరిగి, ఆ తర్వాత మరో నాలుగు కేజీలు పెరుగుతారట. అంటే… సిక్స్‌ ఫ్లస్‌ ఫోర్‌ ఈక్వల్‌ టు టెన్‌ అన్నమాట. ఇందుకోసం స్పెషల్‌ డైట్‌ని కూడా ఫాలో అవుతున్నారట ఆమె. ప్రస్తుతం న్యూయార్క్‌లో హాలీడేని ఎంజాయ్‌ చేస్తోన్న కంగనా అక్కడ్నుంచి రాగానే కబడ్డీ శిక్షణలో పాల్గొంటారు. కబడ్డీలో కంగనాకు ట్రైనింగ్‌ పూర్తయ్యాక ఈ సినిమా ఫస్ట్‌ షెడ్యూల్‌ భోపాల్‌లో స్టార్ట్‌ అవుతుందట.